PM Modi | 8న తెలంగాణకు ప్రధాని.. రూ.11,355కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన..!

PM Modi | ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 8న రాష్ట్రానికి రానున్నారు. పర్యటనలో వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును ప్రారంభించడంతో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేయనున్నారు. ఈ సందర్భంగా కేంద్ర టూరిజం శాఖ మంత్రి కిషన్‌రెడ్డి ప్రధాని పర్యటన వివరాలు వెల్లడించారు. పర్యటనలో మొత్తం రూ. 11వేల 355 కోట్ల విలువైన పనులకు శ్రీకారం కేంద్రమంత్రి తెలిపారు. ప్రధాని మొదట బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారని, అక్కడి నుంచి నేరుగా సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు […]

PM Modi | 8న తెలంగాణకు ప్రధాని.. రూ.11,355కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన..!

PM Modi | ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 8న రాష్ట్రానికి రానున్నారు. పర్యటనలో వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును ప్రారంభించడంతో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేయనున్నారు. ఈ సందర్భంగా కేంద్ర టూరిజం శాఖ మంత్రి కిషన్‌రెడ్డి ప్రధాని పర్యటన వివరాలు వెల్లడించారు. పర్యటనలో మొత్తం రూ. 11వేల 355 కోట్ల విలువైన పనులకు శ్రీకారం కేంద్రమంత్రి తెలిపారు. ప్రధాని మొదట బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారని, అక్కడి నుంచి నేరుగా సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు వస్తారని పేర్కొన్నారు. సికింద్రాబాద్‌-తిరుపతి- సికింద్రాబాద్‌ మధ్య నడువనున్న వందే భారత్‌ రైలును జెండా ఊపి ప్రారంభిస్తారని చెప్పారు.

ఆ తర్వాత రూ.715 కోట్ల వ్యయంతో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రైల్వే స్టేషన్‌లో ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన చేస్తారన్నారు. సికింద్రాబాద్‌-మహబూబ్‌నగర్‌ మధ్య రూ.1,410 కోట్ల వ్యయంతో నిర్మించిన 85 కిలోమీటర్ల డబ్లింగ్‌ రైల్వేలైన్‌ను జాతికి అంకితం చేస్తారని, ఎంఎంటీఎస్‌ రెండో దశలో భాగంగా హైదరాబాద్‌ శివారు పట్టణాలతో అనుసంధానం చేస్తూ 13 కొత్త ఎంఎంటీఎస్‌ రైళ్లను ప్రారంభిస్తారని చెప్పారు. ఈ సందర్భంగా తాజాగా చేపట్టనున్న, అందుబాటులోకి వచ్చిన అభివృద్ధి పనులు, వాటితో ప్రయోజనాలపై రూపొందించిన షార్ట్‌ఫిల్మ్‌ను తిలకిస్తారన్నారు. ఆ తర్వాత పరేడ్‌గ్రౌండ్‌కు చేరుకొని.. రూ.7,864 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న జాతీయ రహదారులకు శంకుస్థాపన చేస్తారన్నారు.

రూ.1,366 కోట్లతో బీబీనగర్‌ ఎయిమ్స్‌లో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు భూమిపూజ చేస్తారని చెప్పారు. జాతీయ రహదారుల్లో అక్కల్‌కోట్‌-కర్నూలు మధ్య ఆరు వరుసల జాతీయ రహదారి నిర్మాణానికి, మహబూబ్‌నగర్‌-చించోలి మధ్య నాలుగు వరుసల, కల్వకుర్తి-కొల్లాపూర్, నిజాంపేట-నారాయణ్‌ఖేడ్‌-బీదర్, ఖమ్మం-దేవరాపల్లి మధ్య జాతీయ రహదారి పనులకు శంకుస్థాపన చేస్తారన్నారు. అనంతరం బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వివరించారు.