BJP బీజేపీలో కీలక సంస్థాగత నాయకత్వంలో మార్పులు? రాష్ట్ర చీఫ్ మార్పు తథ్యమంటూ జోరుగా ప్రచారం కిషన్రెడ్డికి రాష్ట్ర పార్టీ పగ్గాలు అందించే చాన్స్ తెలంగాణ బీజేపీలో జోరుగా అంతర్గత చర్చలు బీజేపీలో నాయకత్వ మార్పు తథ్యమా? అసలే ఒక వైపు నానాటికీ ప్రజల్లో పడిపోతున్న ప్రతిష్ఠ.. పైపెచ్చు.. పార్టీలో రోజు రోజుకూ పెరిగిపోతున్న అసమ్మతి స్వరాలు! ఈ నేపథ్యంలో రాష్ట్ర పార్టీ నాయకత్వాన్ని మార్చ దిశగా అడుగులు పడుతున్నాయని అత్యంత విశ్వసనీయవర్గాలు చెబుతున్నాయి. జూలై రెండో […]
BJP
బీజేపీలో నాయకత్వ మార్పు తథ్యమా? అసలే ఒక వైపు నానాటికీ ప్రజల్లో పడిపోతున్న ప్రతిష్ఠ.. పైపెచ్చు.. పార్టీలో రోజు రోజుకూ పెరిగిపోతున్న అసమ్మతి స్వరాలు! ఈ నేపథ్యంలో రాష్ట్ర పార్టీ నాయకత్వాన్ని మార్చ దిశగా అడుగులు పడుతున్నాయని అత్యంత విశ్వసనీయవర్గాలు చెబుతున్నాయి. జూలై రెండో వారంలో లేదా మూడో వారంలో ఈ విషయంలో ఒక నిర్ణయానికి పార్టీ పెద్దలు వస్తారని తెలుస్తున్నది.
విధాత, హైదరాబాద్ ప్రతినిధి: రాష్ట్ర బీజేపీలో కుమ్ములాటలు నానాటికీ పెరుగుతున్నాయి. ఓ వైపు అసమ్మతి నేతల ఫిర్యాదులు పరంపర .. మరోవైపు అనుకూల నేతల ట్వీట్లతో జోరులో ఢిల్లీ నాయకత్వం తల పట్టుకుంటున్నది. ఈటల రాజేందర్, కిషన్ రెడ్డి, బండి సంజయ్ రూపంలో మూడు గ్రూపులుగా విడిపోయిన బీజేపీ నాయకులు తమతమ అసమ్మతిని రోజుకో రూపంలో వెళ్లగక్కుతున్నారు. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు బీజేపీ అధిష్ఠానం స్వయంగా రంగంలోకి దిగుతుందని విశ్వసనీయంగా తెలిసింది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీరుపై ఇటీవల బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, మాజీ ఎంపీ కోమటి రెడ్డి రాజగోపాల్రెడ్డి బీజేపీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై పరోక్షంగా మండిపడ్డ మాజీ ఎంపీ జితేందర్రెడ్డి.. దున్నపోతులను వెనక నుండి తన్నుతూ వాహనం ఎక్కించిన వీడియోను పోస్ట్ చేస్తూ.. బీజేపీ నాయకులకు కూడా ఇలాంటి ట్రీట్మెంట్ కావాలని వ్యాఖ్యానించారు. దీనిపై రచ్చ జరిగింది.
బీఆర్ ఎస్ సోషల్మీడియా గ్రూపులు దీన్ని వైరల్ చేస్తూ.. బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు పీక్ స్టేజ్కు చేరుకున్నాయంటూ కామెంట్లు పెట్టారు. దాంతో మరోసారి ట్వీట్ చేసిన జితేందర్రెడ్డి.. ‘బండి సంజయ్ నాయకత్వాన్ని ప్రశ్నించేటోళ్లకు ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాల్నో చెప్పే నా ప్రయత్నాన్ని తప్పుగా అర్థం చేసుకునే ఊర కుక్కల్లారా… బిస్కెట్ల కోసం బరి తెగించకుర్రి’ అంటూ మరో ట్వీట్ చేశారు. అయితే నాయకత్వ మార్పు అనివార్యంగా కనిపిస్తున్న నేపథ్యంలో తీవ్ర అసహనానికి గురైన బండి సంజయ్ గ్రూపులో కీలక నేతగా పేరున్న జితేందర్రెడ్డి.. వరుస ట్వీట్లు చేశారని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి.
