Site icon vidhaatha

liquor Tenders | నేడు అత్యంత పకడ్బందీగా మద్యం టెండర్ల లక్కీ డ్రా

liquor Tenders |

విధాత, మహబూబ్‌నగర్: నేడు సోమవారం నిర్వహించనున్న మద్యం దుకాణాల టెండర్ల లక్కీ డ్రాకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లు ఎస్పీలను ఆదేశించినట్లుగా ఎక్సైజ్ శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఎక్సైజ్ టెండర్ల లక్కీ డ్రాకు సంబంధించిన ఏర్పాట్లపై మహబూబ్ నగర్ లోని తన క్యాంప్ కార్యాలయంలో ఎక్సైజ్ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమైక్య రాష్ట్రంలో నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అమ్మకాలు, గుడుంబా, సొంత లేబిళ్ళ ద్వారా తయారు చేసే నకిలీ మద్యం, ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చే మద్యం వల్ల ఆదాయం కోల్పోయే పరిస్థితి ఉండేదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వీటన్నిటిని కట్టడి చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పెరిగిందన్నారు.

అత్యంత పారదర్శకమైన నూతన ఎక్సైజ్ పాలసీని తీసుకురావడం వల్ల ఎక్కడ కూడా మద్యం దుకాణాల కోసం సిండికేట్లు కాకుండా కఠినమైన చర్యలు తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాల కోసం 1,31,490 దరఖాస్తులు వచ్చాయని ఆయన తెలిపారు.

రేపు ఉదయం 11 గంటల నుంచి అన్ని జిల్లా కలెక్టరేట్లలో వీడియో చిత్రీకరణ ద్వారా ఆయా జిల్లా కలెక్టర్ల సమక్షంలో అత్యంత పారదర్శకంగా మద్యం దుకాణాల లక్కీ డ్రా నిర్వహిస్తామన్నారు. గెలుపొందిన వారికి వెంటనే అలాట్మెంట్ ఆర్డర్లు కూడా అక్కడే అధికారులు అందిస్తారని మంత్రి వివరించారు. లైసెన్స్ దారులు, ఎంట్రీ పాస్ ఉన్న వారికి మాత్రమే లక్కీ డ్రా నిర్వహించే ప్రాంతంలోకి అనుమతి ఉంటుందని తెలిపారు.

ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు, ఎస్పీలకు ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి వెల్లడించారు. టెండర్ల ప్రక్రియలో చిన్న పొరపాటు జరిగినా సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. సమైక్య రాష్ట్రంలో మద్యం మీద వచ్చే ఆదాయం అక్రమ మద్యం వ్యాపారం చేసే వారి జేబుల్లోకి పోయేదని, నకిలీ మద్యాన్ని నిరోధించినందున ప్రస్తుతం ఆ ఆదాయం అంతా నేరుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికే దక్కుతోందని మంత్రి తెలిపారు.

అక్రమ మద్యాన్ని అరికట్టడంలో సమర్థవంతంగా పనిచేస్తున్న అధికారులకు క్రమం తప్పకుండా పదోన్నతులు కూడా ఇస్తామన్నారు.ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ ఎక్సైజ్ సూపరిండెంట్ సైదులు, సీఐ వీరారెడ్డి, ఎస్సై శ్రీనివాస్‌లు ఉన్నారు.

Exit mobile version