విధాత: గ్రామీణ పేదలకు ఎంతో ఉపకరించే మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకానికి ఈ బడ్జెట్లో కేటాయింపులు గతం కంటే దారుణంగా తగ్గించారు. గత ఏడాది 73వేల కోట్లు కేటాయిస్తే ఈసారి.. 60 వేల కోట్లతో సరిపెట్టడం గమనార్హం. వాస్తవానికి గత ఆర్థిక సంవత్సరంలో 73వేల కోట్లు బడ్జెట్ అంచనాగా ఉంటే.. సవరించిన అంచనా 89,400 కోట్లు ఉన్నది. అయినా.. ఈ బడ్జెట్లో భారీగా కోత పెడుతూ.. 60 వేల కోట్లకు పరిమితం చేశారు.
ప్రధాన మంత్రి నరేంద్రమోదీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన నాలుగు బడ్జెట్లను పరిశీలిస్తే.. ఇదే అత్యంత తక్కువ కేటాయింపు కావడం గమనార్హం. కొవిడ్ కష్టకాలంలో గ్రామీణ ఉపాధి హామీ పథకానికి డిమాండ్ బాగా పెరిగింది. అంతటి కీలకమైన పథకానికి కేటాయింపులు తగ్గించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు యూపీఏ ప్రభుత్వ హయాంలో ఈ పథకాన్ని ప్రారంభించారు. కొవిడ్ కష్టకాలంలో ప్రజలు కోల్పోయిన ఆదాయంలో 20 నుంచి 80శాతాన్ని ఉపాధి హామీ పథకం భర్తీ చేసిందని అజీమ్ ప్రేమ్ జీ యూనివర్సిటీ నిర్వహించిన సర్వే పేర్కొన్నది. అదే సమయంలో ఈ పథకంలో అనేక లోపాలు కూడా ఉన్నాయి.
ఇప్పటికీ ఈ పథకం కింద చెల్లింపులు జాప్యం అవుతున్నాయి. తగినంత స్థాయిలో నిధులు కేటాయించకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. ఈ లోపాలు సవరించేందుకు ఈ బడ్జెట్లో కనీసం 2.72 లక్షల కోట్ల రూపాయలు కేటాయించాల్సిన అవసరం ఉన్నదని పీపుల్స్ యాక్షన్ ఫర్ ఎంప్లాయిమెంట్ గ్యారెంటీ అనే సంస్థ పేర్కొన్నది. అయినా.. కేంద్రం ఆ దిశగా ఆలోచించకపోగా.. కేటాయింపులు గతం కంటే తగ్గించింది.