రాజ్యాంగ స్ఫూర్తిని చంపేలా రాహుల్‌ ద్వంద్వ వైఖరి ఢిల్లీలో మీడియాతో … బీఆరెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో రాహుల్ గాంధీ వ్యవహారిస్తున్న తీరుపై కేటీఆర్ మండిపడ్డారు. ఓ వైపు రాహుల్ గాంధీ రాజ్యాంగ పరిరక్షణ అంటూ పోజులు కొడుతూ మరోవైపు రాజ్యాంగ స్ఫూర్తిని చంపేలా ద్వంద వైఖరి అవలంబిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు

రాజ్యాంగ స్ఫూర్తిని చంపేలా రాహుల్‌ ద్వంద్వ వైఖరి ఢిల్లీలో మీడియాతో …  బీఆరెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

ఫిరాయింపులపై చట్టం చేస్తామని.. మా ఎమ్మెల్యేలను గుంజుకుంటున్నారు
గెలిచి మరొక పార్టీలోకి మారితే రాళ్లతో కొట్టాలన్న రేవంత్‌
పార్టీ మారిన వారిని పిచ్చి కుక్కలుగా భావించాలన్నారన్నారు
ఎవరిని రాళ్లతో కొట్టి చంపాలో? ఎవరు పిచ్చికుక్కో చెప్పాలి
ఫిరాయింపులపై న్యాయపోరాటం చేస్తాం
రాష్ట్రపతి, స్పీకర్‌, రాజ్యసభ చైర్మన్‌కు ఫిర్యాదు చేస్తాం

న్యూఢిల్లీ: రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో రాహుల్ గాంధీ వ్యవహారిస్తున్న తీరుపై కేటీఆర్ మండిపడ్డారు. ఓ వైపు రాహుల్ గాంధీ రాజ్యాంగ పరిరక్షణ అంటూ పోజులు కొడుతూ మరోవైపు రాజ్యాంగ స్ఫూర్తిని చంపేలా ద్వంద వైఖరి అవలంబిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ తీరును దేశ ప్రజలకు తెలియజెప్పేందుకు ఢిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. పాంచ్ న్యాయ్‌లో భాగంగా పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని బలోపేతం చేస్తామని రాహుల్ గాంధీ గొప్పలు చెప్పారని గుర్తు చేశారు. హైదరాబాద్‌లోని తుక్కుగూడ సభలో మాట్లాడుతూ పార్టీ ఫిరాయించిన వారి సభ్యత్వం పోయేలా చేస్తామని ఆయన చెప్పారని, కానీ అదే వేదికపై బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఉన్నారని గుర్తు చేశారు. రాహుల్ గాంధీ వ్యవహారం చూస్తుంటే ఆయనకు అస్కార్ లెవల్ అవార్డు ఇవ్వొచ్చన్నారు. ఇదే రాహుల్ గాంధీ గోవాలో కాంగ్రెస్ అభ్యర్థులు పార్టీ మారవద్దని వారితో ప్రమాణం చేయించారని గుర్తు చేశారు. కర్ణాటక, హర్యానా, మహారాష్ట్రలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేస్తుందని గగ్గోలు పెట్టినా కాంగ్రెస్ నేతలే ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇళ్ల చుట్టు తిరుగుతున్నారన్నారు. ఓ వైపు రాజ్యాంగ పరి రక్షకుడిగా రాజ్యాంగం పుస్తకాన్ని చేతులో పట్టుకొని మరోవైపు రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తున్న రాహుల్ గాంధీ తీరును దేశ ప్రజలు గమనించాలన్నారు. ఏఐసీసీ అనుమతి తీసుకొని మరి తెలంగాణలో మరికొంత మంది ఎమ్మెల్యేల ఫిరాయింపులకు పాల్పడబోతున్నారన్నారు. దీనిపై రాహుల్ గాంధీ ఏం సమాధానం చెబుతారని కేటీఆర్ ప్రశ్నించారు. ఒక పార్టీ నుంచి గెలిచి మరొక పార్టీలోకి మారితే రాళ్లతో కొట్టి చంపాలని స్వయంగా ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డే వ్యాఖ్యనించారని కేటీఆర్ గుర్తు చేశారు. పార్టీ మారిన వారిని పిచ్చి కుక్కలుగా భావించాలన్నారన్నారు. మరి ఇప్పుడు ఎవరినీ రాళ్లతో కొట్టి చంపాలో? ఎవరు పిచ్చికుక్కో రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని కేటీఆర్ నిలదీశారు. గతంలో మణిపూర్‌లో ఓ ఎమ్మెల్యే పార్టీ ఫిరాయింపుల విషయంలో కాంగ్రెస్ పార్టీ పిటిషన్‌పై విచారణ ద్వారానే సుప్రీంకోర్టు కీలకమైన తీర్పు ఇచ్చిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా బీజేపీ పార్టీ ఫిరాయింపులపై పోరాటమంటూనే తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొనుగోళ్లకు ఎందుకు పాల్పడుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒక్కొక్కరికి రూ. 50 కోట్లు ఇచ్చి బీజేపీ కొనుగోలు సిద్దరామయ్య ఆరోపించారని గుర్తు చేశారు. మరి తెలంగాణలో ఎమ్మెల్యే కొనుగోళ్లకు ఎంత ఖర్చు చేస్తున్నారో రాహుల్ గాంధీ చెప్పాలన్నారు.

ఫిరాయింపులపై న్యాయ, రాజ్యాంగ నిపుణులతో చర్చలు

పార్టీ ఫిరాయింపుల విషయంలో న్యాయం కోసం ఢిల్లీలో నాలుగు రోజులుగా న్యాయ, రాజ్యాంగ నిపుణులతో సంప్రదింపులు జరిపినట్లు కేటీఆర్ చెప్పారు. బీఆర్ఎస్ గుర్తుపై గెలిచిన దానం నాగేందర్ ఆ తర్వాత సికింద్రాబాద్ ఎంపీగా కాంగ్రెస్ బీ ఫామ్ పై పోటీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇంత బహిరంగంగా పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విషయంలో ఇప్పటికే హైకోర్టు లో పిటిషన్ వేశామన్నారు. హైకోర్టులో న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తామన్నారు. రాష్ట్రపతిని, లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్‌ను కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు. ఈ అంశాన్ని రాజ్యసభలో లేవనేత్తుతామని, అవకాశం ఉన్న అన్ని వేదికల్లో న్యాయ పోరాటం చేస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీజేపీ బాధిత పార్టీలతో కలిసి భవిష్యత్ లో పార్టీ ఫిరాయింపుల చట్టం బలోపేతం చేసేందుకు పోరాటం చేస్తామన్నారు.

కాంగ్రెస్‌ అన్యాయాలకు వ్యతిరేకంగానే రాష్ట్రం సాధించుకున్నాం

కాంగ్రెస్ పార్టీకి 2014కు ముందు తెలంగాణ ప్రజలు ఎన్నో అవకాశాలు ఇచ్చినప్పటికీ ఆ పార్టీ రాష్ట్రానికి అన్యాయం చేసిందని కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ అన్యాయాలకు వ్యతిరేకంగానే తెలంగాణ ప్రజలు పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నారని చెప్పారు. పదేళ్ల పాటు కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేశారని చెప్పారు. ఐతే మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ 100 రోజుల్లో ఆరు గ్యారంటీల పేరుతో ఈస్ట్ మన్ కలర్ సినిమా చూపటంతో ప్రజలు గెలిపించారని చెప్పారు. ఒకటి కాదు రెండు కాదు 420 హామీలిచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు వాటిని అమలు చేయటం చేతకావటం లేదని విమర్శించారు. దాని నుంచి తప్పించుకోవటానికే ఎమ్మెల్యే కొనుగోళ్లకు పాల్పడుతుందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్న కాంగ్రెస్‌పై పోరాటంలో ఇది తొలి అడుగు మాత్రమేనని కేటీఆర్ చెప్పారు. భవిష్యత్ లో మరిన్ని పోరాటాలు చేస్తామన్నారు.