విధాత: ప్రజాప్రతినిధులపై పెండింగ్లో ఉన్న కేసుల సత్వర విచారణకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల అధ్యక్షతన లేదా ప్రధాన న్యాయమూర్తి నియమించిన ధర్మాసనం ప్రత్యేక బెంచ్ లను ఏర్పాటు చేయాలని హైకోర్టులను సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే వారికి సంబంధించిన క్రిమినల్ కేసుల సత్వర విచారణకు అవసరమైన పర్యవేక్షణకై సుమోటో కేసులు నమోదు చేయాలని ఆదేశించింది. ఎంపీలు, ఎమ్మెల్యేలపై నమోదైన క్రిమినల్ కేసుల విచారణ వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్ పై గురువారం సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మసనం విచారణ జరిపింది.
ప్రజాప్రతినిధులపై నమోదైన క్రిమినల్ కేసుల విచారణ వేగంగా పూర్తి చేసేందుకు ఖచ్చితమైన మార్గదర్శకాలు జారీ చేయడం క్లిష్టమైన ప్రక్రియ అని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. ట్రయల్ కోర్టులు అత్యవసరమైతే తప్ప ప్రజాప్రతినిధులపై నమోదైన కేసుల విచారణలను వాయిదా వేయకూడదని ఆదేశాల్లో పేర్కొంది. కేసుల వివరాలను జిల్లా ప్రత్యేక న్యాయస్థానాల నుంచి సేకరించి హైకోర్టు వెబ్ సైట్లో ప్రత్యేక ట్యాబ్ ఏర్పాటు చేసి అందులో పొందుపరచాలని హైకోర్టులకు మార్గదర్శకం చేసింది. ఇందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను, సాంకేతికతను జిల్లా న్యాయస్థానాలు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించింది.
ఎవరైనా ప్రజాప్రతినిధిపై తీవ్ర నేరాలను సంబంధించి అభియోగం నిరూపితమైతే ఎంపీ లేదా ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేయకుండా జీవితకాల నిషేధంపై ఇంకా విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ అంశంపై తాము ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వెల్లడించింది. తీవ్రమైన నేరాలకు పాల్పడే వారిని జీవిత కాలం ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలని న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ పిల్లో కోరారు.