Manukota బీఆరెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఫిట్టింగ్! ఒకరి సీటుపై మరొకరి కన్ను తలో బాటన నడుస్తున్న ముఖ్య నేతలు ఆధిపత్యం సాధించేందుకు ప్రయత్నాలు విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: మానుకోట జిల్లా గులాబీ కోటలో ఐదు స్తంభాలాట సాగుతున్నది. ప్రత్యర్థి పార్టీల కంటే సొంత పార్టీలో నెలకొన్న ఆధిపత్య పోరు, గ్రూపు తగాదాలు అధికార బీఆరెస్ బలాన్ని దెబ్బతీస్తున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేలను కాదని, వచ్చేసారి ఎవరికి వారు పోటీకి సిద్ధం కావడం వల్ల ఈ దుస్థితి నెలకొందన్న […]
Manukota
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: మానుకోట జిల్లా గులాబీ కోటలో ఐదు స్తంభాలాట సాగుతున్నది. ప్రత్యర్థి పార్టీల కంటే సొంత పార్టీలో నెలకొన్న ఆధిపత్య పోరు, గ్రూపు తగాదాలు అధికార బీఆరెస్ బలాన్ని దెబ్బతీస్తున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేలను కాదని, వచ్చేసారి ఎవరికి వారు పోటీకి సిద్ధం కావడం వల్ల ఈ దుస్థితి నెలకొందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మానుకోట జిల్లా బీఆరెస్లో నిన్నటి వరకు నాలుగు స్తంభాలాట సాగగా.. ఇప్పుడు తెరపైకి ఐదో గ్రూపు వచ్చి చేరింది.
వేగంగా మారుతున్న పరిణామాలు
మానుకోటలో బీఆరెస్ దుస్థితికి ఆ పార్టీ ముఖ్య నేతలే కారణమని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఎవరి ప్రయోజనాలు వారు ఆశిస్తూ పార్టీ బలాన్ని తగ్గించి, ప్రత్యర్థి పార్టీలకు వారే అవకాశం కల్పిస్తున్నారని వారు అభిప్రాయ పడుతున్నారు. ఆధిపత్య పోరులో ఉన్న ముఖ్యనేతలు.. ప్రత్యర్థి పార్టీలను పక్కనబెడితే.. సొంత పార్టీకే తలనొప్పులు తెచ్చేలా వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇటీవల వేగంగా మారుతున్న పరిణామాలు మహబూబాబాద్ జిల్లా బీఆరెస్ రాజకీయాలను ఆసక్తికరంగా మార్చి వేశాయి. నిన్నటి వరకు సిట్టింగులకు ఎదురు లేదనుకుంటున్న సమయంలో, ఆ పార్టీ లోని ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలే ఫిట్టింగులు పెడుతున్నారని అంటున్నారు. అధిష్ఠానానికి కూడా ఈ విషయాలన్నీ తెలుసని చెబుతున్నారు.
ఎవరికి వారే ఆధిపత్య ధోరణి
జిల్లాకు చెందిన మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యేలు రెడ్యానాయక్, శంకర్ నాయక్.. ఎవరికి వారు తమ అధిపత్యాన్ని నిలబెట్టుకునేందుకు గ్రూపులుగా కొనసాగుతున్నారన్న అభిప్రాయాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తానేమీ తక్కువ కాదంటూ, సడన్గా ఐదవ వ్యక్తి, ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్రావు అరంగేట్రంతో ఐదు గ్రూపులుగా పార్టీ చీలిపోయినట్టు కనిపిస్తున్నది. తాజా పరిణామాలు బీఆరెస్ ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.
