క్యాబినెట్ సబ్ కమిటీ సూచనలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్న పౌర సమాజం ఇటీవల సీఎస్కు కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ వినతి పత్రం DHARANI । ధరణి పోర్టల్ అమలులోకి వచ్చిన మూడేళ్లు కావస్తున్నా… ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. రైతులకు చెందిన వ్యవసాయ భూములు దాదాపు 40 లక్షల ఎకరాలు నిషేధిత జాబితాలోనే ఉన్నాయి. దాదాపు 10 లక్షల ఎకరాల పట్టా భూములే నిషేధిత జాబితాలో ఉన్నాయని ఒక అంచనా…మరి కొన్ని భూములు నోషనల్ […]
DHARANI । ధరణి పోర్టల్ అమలులోకి వచ్చిన మూడేళ్లు కావస్తున్నా… ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. రైతులకు చెందిన వ్యవసాయ భూములు దాదాపు 40 లక్షల ఎకరాలు నిషేధిత జాబితాలోనే ఉన్నాయి. దాదాపు 10 లక్షల ఎకరాల పట్టా భూములే నిషేధిత జాబితాలో ఉన్నాయని ఒక అంచనా…మరి కొన్ని భూములు నోషనల్ ఖాతాలో ఉన్నాయి. పట్టా భూములు ప్రభుత్వ భూములుగా, అసైన్డ్ భూములుగా నమోదయ్యాయి. భూ యజమానులు తమ భూములు తమకు కాకుండా పోతున్నాయని ఆందోళన చెందుతున్నారు.
విధాత: భూమి సమస్యలన్నీ ధరణి (Dharani)లో పరిష్కరించామని, అంతా అద్భుతంగా ఉందని తెలంగాణ సర్కారు (Government of Telangana) బయటకు చెపుతున్నా… వాస్తవంలో అనేక సమస్యలు అలాగే దీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్నాయి. తమ సమస్యలు పరిష్కరించండని ఎవరికి చెప్పుకోవాలో రైతులకు తెలియని పరిస్థితి ఏర్పడింది. అన్నింటికీ జిందాతిల్మత్ ఒక్కటే మందు అన్న తీరుగా ప్రతి సమస్యలకు మీ-సేవ (Mee Seva)లో దరఖాస్తు చేయాలన్న సమాధానం తప్ప అధికారుల నుంచి మరొకటి రావడం లేదు.
కింది స్థాయిలో తాసిల్దార్ నుంచి ఆర్డీవోల వరకు సమస్యలు పరిష్కరించే అధికారం ధరణి చట్టంలో లేదు. కలెక్టర్ అంబాబులో ఉండరు. మీ- సేవలో దరఖాస్తు చేస్తే చాలా సాధారణంగా రిజక్ట్ అనే మెసేజ్ తప్ప మరొకటి రావడం లేదని రైతులు వాపోతున్నారు. కనీసం ఏ కారణం చేత రిజక్ట్ చేస్తున్నారో కూడ జవాబు ఇవ్వడం లేదంటున్నారు కాంగ్రెస్ నేత బక్క జడ్సన్.
క్యాబినెట్ సబ్కమిటీ నివేదిక ఎక్కడ?
ధరణి పోర్టల్ (Dharani Portal) లో సమస్యలున్నాయని గుర్తించిన సర్కారు ఎట్టకేలకు క్యాబినెట్ సబ్ కమిటీ (Cabinet Sub Committee) వేసింది. ఈ సబ్ కమిటీ ఇచ్చిన నివేదికను కూడా మూలకు పడేశారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తన్నాయి. క్యాబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన నివేదికను అమలు చేసినా చాలా వరకు సమస్యలు పరిష్కారం అవుతాయని పౌర సమాజం భావిస్తోంది.
అయితే ఆ దిశగా చర్యలు జరగడం లేదని సీనియర్ కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ అంటున్నారు. క్యాబినెట్ సబ్ కమిటీ చేసిన సూచనలు అమలు చేయాలని ఇటీవల ఆయన రాష్ర్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి వినతి పత్రం సమర్పించారు. ఈ మేరకు ఆయా సమస్యలను నిర్దిష్టంగా సీఎస్ ముందుకు తీసుకువెళ్లారు.
ధరణిలో రైతులకు చెందిన వ్యవసాయ భూముల హక్కులకు సంబంధించిన సమస్యలు ఇవే..