January 26 vs August 15 | దేశ వ్యాప్తంగా ఆగ‌స్టు 15( August 15 ), జ‌న‌వ‌రి 26( January 26 )వ తేదీన జాతీయ జెండాల‌ను ఎగుర‌వేస్తారు. దేశ రాజ‌ధాని ఢిల్లీతో పాటు ఆయ రాష్ట్రాల్లో జాతీయ జెండాల‌ను( National Flag ) ఎగుర‌వేసి స్వాతంత్య్ర దినోత్స‌వం( Independence Day ), గ‌ణతంత్ర దినోత్స‌వాన్ని( Republic Day ) ఘ‌నంగా నిర్వ‌హించుకుంటారు. అయితే ఈ రెండు సంద‌ర్భాల్లో జెండా ఎగుర‌వేసే విష‌యంలో నియ‌మాలు భిన్నంగా ఉంటాయి. ఆ వ్య‌త్యాసాలు ఏంటో ఈ క‌థ‌నంలో తెలుసుకుందాం.

జ‌న‌వ‌రి 26..( January 26 )

జనవరి 26, 1950న భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది. దీంతో భారతదేశం గణతంత్ర రాజ్యంగా మారింది. అందువల్ల ప్రతి సంవత్సరం జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటారు. భార‌త‌దేశం 77వ గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడుక‌ల‌ను జ‌రుపుకునేందుకు సిద్ధ‌మైంది. ఈ వేడుక‌ల‌కు ఢిల్లీలోని ప‌రేడ్ గ్రౌండ్ ముస్తాబైంది.

ఆగ‌స్టు 15..( August 15 )

ఆగస్టు 15, 1947న దేశం బ్రిటిష్ పాలన నుంచి స్వాతంత్య్రం పొందిన రోజు. స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుల‌ను స్మ‌రించుకుంటారు. వారి త్యాగాల‌ను కొనియాడుకుంటాం. జాతీయ జెండాను ఎగుర‌వేస్తాం.

జెండా ఎగుర‌వేసే విష‌యంలో తేడాలివే..

ఆగ‌స్టు 15, జ‌న‌వ‌రి 26వ తేదీల్లో జెండాను ఒకే ర‌కంగా ఎగుర‌వేస్తార‌ని అంద‌రూ భావిస్తారు. కానీ వ్య‌త్యాసం ఉంటుంది. ఆగ‌స్టు 15న త్రివ‌ర్ణ ప‌తాకాన్ని జెండా స్తంభం కింది నుంచి తాడుతో పైక లేపి, ఆపై హుక్‌ను విప్పుతారు. ఇది బ్రిటిష్ జెండాను కింద‌కు దించి, భార‌త త్రివ‌ర్ణ ప‌తాకాన్ని ఎగుర‌వేయ‌డాన్ని సూచిస్తుంది. అదే జ‌న‌వ‌రి 26న త్రివ‌ర్ణ ప‌తాకాన్ని జెండా స్తంభం పై భాగానికి క‌ట్టి ఉంచుతారు. తాడును లాగ‌డం ద్వారా జెండా రెప‌రెప‌లాడుతుంది. ఇది భారత రాజ్యాంగాన్ని స్వీకరించడాన్ని, కొత్త రాజ్యాంగ యుగం ప్రారంభాన్ని సూచిస్తుంది.

జెండాను ఎవ‌రు ఎగుర‌వేస్తారంటే..?

ఆగస్టు 15న దేశ ప్రధానమంత్రి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తారు. ఎందుకంటే 1947లో స్వాతంత్య్రం వచ్చే సమయానికి భారత రాజ్యాంగం అమలు కాలేదు. రాష్ట్రపతి పదవి ఉనికిలో లేదు. ఆ సమయంలో ప్రధానమంత్రి దేశ పరిపాలనా అధిపతి. జనవరి 26వ తేదీన.. దేశ రాష్ట్రపతి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తారు. ఎందుకంటే రాష్ట్రపతి భారతదేశ రాజ్యాంగ అధిపతి. ఈ రోజున భారతదేశ మొదటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ప్రమాణ స్వీకారం చేశారు.