Site icon vidhaatha

Uganda | ఉగాండాలో మార‌ణ‌హోమం.. తిరుగుబాటుదారుల దాడిలో 25 మంది విద్యార్థులు మృతి

Uganda

విధాత: ఆఫ్రికా దేశం ఉగాండాలో మార‌ణ‌హోమం సృష్టించారు. అలైడ్ డెమొక్ర‌టిక్ ఫోర్స్‌(ఏడీఎఫ్‌)కు చెందిన సాయుధ తిరుగుబాటుదారులు ర‌క్త‌పుటేరులు పారించారు. కాంగో సరిహద్దు సమీపంలోని ఎంపాండ్వే పట్టణంలోని ఓ పాఠశాలపై విరుచుకుప‌డ్డారు. ఈ దాడిలో 25 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోగా.. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు.

ఏడీఎఫ్‌కు చెందిన సాయుధ తిరుగుబాటుదారులు లుబిరిరా సెకండరీ పాఠశాలపై దాడి చేసి, డార్మిటరీని కాల్చేశారు. అక్క‌డున్న విద్యార్థుల‌పై విచక్ష‌ణార‌హితంగా కాల్పులు జ‌రిపి 25 మందిని పొట్ట‌న పెట్టుకున్నారు. మ‌రో 8 మంది ప‌రిస్థితి విష‌మంగా ఉండ‌టంతో చికిత్స నిమిత్తం స‌మీప ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

స‌హాయ‌క చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయి. ఈ ఘ‌ట‌న‌ను ఉగాండా పోలీసు శాఖ ప్రతినిధి ఫ్రెడ్ ఎనాంగే నిర్ధారించారు. దాడి అనంతరం తిరుగుబాటుదారులు కాంగో దేశంలోని విరుంగా జాతీయ పార్కు దిశగా పారిపోయినట్లు స‌మాచారం. నిందితులను పట్టుకునేందుకు చ‌ర్య‌లు ముమ్మ‌రం చేసిన‌ట్లు పోలీసులు తెలిపారు.

తూర్పు ఉగాండాలో 1990వ దశకంలో ఈ ఏడీఎఫ్​ పుట్టుకొచ్చింది. 1986 నుంచి అక్కడ అధికారంలో ఉన్న ఉగాండా అధ్యక్షుడు యోవెరీ ముసెవెని పాలనను ఏడీఎఫ్ వ్యతిరేకిస్తోంది. 2001లో ఉగాండా సైన్యం చేతిలో ఓటమి తర్వాత.. డీఆర్​సీలోని నార్త్​ కివు రాష్ట్రంలో రీలొకేట్​​ అయ్యింది.

అక్కడి నుంచి గత రెండు దశాబ్దాలుగా ఈ ఏడీఎఫ్​ సభ్యులు కార్యకలాపాలు సాగిస్తున్నారు. వీరికి ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ తోనూ సంబంధాలు ఉన్నాయి. 2021లో ఉగాండా రాజధాని కంపాలాలో జరిగిన భీకర బాంబు దాడి ఈ ఏడీఎఫ్​ పనేనని ఆరోపణలు ఉన్నాయి.

Exit mobile version