దేశంలోనే అత్యంత పాపులర్ ముఖ్యమంత్రి ఎవరంటే..?
దేశంలో అత్యంత పాపులారిటీ ఉన్న ముఖ్యమంత్రి ఎవరంటే ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్.

న్యూఢిల్లీ : దేశంలో అత్యంత పాపులారిటీ ఉన్న ముఖ్యమంత్రి ఎవరంటే ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్. పాపులారిటీ ఉన్న సీఎంల జాబితాలో నవీన్ పట్నాయక్ అగ్రస్థానంలో నిలవగా, రెండో స్థానంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ నిలిచారు. ఇటీవల ఓ ఆంగ్ల పత్రిక చేసిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది.
భారత్లో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా ఉన్న నవీన్ పట్నాయక్ 52.7 శాతం ప్రజాదరణతో ప్రథమ స్థానంలో ఉన్నారు. 2000 నుంచి నవీన్ పట్నాయక్ సీఎంగా కొనసాగుతున్నారు. ఇక యోగి ఆదిత్యనాథ్కు 51.3 శాతం ప్రజాదరణతో రెండో స్థానంలో నిలిచారు. 2017 నుంచి యూపీ సీఎంగా యోగి కొనసాగుతున్నారు. అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ 48.6 శాతం ప్రజాదరణతో మూడో స్థానంలో ఉన్నారు. 42.6 శాతంతో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ నాలుగో స్థానంలో నిలవగా, త్రిపుర సీఎం మాణిక్ సాహా 41.4 శాతం ప్రజాదరణతో ఐదో స్థానంలో నిలిచారు.