వరంగల్ ఎంపీ అభ్యర్ధిగా తాటికొండ?
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మొగ్గు
ఎర్రవెల్లిలో కేసీఆర్ ను కలిసిన రాజయ్య
సమావేశంలో పాల్గొన్న జిల్లా నాయకులు
పరస్పర ప్రయోజనాలతో ఇరువురు రాజీ
విధాత ప్రత్యేక ప్రతినిధి: నిన్నటి వరకు వద్దనుకున్న రాజయ్య ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ముద్దాయ్యారా? అనే చర్చ సాగుతోంది. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరేందుకు తీవ్రంగా ప్రయత్నించిన స్టేషన్ ఘన్ పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య ను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనను కలువాలని శుక్రవారం ఆహ్వనించినట్లు, రాజయ్య కూడా కేసీఆర్ ను కలిసేందుకు వెళ్ళారు. ఎర్రవెల్లిలోని తన ఫాంహౌజ్ లో రాజయ్యతో పాటు వరంగల్ జిల్లా నాయకులు, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితరులతో కేసీఆర్ చర్చించినట్లు చెబుతున్నారు. రాజయ్యను బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ అభ్యర్ధిగా ఖరారు చేసినట్లు సమాచారం. కాకుంటే ఆయన పేరును అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కేసీఆర్, రాజయ్య పై రాజకీయ వర్గాల్లో రకరకాల చర్చసాగుతోంది. నిత్యం వార్తల్లో వ్యక్తిగా నిలిచే రాజయ్య మరోసారి హాట్ టాపిక్ గా మారారు.
బీఆర్ఎస్ కు శ్రీహరి, కావ్య గుడ్ బై
బీఆర్ఎస్ పార్టీ వరంగల్ ఎంపీ అభ్యర్ధిగా కడియం శ్రీహరి కుమార్తె డాక్టర్ కావ్యను ఆ పార్టీ అధినేత కేసీఆర్ ముందుగా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల్లో అనూహ్యంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీచేసేందుకు తప్పుకుంటున్నట్లు కావ్య ప్రకటించి సంచలననానికి తెరతీశారు. ఆ తర్వాత తన తండ్రి స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరితో కలిసి కావ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు. తదుపరి కాంగ్రెస్ పార్టీ కూడా కావ్యను వరంగల్ ఎంపీ అభ్యర్ధిగా ఎంపిక చేయడం చకచకా జరిగిపోయింది. దీంతో బీఆర్ఎస్ కొత్త అభ్యర్ధిని వెదుక్కోవాల్సిన పరిస్థితి నెలకొంది.
సిట్టింగ్ ఎమ్మెల్యేగా అవమానం
స్టేషన్ ఘన్ పూర్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రాజయ్యను కాదని ఎమ్మెల్సీగా ఉన్న కడియం శ్రీహరికి మొన్నటి ఎన్నికల్లో బీఆర్ఎస్ సీటు కేటాయించింది. అధినేత కేసీఆర్ మాట కాదనలేదు. ఎన్నికలయ్యే వరకు రాజయ్య ఆ పార్టీలో ఉన్నారు. రైతు సమన్వయ సమితి రాష్ట్ర చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ, స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గాల్లో ఆయన పనిచేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోర ఓటమి తర్వాత ఆ పార్టీకి రాజీనామా ప్రకటించిన మొదటి నాయకుడు డాక్టర్ రాజయ్య. తన పట్ల అధిష్టానం వ్యవహరిస్తున్న తీరు పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ముఖ్యనాయకులను కలిసేందుకు ప్రయత్నించినా స్పందించలేదంటూ పార్టీకి రాజీనామా చేశారు. వరంగల్ ఎంపీ సీటు తనకు కేటాయించాలని కోరేందుకు ప్రయత్నించినా పట్టించుకోలేదని విమర్శించారు. తర్వాత కాంగ్రెస్ లో చేరేందుకు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఆ పార్టీ నుంచి సానూకూల స్పందన రాలేదు. రాజయ్య చేరికను స్టేషన్ ఘన్పూర్ కాంగ్రెస్ వర్గాలు వ్యతిరేకిస్తూ గాంధీ భవన్ ముందు ధర్నా చేశారు. ఈ స్థితిలో రాజయ్య చేరిక నిలిచిపోయింది.
ప్రస్తుతం రాజయ్యే దిక్కు
వరంగల్ ఎంపీ అభ్యర్ధి ఎంపిక విషయంలో కేసీఆర్ కసరత్తు చేపట్టినప్పటికీ రాజయ్య ప్రత్యామ్నాయంగా కనిపించినట్లు భావిస్తున్నారు. బీఆర్ఎస్ కు మరో అవకాశం లేక పోవడంతో ఆయనే సరైన అభ్యర్ధిగా భావిస్తున్నారు. మొన్నటి వరకు పార్టీలో ఉన్న ఇతర నాయకులు పార్టీని వీడారు. సిట్టింగ్ ఎంపి పసునూరి దయాకర్ కాంగ్రెస్ లో చేరారు. వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ బీజేపీలో చేరి ఎంపీ అభ్యర్ధిగా బరిలో నిలిచారు. ప్రస్తుతం పార్టీలో ఉన్న ఎస్సీ సామాజిక వర్గం నేతలైన పెద్ది స్వప్న, జోరిక రమేష్, బోడ డిన్నా,జడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్ తదితరుల పేర్లు పరిశీలించినప్పటికీ అధినేత రాజయ్య వైపు మొగ్గు చూపినట్లు చెబుతున్నారు.
పరస్పర ప్రయోజనంతో రాజీ
అవమానించిన రాజయ్యను ఆహ్వానించి ఎంపీ టికెట్ ఇచ్చేందుకు సిద్ధం కావడం వెనుక ఆ పార్టీ అవసరం, రాజయ్య రాజకీయ భవిష్యత్తుకు ఉన్నందున పరస్పరం రాజీకి వచ్చినట్లు చెబుతున్నారు. నేడో, రేపో అందరిని మెప్పించి అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నాయి. అనూహ్య పరిణామాలు ఎదురైతే తప్ప రాజయ్య స్థానంలో మరొకరిని ఎంపిక చేసే అవకాశం లేదంటున్నారు. ప్రస్తుత పరిస్థితిల్లో పార్టీ సీనియర్ నాయకునిగా, మాదిగ సామాజిక వర్గానికి ప్రతినిధిగా, మాజీ ఉప ముఖ్యమంత్రిగా,డాక్టర్ గా ఉన్న రాజయ్య సరైన వ్యక్తిగా భావిస్తున్నారు. రాజయ్య పై వచ్చిన విమర్శలు ఈ సందర్భంగా పెద్దగా చర్చనీయాంశాలు కావని భావిస్తున్నట్లు సమాచారం.