ఐదుగురు ముఖ్య ప్రజా ప్రతినిధులు
రాష్ట్ర గిరిజన, మహిళా సంక్షేమ శాఖ మంత్రిగా, ఎమ్మెల్సీగా సత్యవతి రాథోడ్ మానుకోట జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆమె తొలినుంచి డోర్నకల్ నియోజకవర్గ నేతగా గుర్తింపు పొందారు. గతంలో ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక మానుకోట ఎంపీగా, ఎమ్మెల్యే రెడ్యానాయక్ కుమార్తె మాలోత్ కవిత ఉన్నారు. ఎమ్మెల్సీగా తక్కెళ్ళపల్లి రవీందర్రావు ఈ జిల్లా నుంచి ఉన్నారు. ఇక ప్రధానమైన డోర్నకల్, మానుకోట ఎమ్మెల్యేలుగా డీఎస్ రెడ్యానాయక్, బానోత్ శంకర్ నాయక్ ఉన్నారు.
డోర్నకల్, మానుకోటపై నేతల కన్ను
పైకి గంభీరంగా చెబుతున్నప్పటికీ డోర్నకల్, మానుకోట నియోజకవర్గాలపై మిగిలిన నేతలు కన్నేశారన్న చర్చ నడుస్తున్నది. మంత్రి సత్యవతి రాథోడ్ ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆశిస్తున్నారు. గతంలో తాను గెలిచిన డోర్నకల్ నుంచి కానీ, జిల్లా కేంద్రమైన మానుకోట నుంచి కానీ ఆమె పోటీ చేసేందుకు సంసిద్ధంగా ఉన్నట్లు సమాచారం.
ఇక ఎంపీ కవిత కూడా మానుకోట నుంచి అసెంబ్లీకి పోటీ చేసేందుకు ఆసక్తితో ఉన్నారని తెలుస్తున్నది. కవిత గతంలో కాంగ్రెస్ నుంచి మహబూబాబాద్ ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో మరోసారి మహబూబాబాద్ స్థానాన్ని ఆశిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో సెట్టింగ్ ఎమ్మెల్యేలైన రెడ్యానాయక్, శంకర్ నాయక్ అభద్రతా భావంలో ఉన్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
వివాదాల మధ్య శంకర్ నాయక్
మానుకోట ఎమ్మెల్యే శంకర్ నాయక్ తొలి నుంచి వివాదాస్పదుడిగా ముద్రపడ్డారు. ఆయన స్థానంలో వేరొకరికి అవకాశం కల్పిస్తారని గత ఎన్నికల్లోనే చర్చ జరిగింది. కానీ.. అప్పట్లో మార్పు లేనందున ఈసారి మార్పు తప్పదని సొంత పార్టీ నేతలే పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. దీంతో ఈ స్థానంపై సత్యవతి రాథోడ్, కవిత కన్నేశారని తెలుస్తున్నది. ఈసారి కూడా తనకే టికెట్ వస్తుందని భరోసాతో శంకర్ నాయక్ ఉన్నారు.
ఇదిలా ఉండగా ఈ వారంలోనే శంకర్ నాయక్ ముఖ్యమంత్రిని కలిశారు. నియోజకవర్గంలో పని చేసుకోవాలని సీఎం చెప్పినట్లుగా ప్రచారం సాగుతోంది. తన నియోజకవర్గ పరిధిలో అటు మంత్రి, ఇటు ఎంపీ వేలు పెట్టడంపై శంకర్ నాయక్ గుర్రుగా ఉన్నారు. అయితే.. శంకర్ నాయక్ సీఎం కలిసిన అనంతరం రవీందర్ రావు వర్గం తెరపైకి రావడం ఆసక్తికర పరిణామం.
సత్యవతిపై ఎమ్మెల్యే రెడ్యా విమర్శలు
డోర్నకల్లో ఎమ్మెల్యే రెడ్యానాయక్ సైతం మొన్నటి వరకు జరిగిన ఆత్మీయ సమ్మేళనాలలో సత్యవతి రాథోడ్ మీద బహిరంగంగానే విమర్శలు చేశారు. ఈసారి తనను ఓడించేందుకు సత్యవతి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇదే సమయంలో సత్యవతి కూడా పార్టీ ఆదేశిస్తే ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సై అనడం రెడ్యానాయక్కు పుండు మీద కారం చల్లినట్టు మారిందని అంటున్నారు.
