గత పదేళ్ళలో శాసనసభ సమావేశాలు అస్తవ్యస్తంగా మారాయని, ప్రజాస్వామిక చర్చలకు అవకాశం లేకుండా పోయిందని, సమావేశాల నిర్వాహణ సక్రమంగా సాగలేదని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు
విధాత : గత పదేళ్ళలో శాసనసభ సమావేశాలు అస్తవ్యస్తంగా మారాయని, ప్రజాస్వామిక చర్చలకు అవకాశం లేకుండా పోయిందని, సమావేశాల నిర్వాహణ సక్రమంగా సాగలేదని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం శాసన సభ ప్రాంగణంలోని కమిటీ హాల్లో జరిగిన మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు 87వ జయంతి సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డిలతో కలిసిచిత్రపటానికి పూలమాలలు నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ ప్రజలకు శాసనసభలో ఏం జరుగుతుందో కూడా గత పదేళ్లుగా తెలియకపోయేదనన్నారు. గత ప్రభుత్వం ప్రతిపక్షాలను మాట్లాడనివ్వలేదని విమర్శించారు. కొత్త ప్రభుత్వంలో శాసనసభలో డిబేట్ జరుగుతోందన్నారు. శాసనసభ డిబేట్లను కోట్లాది మంది చూస్తున్నారన్నారని తెలిపారు. చిన్న పిల్లలు కూడా శాసనసభలో జరుగుతున్న సమావేశాలపై చర్చించుకుంటున్నారని స్పీకర్ గడ్డం ప్రసాద్ పేర్కొన్నారు. శ్రీపాదరావు అసెంబ్లీలో ఉన్న సమయంలో తాను లేనందుకు బాధగా ఉంటుందన్నారు.
శాసనసభ ఉన్నంత వరకు శ్రీపాద రావుని స్మరించుకుంటూనే ఉందామని స్పీకర్ అన్నారు. ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీపాదరావు ప్రజల మనిషి. ఆయన ఎప్పుడూ ప్రజల మధ్య ఉండేవాడు. ఆయన స్పీకర్ గా ఉండి తన ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరి సమస్యలు వినేవారు. అడ్వకేటుగా జీవితం ప్రారంభించి సన్నిహితుల ,మిత్రుల ,ప్రజల కోరిక మేరకు తప్పనిసరి అయి సర్పంచిగా రాజకీయాల్లోకి ప్రవేశించారు. సర్పంచ్ గా, సమితి ప్రెసిడెంట్ గా, ఎల్ఎంబి చైర్మన్ గా, ఎమ్మెల్యేగా ఆయన సేవ చేశారు.
మంథని నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో ఆయన అనుభవం దృష్ట్యా, న్యాయ శాస్త్ర పరిజ్ఞానం దృష్ట్యా శ్రీపాద రావు గారిని స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది . శ్రీపాదరావు లాంటి ప్రజానాయకుడు లేకపోవడం చాలా బాధాకరమని గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ లు అడ్లూరి లక్ష్మణ్, బీర్ల ఐలయ్య, ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు రేవురి ప్రకాష్ రెడ్డి, శంకరయ్య, అనిరుద్ రెడ్డి, గండ్ర సత్యనారాయణ, మనోహర్ రెడ్డి, నాగరాజు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ , తదితరులు పాల్గొన్నారు.