BJP, BRS | మొన్నటిదాకా ఉప్పు నిప్పు అన్నట్టు రాజ్భవన్, రాష్ట్ర ప్రభుత్వ ధోరణులు సెక్రటేరియట్లోని ప్రార్థనా స్థలాల ప్రారంభోత్సవానికి గవర్నర్ తమిళిసై దగ్గరుండి మర్యాదలు చూసుకున్న కేసీఆర్ విధాత, హైదరాబాద్: బీఆరెస్, బీజేపీ మధ్య రాజకీయంగా రహస్య అవగాహన ఉన్నదని కాంగ్రెస్ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. బీఆరెస్ నేతలు ఈ వాదనను కొట్టిపారేస్తున్నా.. తాజాగా కొత్త సెక్రటేరియట్లోని ప్రార్థనాస్థలాల ప్రారంభోత్సవాలకు గవర్నర్ను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆహ్వానించడం, దగ్గరుండి మరీ మహిళా మంత్రులు, మహిళా ఉన్నతాధికారులతో మర్యాదలు […]
BJP, BRS |
విధాత, హైదరాబాద్: బీఆరెస్, బీజేపీ మధ్య రాజకీయంగా రహస్య అవగాహన ఉన్నదని కాంగ్రెస్ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. బీఆరెస్ నేతలు ఈ వాదనను కొట్టిపారేస్తున్నా.. తాజాగా కొత్త సెక్రటేరియట్లోని ప్రార్థనాస్థలాల ప్రారంభోత్సవాలకు గవర్నర్ను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆహ్వానించడం, దగ్గరుండి మరీ మహిళా మంత్రులు, మహిళా ఉన్నతాధికారులతో మర్యాదలు చేయించడం, ఆయా కార్యక్రమాల్లో గవర్నర్కు ప్రాధాన్యం ఇవ్వడం చూస్తే..
రెండు పార్టీల మధ్య స్నేహం మరింత దృఢపడుతున్నదనే అభిప్రాయాలను రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే రాజ్భవన్లో ప్రంద్రాగస్టు వేడుకలకు సీఎం, మంత్రులు హాజరుకాలేదు. కానీ.. గురువారం గవర్నర్ వీలు చూసుకుని మరీ పట్నం మహేందర్రెడ్డితో మంత్రిగా ప్రమాణం చేయించడం ఒక విశేషమైతే.. తాజాగా సచివాలయంలోని ప్రార్థనాస్థలాల ప్రారంభోత్సవంలో సీఎం వ్యవహరించిన తీరు మరో విశేషంగా భావిస్తున్నారు.
ఆరు కీలక మార్పులు
దీనికి ముందు గత ఆరు నెలల్లో చోటు చేసుకున్న ఆరు సందర్భాలు రెండు పార్టీల మధ్య సయోధ్య అంశాన్ని చెప్పకనే చెబుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
జాడ లేని ఐటీ, ఈడీ సోదాలు
గతేడాదితో పోల్చుకుంటే బీఆరెస్ నాయకులపై ఈడీ, సీబీఐ, ఐటీ అధికారుల సోదాలు చాలా వరకు తగ్గాయి. ఇంతకు ముందు బీజేపీ మాట మాట్లాడితే ఢిల్లీ లిక్కర్ స్కాం గురించి ప్రస్తావించేది. కేసీఆర్ కుటుంబ సభ్యులను టార్గెట్ చేస్తూ మాట్లాడేది. ముఖ్యంగా కేసీఆర్ కూతురైన ఎమ్మెల్సీ కవితకు నోటీసులు పంపి, పలుమార్లు ఢిల్లీలో విచారించారు.
అయితే.. ఏం జరిగిందో ఏమోకానీ.. అరెస్టు అవుతారనుకున్న కవిత.. భద్రంగా బయటకు వచ్చేశారు. ఇప్పుడు బీజేపీ నేతల ఆరోపణల్లో లిక్కర్ స్కాం ఊసే లేకుండా పోయింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ ఉన్నప్పుడు సీఎం కేసీఆర్, బీఆరెస్ పార్టీపై తీవ్రంగా ఆరోపణలు చేసేవారు. ఓ రకంగా చెప్పాలంటే బీజేపీనీ రాష్ట్రవ్యాప్తంగా జనాల్లోకి తీసుకువెళ్లడానికి శాయశక్తులా బండి ప్రయత్నించారు.
అలాంటి బండి సంజయ్ని అధ్యక్ష పదవి నుంచి తొలగించి, కేసీఆర్తో సాన్నిత్యం ఉన్నట్లు ప్రచారంలో ఉన్న కిషన్ రెడ్డికి బాధ్యత అప్పగించడం కూడా తీవ్ర చర్చకు దారితీసింది. ఇదివరకు బీఆరెస్ నాయకులు ప్రధాని మోదీకి సన్నితుడైన అదానీ విషయం ప్రస్తావించేవారు. ప్రధానిపై తీవ్ర విమర్శనాస్త్రాలు సంధించిన కేసీఆర్.. ఇప్పుడు మాట వరసకైనా మాట్లాడటం లేదు.
దానికి బదులు.. కాంగ్రెస్, ఆ పార్టీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి టార్గెట్గా విమర్శలు ఎక్కుపెట్టారు. ఈ మధ్య కాలంలో ఎక్కడికి వెళ్లినా ధరణి విషయాన్నే ప్రస్తావిస్తూ, దానిని తలకెత్తుకోవడం మొదలు పెట్టారు. మరోవైపు జాతీయ పార్టీగా విస్తరిస్తామని టీఆరెస్ను బీఆరెస్గా మార్చిన కేసీఆర్.. జాతీయస్థాయి సంగతేమోగానీ.. ఒక్క మహారాష్ట్రకే పరిమితం అయ్యారని జరుగుతున్న పరిణామాలను గమనిస్తే అర్థమవుతున్నది.
పైగా బీఆరెస్లో చేరుతున్నవారిలో సైతం మహారాష్ట్రకు చెందిన చోటామోటా నాయకులే ఎక్కవగా కనిపిస్తున్నారు. వీటన్నింటి నేపథ్యంలో తాజాగా సెక్రటేరియట్లో ప్రార్థనాస్థలాల ప్రారంభోత్సవానికి గవర్నర్కు అందించిన ఆహ్వానం, జరిగిన మర్యాదలు మరోసారి రెండు పార్టీల మధ్య సయోధ్య, సంబంధాలపై చర్చను రేకెత్తిస్తున్నాయి.
ఒకప్పుడు ఏ ప్రభుత్వ కార్యక్రమానికీ పిలవని కేసీఆర్.. సెక్రటేరియట్ ప్రారంభోత్సవానికి కూడా ఆహ్వానించలేదు. ఆఖరుకు అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి కూడా వీలు లేకుండా చేశారన్న విమర్శలు ఉన్నాయి. అలాంటిది గురువారం ప్రత్యేకంగా రాజ్ భవన్లో సీఎం కేసీఆర్ గవర్నర్ను కలిసి మాట్లాడారు. అనంతరం శుక్రవారం సచివాలయంలో గుడి, చర్చి, మసీదు ప్రారంభానికి గవర్నర్ను ఆహ్వానించిన ముఖ్యమంత్రి స్వయంగా గవర్నర్ను సచివాలయంలోకి తీసుకెళ్లి చూపించడం విశేషం.