జితేందర్రెడ్డి ట్వీట్ల వ్యవహారం నడుస్తుండగానే గురువారం సాయంత్రం దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్రావు అందుకున్నారు. బీజేపీ అదిష్ఠానం తనను పట్టించుకోవడం లేదని వాపోయారు. దుబ్బాకలో తన గెలుపు తర్వాతే రాష్ట్రంలో బీజేపీకి ఆదరణ పెరిగిందంటూ తన క్రెడిట్ చాటుకునే ప్రయత్నం చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంపై రోజూ పోరాటం చేసే తనకు ప్రాణహాని ఉన్నదంటూ పరోక్షంగా ఈటలకు భద్రత పెంపుపై అసంతృప్తిని వెళ్లగక్కారు. రఘునందన్ సంగతి పక్కనపెడితే.. జితేందర్రెడ్డి చేసిన రెండు ట్వీట్లు ఈటల, రాజగోపాల్ను ఉద్దేశించినవేనని బీజేపీలో అంతర్గతంగా చర్చ జరుగుతున్నది. జితేందర్ రెడ్డి ట్వీట్లపై గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని ప్రజ్ఞాపూర్లో ఈటల రాజేందర్ను మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. ‘ఆయన ట్వీట్ల ఉద్దేశం అయననే అడగాలి. వయస్సు, అనుభవం ఉన్న నాయకులు జాగ్రత్తగా ఉండాలి.
ఏది పడితే అది మాట్లాడవద్దు. ఎవ్వరి గౌరవానికీ భంగం కలగకుండా మాట్లాడాలి. ఎవరి గౌరవం, స్వేచ్ఛకు భంగం కలగకుండా చూసుకోవాలి’ అని పరోక్షంగా జితేందర్ రెడ్డికి చురకలు అంటించారు. అంతే కాదు బట్టలు మార్చినంత సులభంగా పార్టీలు మార్చలేనంటూ పరోక్షంగా బీజేపీలోనే ఉంటానని గతకొంత కాలంగా ఈటల ఘంటాపథంగా చెప్తున్నారు.
ప్రస్తుత పరిణామాలతో మరింత నష్టం కలుగకముందే జాగ్రత్త పడేందుకు అధిష్ఠానం అడుగులు వేస్తున్నదని బీజేపీలోని కీలక నేత ఒకరు చెప్పారు. పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థితోపాటు, పార్టీ రాష్ట్ర చీఫ్ను కూడా మారుస్తారని చెబుతున్నారు. రాష్ట్రంలో బీసీ జనాభా అధికంగా ఉన్న కారణంగా బీసీ నేతనే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉన్నదని సమాచారం.
అదే జరిగితే.. ఈటలను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర బీజేపీలోని ఒక ముఖ్య నేత చెప్పారు. అదే సమయంలో బండి సంజయ్ స్థానంలో కిషన్రెడ్డికి ఆ బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తున్నది. అయితే.. తన స్థానంలో కిషన్రెడ్డికి అవకాశం ఇచ్చినా.. తాను బీసీని కాబట్టి సీఎం అభ్యర్థిగా తానే ఉంటానని తన ముఖ్య అనుచరుల వద్ద బండి సంజయ్ చెప్పకొంటున్నారని సమాచారం.
గత కొంతకాలంగా బీజేపీలో ఈటల ఇమడలేక పోతున్నారనే చర్చలు ఉన్నాయి. ఇటీవల ఆ విషయంలో మరిన్ని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈటల వర్గంతో చర్చలు జరిపిన పార్టీ అధిష్ఠానం.. ‘భవిష్యత్తు మీదే’ అని అభయం ఇచ్చినట్టు అత్యంత విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
తెలంగాణలో ఇప్పటికైతే అధికార బీఆరెస్ నుంచి సీఎం అభ్యర్థి కేసీఆరే. ఆయన కాదంటే.. ఆ స్థానంలో కేటీఆర్ వస్తారు. అంటే మరోమారు బీఆరెస్ గెలిస్తే.. వెలమ సామాజిక వర్గానికి చెందిన నాయకుడే సీఎం అవుతారనేది సుస్పష్టం. మరోవైపు.. తాము అధికారంలోకి వస్తే రెడ్డి లేదా దళిత సామాజిక వర్గాల నుంచి సీఎం ఉంటారని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బీసీలను తమ వైపు తిప్పుకొనేందుకు బీసీ ముఖ్యమంత్రి అస్త్రాన్ని బీజేపీ బయటకు తీయనున్నదని విశ్వసనీయవర్గాలు చెబుతున్నాయి.
ఈ క్రమంలో ఆ పోస్టుకు ఈటల ముందు వరుసలో ఉంటారని అంటున్నాయి. అయితే.. ఈటలను ప్రస్తుతానికి బుజ్జగించేందుకే బీసీ సీఎం తాయిలాన్ని ముందుకు తెస్తున్నారా? బయటి నేతను కరడుగట్టిన ఆరెస్సెస్ నుంచి వచ్చిన పాత నాయకులు ఆమోదిస్తారా? అన్నది వేచి చూడాలి. అందులోనూ.. బీజేపీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే!