Patna High Court
పాట్నా: బీహార్లో కుల సర్వే చేయాలన్న ముఖ్యమంత్రి నితీశ్కుమార్ నిర్ణయాన్ని పాట్నా హైకోర్టు సమర్థించింది. కుల సర్వేను వ్యతిరేకిస్తూ దాఖలైన అన్ని పిటిషన్లను చీఫ్ జస్టిస్ కే వినోద్ చంద్రన్ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం కొట్టివేసింది.
ఒక పిటిషన్లో వాదించిన సీనియర్ న్యాయవాది దినుకుమార్.. ప్రభుత్వ చర్య సుప్రీం కోర్టు తీర్పుకు విరుద్ధమని పేర్కొన్నారు. దీనిపై తాము సుప్రీంకోర్టుకు వెళతామని తెలిపారు. ఇదిలా ఉంటే.. కోర్టు తీర్పుపై బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ హర్షం వ్యక్తం చేశారు.
‘మా ప్రభుత్వ కుల సర్వే.. ప్రామాణికమైన, విశ్వసనీయ, శాస్త్రీయ వివరాలను సేకరిస్తుంది. ఇది ఓబీసీలకు, ఈబీసీలకు, అన్ని వర్గాల్లోని పేదలకు ఎంతో లాభం చేకూర్చుతుంది. ఆర్థిక న్యాయం దిశగా ఇదొక భారీ, విప్లవాత్మక అడుగు’ అని ఆయన ట్వీట్ చేశారు. రెండు దఫాలుగా సర్వే నిర్వహించాలని నిర్ణయించారు.
మొదటి దఫా ఈ ఏడాది జనవరిలో మొదలైంది. రెండో దశ ఏప్రిల్ 15న ప్రారంభించారు. ఈ సర్వేలో ప్జల కుల, సామాజిక, ఆర్థిక పరిస్థితులను సేకరిస్తారు. ఈ సర్వే మే 15 వరకు కొనసాగాల్సి ఉన్నా.. మే 4 న హైకోర్టు స్టే ఇవ్వడంతో ఆగిపోయింది. పేరుకు సర్వే అయినప్పటికీ.. అది కుల గణనే అని, అది కేంద్ర ప్రభుత్వం మాత్రమే చేయాల్సిందని పిటిషనర్లు వాదించారు.