ఎదురీదుతున్న రెడ్యా నాయక్
ఎమ్మెల్యే, మంత్రి మధ్య మాటల యుద్ధం జరుగుతున్న క్రమంలో రెడ్యానాయక్ డోర్నకల్ నియోజకవర్గంలో పల్లె పల్లె పర్యటన చేపట్టారు. కానీ.. ఎక్కడికి వెళ్లినా తమ సమస్యలు పట్టించుకోలేదని ప్రజలు ఆయనను ముఖం మీదే నిలదీస్తున్నారు. రెడ్యానాయక్ కూడా ఈ మధ్యనే సీఎంను కలవగా, ఈసారి టికెట్ నీకే అంటూ భరోసా ఇచ్చారని ప్రచారం సాగుతున్నది. ఇదిలా ఉండగా, నిరసనలకు తమ పార్టీలోని ప్రత్యర్థులే కారణమనే భావనను రెడ్యానాయక్ వ్యక్తం చేస్తున్నారు.
తెరపైకి రాజీ ఫార్ములా
డోర్నకల్, మానుకోట ఎమ్మెల్యేలపై వ్యతిరేకతను తనకు అనువుగా మలుచుకునేందుకు సత్యవతి ప్రయత్నాల్లో ఉన్నారని అంటున్నారు. వీరిద్దరినీ మార్చి.. మానుకోటలో సత్యవతికి, డోర్నకల్లో కవితకు అవకాశం కల్పించడం అనే రాజీ ఫార్ములా తెరపైకి అధిష్ఠానం తెస్తుందనే చర్చ సాగుతున్నది. శంకర్ నాయక్ను తప్పించి సత్యవతి రాథోడ్ను తెరపైకి తేవడం సులభం అవుతుందని, రెడ్యానాయక్ని తప్పించి ఆయన బిడ్డ కవితను పోటీ పెట్టడం వల్ల రెడ్యాను బుజ్జగించవచ్చని అంటున్నారు.
తెరపైకి ఎమ్మెల్సీ రవీందర్ రావు వర్గం
నాలుగు స్తంభాలాటతో తన గుర్తింపు తగ్గిందనే భావనతోనో లేక తన పట్ల ఎమ్మెల్యే శంకర్ నాయక్ అనుసరిస్తున్న నిర్లక్ష్యం కారణమోగానీ ఎమ్మెల్సీ రవీందర్ రావు గత వారం రోజులుగా మానుకోట తెరమీదికి వచ్చారు. ఆయన అనుచర వర్గం ఎమ్మెల్యే శంకర్ నాయక్కు వ్యతిరేకంగా గొంతు విప్పారు. ఈసారి ఆయనకు టికెట్ ఇవ్వకూడదంటూ సమావేశాలు ప్రారంభించారు.
కాగా..ఆయనకు టికెట్ ఇస్తే తాము వ్యతిరేకిస్తామంటూ బహిరంగంగానే హెచ్చరిస్తున్నారు. దీనిపై శంకర్ నాయక్ వర్గం కూడా తీవ్రంగానే ప్రతిస్పందించింది. కొందరు కావాలని ఇబ్బందులకు గురి చేస్తున్నారని, తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నారని ఎదురు విమర్శలు చేస్తున్నారు. ఈ మొత్తం పరిణామాలతో మానుకోట గులాబీ రాజకీయం రసకందాయంలో పడింది.
సీఎంను కలిసిన ముగ్గురు లీడర్లు
పార్టీలో గ్రూపు తగాదాల నేపథ్యంలోనే సత్యవతి రాథోడ్, కవిత, రవీందర్ రావు తాజాగా సీఎంను కలవడం మరో ఆసక్తికరమైన పరిణామం. ఈ మొత్తం వ్యవహారంలో టికెట్ ఎవరికీ వస్తదనేది ఇప్పుడు వెయ్యి డాలర్ల ప్రశ్నగా మారింది.