KCR | Telangana
(విధాత ప్రత్యేకం)
బీఆర్ఎస్ రజతోత్సవ సభ వేదికగా పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ చేసిన ప్రసంగంపై ఇప్పుడు ఆ పార్టీ శ్రేణులతోపాటు ప్రత్యర్థి పార్టీలు కూడా జోరుగా విశ్లేషణలు సాగిస్తున్నాయి. బీఆర్ఎస్ నేతలు కేసీఆర్ ప్రసంగం కోసం తెలంగాణ సమాజం అంతా ఎదురు చూస్తున్నదంటూ భారీ హైప్ క్రియేట్ చేశారు. అయితే గులాబీ శ్రేణుల అంచనాల మేరకు కేసీఆర్ ప్రసంగం సాగిందా? 25ఏళ్ల పార్టీ ఎత్తు పల్లాలపై సమీక్ష నుంచి భవిష్యత్తుకు బాటలు వేసిందా? అంటే భిన్నాభిప్రాయాలే వినిపిస్తున్నాయి. ఆత్మస్తుతి.. పరనింద తరహాలోనే కేసీఆర్ ప్రసంగం సాగిందని, కాంగ్రెస్ హామీలను గుర్తు చేస్తూ ప్రభుత్వంపై విమర్శల దాడి తప్ప.. కేసీఆర్ ప్రసంగంలో కొత్త దనం ఏదీ లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
నాటి హామీలను మరిచి విమర్శలు
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో 420 హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందన్న కేసీఆర్ వాటిని అమలు చేయలేక చతికిలపడిందంటూ విమర్శించారు. అదే సమయంలో తను ఉద్యమ కాలంలో, పదేళ్ల తన ప్రభుత్వ హయాంలో ఇచ్చిన హామీల అమలు అంశం ఎందుకు మరిచిపోయారన్న ప్రశ్న ఎదుర్కోక తప్పదు. ప్రధానంగా దళిత సీఎం, దళితులకు మూడు ఎకరాల భూమి, కేజీ టూ పీజీ ఉచిత విద్య, నిరుద్యోగ భృతి, మైనార్టీలకు 12%, గిరిజనులకు 10% రిజర్వేషన్లు వంటి హామీలు జనానికి గుర్తు రాక మానవు. ఇక సరిగ్గా ఎన్నికల ముందే తెచ్చిన బంధు పథకాలు ఆయన ఓట్ల పథకాలుగానే చూడక తప్పదు.
అలాంటప్పుడు కాంగ్రెస్ హామీల అమలు వైఫల్యమే ఓ భారీ తప్పిదమన్నట్లుగా చెప్పడం కేసీఆర్ వంటి నేత నుంచి వచ్చిన ఫక్తు రాజకీయ విమర్శలేనని అంటున్నారు. అయినప్పటికీ కాంగ్రెస్కు హామీల అమలుకు ఇంకా మూడున్నరేళ్ల సమయం ఉందన్నది గమనార్హం. కేసీఆర్ చెబుతున్నట్లుగా కాంగ్రెస్ హామీలను చూసే జనం వారికి ఓటేశారా? అంటే అది నిజంగా స్వీయ తప్పిదాలను కప్పిపుచ్చడమే అవుతుంది. కాంగ్రెస్ హామీలకంటే ఎక్కువగా కేసీఆర్ పదేళ్ల పాలనపైన వ్యతిరేకత, ఆనాటి సిటింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపైన వ్యతిరేకతనే పార్టీ ఓటమికి దారితీసిందన్న విశ్లేషణల సంగతేమిటి?
