IPL Final Match | ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ వేళ క్రికెట్ అభిమానులకు ఐఆర్‌సీటీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. నరేంద్రమోదీ స్టేడియంలో జరగనున్న ఫైనల్ మ్యాచ్‌కు భారీ సంఖ్యలో అభిమానులు తరలివెళ్లే అవకాశం ఉండటంతో ముంబై-అహ్మదాబాద్ మధ్య రెండు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది.

మే 31వ తేదీన అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ టైటాన్స్ (GT) తలపడనున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా పేరొందిన నరేంద్ర మోదీ స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు అహ్మదాబాద్ వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే ముంబై – అహ్మదాబాద్‌ మధ్య రెండు ప్రత్యేక రైళ్లను నడిపించాలని ఇండియన్ రైల్వేస్ నిర్ణయించింది.

క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక చార్జీలతో రెండు ఏసీ సూపర్‌ఫాస్ట్ ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు పశ్చిమ రైల్వే అధికారులు తెలిపారు. ఈ ప్రత్యేక రైళ్ల బుకింగ్‌లు శుక్రవారమే ప్రారంభమవ్వగా.. కొద్ది సమయంలో దాదాపు సీట్లు నిండిపోయాయని వెల్లడించారు. మే 31వ తేదీ ఉదయం 6.20 గంటలకు ముంబై సెంట్రల్ నుంచి బయల్దేరే ఏసీ సూపర్‌ఫాస్ట్ స్పెషల్ రైలు (Train No. 09021) మధ్యాహ్నం 12.40 గంటలకు అహ్మదాబాద్ చేరుకోనుంది.

మ్యాచ్ ముగిసిన తర్వాత తిరుగు ప్రయాణం కోసం జూన్ 1వ తేదీ తెల్లవారుజామున 3.50 గంటలకు రైలు (Train No.09044) అహ్మదాబాద్ నుంచి బయల్దేరి మధ్యాహ్నం 12.15 గంటలకు బాంద్రా టెర్మినల్‌కు చేరుకుంటుంది. ఈ స్పెషల్ ట్రైన్ టికెట్లు పీఆర్ఎస్ కౌంటర్లు, ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయని రైల్వే అధికారులు వెల్లడించారు.