Site icon vidhaatha

Train Accidents | భార‌తీయ రైల్వే చ‌రిత్ర‌లో అత్యంత ఘోర‌మైన ప్ర‌మాదాలు ఇవే..

Train Accidents | ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో అత్యంత ఘైరమైన రైలు ప్ర‌మాదం జ‌రిగిన విష‌యం విదిత‌మే. బెంగ‌ళూరు – హౌరా సూప‌ర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, షాలిమార్ – చెన్నై సెంట్ర‌ల్ కోర‌మండ‌ల్ ఎక్స్‌ప్రెస్‌, గూడ్స్ రైలు ఒక‌దానికొక‌టి ఢీకొన్నాయి.

ఈ ఘోర‌మైన ప్ర‌మాదంలో 233 మంది మ‌ర‌ణించ‌గా, 900 మందికి పైగా తీవ్ర గాయాల‌తో ప‌లు ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు. అయితే భార‌తీయ రైల్వే చ‌రిత్ర‌లో గ‌తంలో జ‌రిగిన అత్యంత ఘోర‌మైన ప్ర‌మాదాల గురించి కూడా తెలుసుకుందాం..

1964 నుంచి నేటి వ‌ర‌కు జ‌రిగిన ఘోర ప్ర‌మాదాలు ఇవే..

1964, డిసెంబ‌ర్ 23 : రామేశ్వ‌రంలో సంభ‌వించిన తుపాను కార‌ణంగా పంబ‌న్ – ధ‌నుష్కోడి రైలు కొట్టుకుపోయింది. ఈ ప్ర‌మాదంలో 126 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

1981, జూన్ 6 : బీహార్‌లో బాగ్మ‌తి న‌ది దాటుతుండ‌గా.. ప‌ట్టాలు త‌ప్పిన రైలు న‌దిలో ప‌డిపోయింది. ఈ ప్ర‌మాదంలో 750 మందికి పైగా మ‌ర‌ణించారు.

1995, ఆగ‌స్టు 20 : ఫిరోజాబాద్‌లో పురుషోత్తం ఎక్స్‌ప్రెస్ క‌లిండి ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొట్టిన ఘ‌ట‌న‌లో 305 మంది ప్రాణాలు కోల్పోయారు.

1998, న‌వంబ‌ర్ 26 : పంజాబ్‌లో ప‌ట్టాలు త‌ప్పిన ఫ్రంటైన‌ర్ గోల్డెన్ టెంపుల్ మెయిల్ బోగీల‌ను జ‌మ్మూ తావి – షెల్దా ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టింది. ఈ దుర్ఘ‌ట‌న‌లో 212 మంది మృతి చెందారు.

1999, ఆగ‌స్టు 2 : అవ‌ధ్ అసోం ఎక్స్‌ప్రెస్‌ను బ్ర‌హ్మ‌పుత్ర మెయిల్ ఢీకొన‌డంతో 285 మందికి పైగా మ‌ర‌ణించారు.

2002, సెప్టెంబ‌ర్ 9 : రఫీగంజ్‌లోని ధావే నదిపై హౌరా రాజధాని ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. దీంతో రఫీగంజ్ రైలు కూలి 140 మందికి పైగా మరణించారు.

2010, మే 28 : ముంబైకి వెళ్లే జ్ఞానేశ్వ‌రి రైలు ప‌ట్టాలు త‌ప్ప‌డంతో.. ఎదురుగా వ‌చ్చిన గూడ్స్ రైలు ఢీకొట్టింది. దీంతో 148 మంది మ‌ర‌ణించారు.

2012, మే 22 : హ‌బ్బ‌ళ్లి – బెంగ‌ళూరు హంపి ఎక్స్‌ప్రెస్ ఏపీకి స‌మీపంలో ఓ గూడ్స్ రైలును ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో 25 మంది చ‌నిపోగా, 43 మంది గాయ‌ప‌డ్డారు.

2014, మే 26 : యూపీలోని సంత్ క‌బీర్ న‌గ‌ర్ ప్రాంతంలో గోర‌ఖ్‌పూర్ వెళ్తున్న గోర‌ఖ్‌ధామ్ ఎక్స్‌ప్రెస్ ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టింది. ఈ దుర్ఘ‌ట‌న‌లో 25 మంది దుర్మ‌ర‌ణం చెందారు.

2016, న‌వంబ‌ర్ 20 : ఇండోర్ – పాట్నా ఎక్స్‌ప్రెస్ కాన్పూర్‌లోని పుఖ్రాయ‌న్‌కు స‌మీపంలో ప‌ట్టాలు త‌ప్ప‌డంతో 150 మంది ప్ర‌యాణికులు ప్రాణాలు కోల్పోగా, మ‌రో 150 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.

2017, ఆగ‌స్టు 23 : ఢిల్లీ వెళ్తున్న కైఫియ‌త్ ఎక్స్‌ప్రెస్‌కు సంబంధించిన 9 బోగీలు యూపీలో ప‌ట్టాలు త‌ప్ప‌డంతో 70 మందికి పైగా గాయాల‌య్యాయి.

2017, ఆగ‌స్టు 18 : పూరీ – హ‌రిద్వార్ ఉత్క‌ళ్ ఎక్స్‌ప్రెస్ ముజ‌ఫ‌ర్ న‌గ‌ర్ వ‌ద్ద ప‌ట్టాలు త‌ప్పింది. ఈ ప్ర‌మాదంలో 23 మంది చ‌నిపోగా, 60 మంది గాయ‌ప‌డ్డారు.

2022, జ‌న‌వ‌రి 13 : బీకానేర్ – గువాహ‌టి ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 12 బోగీలు ప‌శ్చిమ బెంగాల్‌లో ప‌ట్టాలు త‌ప్ప‌డంతో 9 మంది దుర్మ‌ర‌ణం చెందారు. 36 మందికి గాయాల‌య్యాయి.

Exit mobile version