బెంగాల్లోని మమతా బెనర్జీ సర్కారుకు భారీ షాక్ తగిలింది. కోల్కతా హైకోర్టు ఇవాళ కీలక ఆదేశాలు జారీ చేసింది. 2016లో జరిగిన టీచర్ల రిక్రూట్మెంట్ను రద్దు చేసింది. ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లకు జరిగిన
విధాత : బెంగాల్లోని మమతా బెనర్జీ సర్కారుకు భారీ షాక్ తగిలింది. కోల్కతా హైకోర్టు ఇవాళ కీలక ఆదేశాలు జారీ చేసింది. 2016లో జరిగిన టీచర్ల రిక్రూట్మెంట్ను రద్దు చేసింది. ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లకు జరిగిన అపాయింట్మెంట్లను రద్దు చేస్తున్నట్లు కోల్కతా హైకోర్టు తెలిపింది. కోర్టు ఆదేశాల ప్రకారం.. సుమారు 25,753 మంది టీచర్లు తమ ఉద్యోగాలను కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. ఆ ఉద్యోగాలు ఇన్నాళ్లు తీసుకున్న జీతాన్ని కూడా వెనక్కి ఇవ్వాల్సి ఉంటుంది. 12 శాతం వడ్డీతో ఆ మొత్తాన్ని ఇవ్వాల్సి ఉంటుందని కోర్టు తన ఆదేశాల్లో పేర్కొన్నది. జస్టిస్ దేబాన్సు బాసక్, మహమ్మద్ షబ్బార్ రషీద్లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును ఇచ్చింది. ఖాళీ ఓఎంఆర్ షీట్లు ఇచ్చి.. అక్రమరీతిలో టీచర్లు రిక్రూట్ అయినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే నాలుగు వారాల్లోగా టీచర్లు తమ జీతాలను వెనక్కి ఇచ్చేయాలని కోర్టు ఆదేశించింది. ఆ టీచర్ల నుంచి డబ్బును వసూల్ చేసే బాధ్యతలను జిల్లా మెజిస్ట్రేట్లకు కల్పించారు. కోల్కతా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ తృణమూల్ కాంగ్రెస్ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు.
పశ్చిమ బెంగాల్లో 2016లో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఉపాధ్యాయ నియామకాలు చెల్లవంటూ సోమవారం కలకత్తా హైకోర్టు ఇచ్చిన సంచలన తీర్పుపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జి స్పందించారు. నియామకాలను రద్దు చేయడంతోపాటు వేతనాన్ని తిరిగి ఇచ్చేయాలన్న కోర్టు ఆదేశాలను సవాలు చేస్తామని ఆమె తెలిపారు. హైకోర్టు తీర్పుతో ఉద్యోగాలు కోల్పోయిన వారికి తాము అండగా నిలుస్తామని మమత హామీ ఇచ్చారు.
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తర బెంగాల్లోని రాయ్గంజ్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మమతాబెనర్జి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలకత్తా హైకోర్టు తీర్పుపై ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘ఉపాధ్యాయ నియామక ప్రక్రియను రద్దు చేయడం చట్ట విరుద్ధం. ఉద్యోగాలు కోల్పోయిన వారికి అండగా నిలబడతాం. వారికి న్యాయం జరిగేవరకు పోరాడతాం. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తాం. ఉద్యోగాలు కోల్పోయిన టీచర్లు అధైర్యపడొద్దు’ అన్నారు.