Nalgonda: నవీన్‌ది పరువు హత్యే.. నిష్పక్ష విచారణకు ఆదేశించాలి: కలెక్టర్‌కు దళిత, ప్రజా సంఘాల వినతి

విధాత: నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం గుంటిపల్లి గ్రామంలో దళిత యువకుడైన ఇరిగి నవీన్ హత్య కుల వివక్షత నేపథ్యంలో జరిగిన పరువు హత్యేనని, దీనిపై ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిష్పాక్షిక విచారణకు ఆదేశించాలని కోరుతూ దళిత, ప్రజా సంఘాలు, బాధిత కుటుంబ సభ్యులు నల్లగొండ జిల్లా కలెక్టర్ వినయ కృష్ణారెడ్డిని, జిల్లా ఎస్పీ అపూర్వరావు వేరువేరుగా కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున […]

Nalgonda: నవీన్‌ది పరువు హత్యే.. నిష్పక్ష విచారణకు ఆదేశించాలి: కలెక్టర్‌కు దళిత, ప్రజా సంఘాల వినతి

విధాత: నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం గుంటిపల్లి గ్రామంలో దళిత యువకుడైన ఇరిగి నవీన్ హత్య కుల వివక్షత నేపథ్యంలో జరిగిన పరువు హత్యేనని, దీనిపై ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిష్పాక్షిక విచారణకు ఆదేశించాలని కోరుతూ దళిత, ప్రజా సంఘాలు, బాధిత కుటుంబ సభ్యులు నల్లగొండ జిల్లా కలెక్టర్ వినయ కృష్ణారెడ్డిని, జిల్లా ఎస్పీ అపూర్వరావు వేరువేరుగా కలిసి వినతి పత్రం అందించారు.

ఈ సందర్భంగా కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున మాట్లాడుతూ నవీన్ కేసును పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. సత్వరమే విచారణ పూర్తి చేసి ముద్దాయిలకు కఠిన శిక్షలు పడేందుకు ప్రత్యేక న్యాయమూర్తిని(పాస్ట్రాక్ కోర్టు), ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను నియమించాలన్నారు. పరువు హత్యగా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత యువతిని, తల్లిదండ్రులతోపాటు ఎంతటివారున్నా విచారించి దోషులను కఠినంగా శిక్షించాలన్నారు. బాధిత కుటుంబానికి నివాస వసతి గృహము, నష్టపరిహారము, జీవనోపాధి కల్పించాలని కోరారు. మృతుడు నవీన్, అమ్మాయి ఇద్దరు కూడా గత నాలుగు సంవత్సరాలుగా ప్రేమించికుంటున్నారని, వివాహం చేసుకోవటానికి సిద్దమైనారన్నారు. కాని కులాలు వేరుకావడంతో ఈ ఏప్రిల్ 9న ఇరిగి నవీన్ ను ప్రేమ విషయమై పెద్దల సమక్షంలో చర్చించుకుందాం అని నిడ్మనూర్ మండలం గుంటిపల్లి గ్రామానికి పిలిచి దళితుడనే కారణంతో, అమ్మాయి అతడిని వివాహం చేసుకుంటే వారి పరువు పోతుందని భావించి ఆమె తరుపు బంధువులు అత్యంత కిరాతకంగా నవీన్‌ను హత్య చేసినారన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ విభాగం జిల్లా అధ్యక్షులు ఆదిమూలం శంకర్, ఎం.ఆర్.పి.ఎస్ సీనియర్ నాయకులు బకరం శ్రీనివాస్ మాట్లాడుతూ హత్య లో పాల్గొన్న 9 మందిలో రామలింగయ్య అనే వ్యక్తి పై హత్యా నేరానికి సంబంధించిన కేసులు ఉన్నాయన్నారు. అతని పై పి.డి యాక్టు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. నవీన్ అనే వ్యక్తి అమ్మాయి కులం కాకపోవడం వల్లే దళితుడు కాబట్టే వేటాడి వెంటాడి చంపినారన్నారు. నవీన్ హత్య విషయంలో అమ్మాయితో సహ వారి తల్లిదండ్రుల ను ఎంతటివారున్నా నిష్పక్షపాతంగా విచారణ జరపాలని డిమాండ్ చేసారు. అతనితో మాట్లాడిన కాల్ డేటా,చాటింగ్ లు తీయాలన్నారు. నవీన్ అమ్మాయి కలిసి తిరిగిన వివరాలు , దిగిన ఫోటోలు కేసులో పొందుపర్చాలని పరువు హత్య గా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు పందుల సైదులు మాట్లాడుతూ నవీన్ దళితుడు కాబట్టే ఇంతవరకు ఏ ఒక్క ప్రజా ప్రతినిధి స్పందించలేదన్నారు. అన్ని కోణాల్లో సమగ్రమైన విచారణ జరిపి 60 రోజులలో చార్జీ షీట్ వేసి, 90 రోజుల్లో శిక్ష పడేలా కేసును పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. విచారణ త్వరితగతిని పూర్తి చేయడానికి ఫాస్ట్రాక్ కోర్టు ఏర్పాటు కు చొరవ చూపాలన్నారు. పరువు హత్యగా కేసును నమోదు చేసి, నవీన్ ఆ కుటుంభానికి 50 లక్షల ఆర్థిక సహాయం, నివాస గృహం, ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు.

కార్యక్రమంలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా అధ్యక్షులు కొండేటి శ్రీను, మాల మహానాడు రేఖల సైదులు, చింతపల్లి బాలకృష్ణ, మహాజన సోషలిస్టు పార్టీ నాయకులు బొజ్జ చిన్న, తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం జిల్లా అధ్యక్షులు మానుపాటి బిక్షం,తెలంగాణ దళిత సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు పోలే రవి, ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్, గాదె నరసింహ, బోగరి రామకృష్ణ మరియు బాధిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.