విధాత : భారత్ ఎదుర్కొంటున్న గ్యాస్, ఇంధన కొరత సమస్యల పరిష్కారం దిశగా ఇరాన్ గొప్ప ఊరటను అందించింది. హర్మూజ్ వద్ద చిక్కుకుపోయిన 22 భారత నౌకలు భారత్ కు చేరుకునేందుకు ఇరాన్ అనుమతించింది. దీంతో త్వరలోనే ఆ నౌకలు అన్ని భారత్ కు చేరుకోనున్నాయి.
భారత్ సహా తమ మిత్రులైన ఐదు దేశాల నౌకల కోసం హర్మూజ్ జలసంధిని తెరుస్తున్నట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ప్రకటించారు. ఈ విషయాన్ని ముంబయిలోని ఇరాన్ కాన్సు లేట్ జనరల్ కార్యాలయం ‘ఎక్స్’ వేదికగా వెల్లడించింది. ‘‘మేము హర్మూజ్ నుంచి ప్రయాణించేందుకు మిత్ర దేశాలకు అనుమతులు ఇస్తున్నాం. వీటిలో చైనా, రష్యా, భారత్, ఇరాక్, పాకిస్థాన్ ఉన్నాయి’’ అని అరాగ్చీ ప్రకటించినట్లు పేర్కొంది.
ఇరాన్ నిర్ణయంతో హర్మూజ్ జలసంధికి ఇరువైపులా చిక్కుకుపోయిన భారత్ నౌకలు సరకులతో తమ గమ్యస్థానాలు చేరేందుకు మార్గం సులువైంది. ఇరాన్కు వ్యతిరేకంగా జరుగుతున్న దౌర్జన్యాలకు మద్దతు ఇవ్వమని తేల్చిచెప్పిన దేశాల నౌకలు మాత్రమే హర్మూజ్లో ప్రయాణించవచ్చని ఇప్పటికే ఇరాన్ వెల్లడించిన విషయం తెలిసిందే. మరోవైపు హర్మూజ్లో ప్రయాణించే నౌకలపై టోల్ విధించే అంశంపై చట్టం చేసేందుకు ఇరాన్ పార్లమెంట్ పనిచేస్తోందని ‘బ్లూమ్బెర్గ్’ తన కథనంలో పేర్కొంది. ఈ టోల్ విధించినందుకు బదులుగా ఆయా నౌకలకు ఇరాన్ భద్రత కల్పిస్తూ హర్మూజ్ను దాటించనున్నట్లు తెలిపింది.
పశ్చిమాసియాలో చమురు రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధిలో ఇరాన్ రెవల్యూషనరీ గార్డులు నౌకల నుంచి అనధికార టోల్ వసూలు చేస్తున్నట్లు షిప్పింగ్ న్యూస్ వెబ్సైట్ లాయిడ్స్లిస్ట్ ఈ విషయాన్ని వెల్లడించింది. మార్చి 13 నుంచి ఐఆర్జీసీ నిర్దేశించిన టోల్బూత్ సిస్టమ్ నిబంధనలు పూర్తి చేసి 26 నౌకలు హర్మూజ్ను దాటినట్లు తెలిపింది. ఇందుకోసం ఆయా నౌకలు సంబంధిత పత్రాలు సమర్పించినట్లు పేర్కొంది.
ఇవి కూడా చదవండి :
Bangladesh Bus Accident | బంగ్లాదేశ్ లో ఘోర బస్సు ప్రమాదం..23మంది గల్లంతు
Jyothirlinga | భారత్లో ప్రసిద్ధి చెందిన 12 జ్యోతిర్లింగాలు.. ఎక్కడెక్కడ ఉన్నాయి? ఏ పేర్లతో పిలుస్తారు?