నేను చేస్తే న్యాయం.. ఎదుటోడు చేస్తే అన్యాయం
ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అన్నిటా ఫెయిలంటూ కేసీఆర్ విమర్శలు చేసే క్రమంలో భూముల అమ్మకాలలో ఏవి అమ్మాలో ఏవి అమ్మవద్దో అన్న తెలివి లేదంటూ విమర్శించారు. యూనివర్సిటీ భూములమ్ముతారా? అంటూ ప్రశ్నించారు. ఆయన సీఎంగా ఉండగానే అదే హెచ్సీయూ భూములను పలు సంస్థలకు కేటాయించడం.. ఓ దశలో ఉస్మానియా యూనివర్సిటీకి అంత భూమికి ఎందుకంటూ తను గతంలో మాట్లాడిన మాటలను పలువురు గుర్తు చేస్తున్నారు. ఇక తన హయాంలో అమ్మిన భూముల సంగతి.. ధరణి మాటున గల్లంతైన ప్రభుత్వ భూముల సంగతి.. ముఖ్యంగా ఎన్నికలకు ముందు సాగించిన కోకాపేట, మోకిల వంటి 30 వేల కోట్ల విలువైన వేయి ఎకరాల భూ విక్రయాలు చర్చకు రాక తప్పదు.
ఎన్నికలకు ముందు హడావుడిగా అవుటర్ రోడ్డు టోల్ టెండర్ ఖరారు, గడువుకు 8నెలల ముందుగానే మద్యం దుకాణాలకు కొత్త టెండర్ల వ్యవహారం కేసీఆర్ పాలనను ప్రశ్నార్థకం చేస్తుంటాయి. ఇక అసెంబ్లీ ఎన్నికలలో ఓ దశలో ధరణిని తన పాలనకు రెఫరెండమ్గా చెప్పుకొన్న కేసీఆర్.. రజతోత్సవ సభలో దాని గురించిగాని.. తాను ప్రపంచ అద్భుత నిర్మాణంగా ప్రచారం చేసుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు కూలిన ఘటనపైగానీ ప్రస్తావనే చేయకపోవడం దాటవేత రాజకీయమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే కృష్ణా గోదావరి జలాల హక్కులను కాంగ్రెస్ ప్రభుత్వం సాధించలేకపోతున్నదని గళమెత్తిన కేసీఆర్.. రజతోత్సవ సభలో దానిని వల్లే వేయకపోవడం విస్మయపరిచింది.
తన హయాంలో అవినీతి సంగతేమిటో
పదేళ్ల పాలనలో అంతా సవ్యంగా సాగిందంటూ ఆత్మస్తుతి సాగించిన కేసీఆర్ కాంగ్రెస్ పదిహేను నెలలో పాలనలో తెలంగాణ అంతా నాశనమైపోయిందంటూ బాధ పడ్డారు. కాంగ్రెస్ పాలన అంతా కమీషన్లు, అవినీతి అంటూ విమర్శలు చేశారు. అయితే కేసీఆర్ పదేళ్ల పాలనలో ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో, విద్యుత్తు ఓప్పందాల్లో సాగిన అవినీతిపైన సాగుతున్న విచారణలు, ఫార్ములా ఈ రేసు, గొర్రెల స్కామ్, సీఎంఆర్ఎఫ్ స్కామ్, టూరిజం స్కామ్, ధరణి స్కామ్, దళిత బంధు స్కామ్, చేప పిల్లల పంపిణీ స్కామ్ అంశాలు బీఆర్ఎస్ పదేళ్ల పాలన అవినీతిని నేటికీ సజీవంగానే నిలిపాయని విశ్లేషకులు అంటున్నారు.
పోలీస్ శాఖ దుర్వినియోగంలో ఎవరెంత!
పోలీసులు అధికార పార్టీ అడుగులకు మడుగులొత్తుతున్నారనేది కేసీఆర్ చేసిన మరో విమర్శ. ఇందులోకి వెళితే కేసీఆర్ వ్యవహారం గురివింద గింజ సామెతను తలపిస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలోనూ పోలీస్ శాఖను ఏ ప్రభుత్వం దుర్వినియోగం చేయలేనంతగా.. కేసీఆర్ దుర్వినియోగం చేశారన్నది బాధిత రాజకీయ వర్గాలకు బాగా అవగతమే. కేసీఆర్ లాగా పోలీస్ శాఖను వాడితే తెలంగాణ ఉద్యమాన్ని సమైక్య పాలకులు విజయవంతంగా అణిచివేసి ఉండేవారేమోనంటారు. కేసీఆర్ పాలనను ప్రశ్నిస్తూ చేసిన ప్రతిపక్షాల ఆందోళనలపై పోలీసులను ప్రయోగించిన గృహనిర్భంధాలు.. ధర్నా చౌక్ ఎత్తివేయడం.. ఉద్యోగాలపైన, పరీక్ష పత్రాల లీకేజీలపైన ఉద్యమించిన విద్యార్థులు, నిరుద్యోగులపైన, ఆర్టీసీ ఉద్యమం పైన అణిచివేతకు పాల్పడటం కేసీఆర్ మరిచిపోయినా.. జనం, రాజకీయ పక్షాలు, ప్రజాసంఘాలు మరిచిపోలేదు.
ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పోలీస్ శాఖ దుర్వినియోగంలో కేసీఆర్ పరాకాష్టకు నిలువెత్తు నిదర్శనం. మెయినాబాద్ ఫాంహౌస్ ఎపిసోడ్ తో కేసీఆర్ సాగించిన విన్యాసం.. కోదండరామ్, బండి సంజయ్, రేవంత్ రెడ్డిలపై అనుసరించిన నిర్బంధం పోలీస్ శాఖ దుర్వినియోగానికి నిదర్శనాలు. ఇక మావోయిస్టులతో శాంతి చర్చలకు కేసీఆర్ బీఆర్ఎస్ రజతోత్సవ సభ వేదికగా మద్దతు పలకడం రాజకీయ ఎత్తుగడగానే విశ్లేషిస్తున్నారు. తన హయాంలో ఎన్ కౌంటర్లు జరగలేదన్నట్లుగా కేసీఆర్ మావోయిస్టులపై ప్రేమ చూపించడం ప్రత్యర్థి పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్లను ఇరకాటంలోకి నెట్టే ఎత్తుగడగానే భావిస్తున్నారు.
కొరవడిన ఆత్మ విమర్శ
ఇకపోతే 25ఏళ్ల రాజకీయ ప్రస్థానం రజతోత్సవ సభ వేళ పార్టీ జయాపజయాలపై పోస్టుమార్టం కరువై కేవలం బహిరంగ సభకు.. అదికూడా ఏక వ్యక్తి కేసీఆర్ ప్రసంగానికే పరిమితమవ్వడం ఆ పార్టీ సంస్థాగత.. సైద్ధాంతిక.. ప్రజాస్వామిక బలహీనతలకు నిదర్శనంగా కనిపించిందంటున్నారు విశ్లేషకులు. ఇప్పటికే కుటుంబ పార్టీగా మారిన బీఆర్ఎస్ పార్టీకి రజతోత్సవ వేళ కూడా పార్టీ ప్రస్థానంపైన.. నిర్మాణ పరంగా ప్లీనరీ తరహా సమావేశాలు.. సమీక్షలు లేకపోవడంతో పార్టీ పరాజయానికి ఆత్మ విమర్శ లోపించినట్టయింది.
నిజానికి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి, పార్లమెంట్ ఎన్నికల్లో సున్నా స్థానాలకు కారణాలపై కేసీఆర్ ప్రసంగంలో ఊసు కరువైంది. పైగా అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలలో సగం వరకు మార్చాలన్న నివేదికలను పట్టించుకోకుండా నన్ను చూసి ఓటేస్తారన్నట్లుగా ఎన్నికలకు వెళ్లి పరాజయం పాలయ్యారు. ఇప్పటికీ ఆనాటి సిటింగ్ ఎమ్మెల్యేతోనే పార్టీని నియోజకవర్గాల్లో నడిపిస్తున్నారు. రజతోత్సవ వేదికపై కూడా అంతా పదేళ్ల బీఆర్ ఎస్ పాలనతో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన గులాబీ నేతలే దర్శనమిచ్చారు. అది చూసిన వారికి బీఆర్ఎస్ లో కొత్త నాయకత్వం.. కొత్త ముఖాలు ఎప్పుడోనని ఎదురుచూస్తూ నిట్టూర్చకతప్పదు.