Site icon vidhaatha

Hyderabad | హైదరాబాద్‌లో ఆన్‌లైన్ గేమ్స్‎తో యువతి అప్పులపాలు

విధాత‌ప్ర‌తినిధి, హైద‌రాబాద్‌: ఆన్‌లైన్ గేమ్స్‌తో ఎంతోమంది యువ‌త జీవితాలు నాశ‌నం చేసుకుంటోంది. చ‌దువురానివారికంటే చ‌దువుకున్న‌వారే ఈ ఉచ్చులో ఎక్కువ‌గా ప‌డుతున్నారు. రాజేంద్రనగర్‎లో డిగ్రీ చదువుతున్న ఒక యువతి కోసం తల్లిదండ్రులు ఆమెకు లాప్‌టాప్‎తో పాటు మొబైల్ ఫోన్ కొనిచ్చారు., వాటిని చదువు కోసం కాకుండా ఆన్లైన్లో గేమ్స్ కోసం యువతి వాడుకుంది.

లాభాల కంటే నష్టాలే ఎక్కువగా రావ‌డంతో తీవ్ర అప్పుల్లో కూరుకుంది., ఎలాగైనా సరే అప్పులు తీర్చుకోవాలని భావించిన యువతి ఇంట్లో ఉన్న నగదు బంగారాన్ని అపహరించాలని నిర్ణయించుకుంది. దీంతో తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో భారీ పథకానికి వ్యూహరచన చేసింది. తల్లిదండ్రులు బయటికి వెళ్ళిపోగానే ఇంట్లో ఉన్న బీరువాలో దాచుకున్న నగదు మొత్తాన్ని దోచుకుంది.

తిరిగి ఎవరికీ అనుమానం రాకుండా బట్టలు మొత్తాన్ని చెల్లాచెదురుగా పడేసింది. తల్లిదండ్రులు ఇంటికి వచ్చి చూసేసరికి ఇంట్లో దొంగలు పడ్డారని, తాను స్నానం చేసి వచ్చేసరికి ఇల్లు మొత్తం చెల్లాచెదురు చేశారని తల్లిదండ్రులను నమ్మించింది.

ఇది నిజమేమో అనుకొని స్థానిక రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు యువతి తల్లిదండ్రులు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అనేక కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఇంటి పరిసరాల్లో ఉన్న వారితోపాటు సీసీ కెమెరాలను సైతం పరిశీలించారు. అయితే ఎవరూ కూడా ఇంట్లోకి ప్రవేశించలేదని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. దీంతో యువతిని పలుకోణాల్లో ప్రశ్నించగా అసలు విషయం బయటపెట్టింది.

తానే ఇంట్లో ఉన్న డబ్బులు నగదు అపహరించినట్లు పోలీసుల ముందు వాంగ్మూలం ఇచ్చింది. యువతి స్టేట్మెంట్‎తో ఒకసారిగా పోలీసులతో పాటు తల్లిదండ్రులు సైతం అవాకయ్యారు. యువతి ప్రవర్తన చూసిన పోలీసులు ఆమెకు తల్లిదండ్రుల సమక్షంలోనే కౌన్సిలింగ్ ఇచ్చారు. ఎవరు కూడా ఆన్లైన్ గేమ్స్ ఆడి డబ్బులు పోగొట్టుకోవద్దని సూచిస్తున్నారు.

Exit mobile version