గండక్ నదిలో 1000 దాటిన మొసళ్ల సంఖ్య

బీహార్‌లోని గండక్ నదిలో అరుదైన ఘరియాల్ మొసళ్ల సంఖ్య 1000 దాటింది. తాజాగా 31 ఘరియాల్ పిల్లలను నదిలో విడిచిపెట్టడంతో సంరక్షణ విజయగాథగా నిలిచింది.

గండక్ నది ఇప్పుడు చంబల్ నది తర్వాత భారతదేశంలోనే రెండవ అతిపెద్ద ఘరియాల్ (చేపలు తినే మొసళ్లు) ఆవాసంగా అవతరించింది. బీహార్‌లోని గంగా నది ఉపనది అయిన గండక్ నదిలో అంతరించిపోతున్న అరుదైన ఘరియాల్ మొసళ్ల సంఖ్య 1,000 మార్కును దాటింది. తాజాగా జన్మించిన 31 ఘరియాల్ పిల్లలను పర్యావరణ పరిరక్షణలో భాగంగా నదిలోకి విడుదల చేశారు.

వైల్డ్ లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (WTI), బీహార్ అటవీ శాఖలు స్థానిక ప్రజల భాగస్వామ్యంతో నది ఒడ్డున గుడ్లను సేకరించి పొదిగేలా చేస్తున్నారు. ఈ సీజన్‌లోనే రత్వాల్ వంతెన సమీపంలో 31 కొత్త ఘరియాల్ పిల్లలు పుట్టాయి. వాటిని బీహార్ అటవీ శాఖ సురక్షితంగా నదిలోకి విడిచిపెట్టింది. ఒకప్పుడు కేవలం 54 ఘరియల్ పెద్ద మొసళ్ల సంఖ్య మాత్రమే ఉన్న ఈ నదిలో ఇప్పుడు ఈ మొసళ్ల జాతి సంఖ్య 1000 దాటడం గమనార్హం.

గండక్ నది ఒడ్డున 6 ప్రదేశాల్లో వైల్డ్ లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా, బీహార్అటవీ శాఖ, శిక్షణ పొందిన స్థానికులు మొసళ్ల గుడ్లను సంరక్షిస్తున్నారు. ఇటీవల మొసలి గుడ్లు పొదగడం వల్ల వాటి పిల్లలను గండక్ నదిలో విడిచిపెట్టారు. లాస్ ఏంజిల్స్ జూ, కాలిఫోర్నియా జూ కూడా ఈ ఘరియల్ మొసలి గుడ్ల సంరక్షణ,పెంపకంలో భాగం కావడం విశేషం.

2013 నుంచి గండక్ నదిలో క్రోకోడైల్ రికవరీ ప్రాజెక్ట్ కింద మొసళ్ల సంరక్షణ చేపడుతున్నారు. గుడ్లను సంరక్షించడం, వాటి పెంపకం ప్రక్రియ మార్చి నెల నుంచి ప్రారంభమవుతుంది. ఒక ఆడ మొసలి నదికి సమీపంలో ఎత్తైన ఇసుక దిబ్బపై గూడు కట్టి గుడ్లు పెడుతుంది. ఆ తర్వాత 2-3 నెలల్లో గుడ్డు నుంచి మొసలి పిల్లలు బయటకు వస్తాయి. గండక్ నది వాతావరణం మొసళ్లకు ఆహ్లాదకరంగా ఉంటుంది అని వైల్డ్‌ లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా వెల్లడించింది.

Latest News