విద్వేష ప్రచారాలు మాని, ఈ పదేళ్లలో దేశానికి ఏం చేశారో చెప్పి ఓట్లడగాలని ప్రధాని నరేంద్రమోదీకి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే సూచించారు. ఈ మేరకు మే 2, 2024న ప్రధానికి మూడు పేజీల లేఖ రాశారు
న్యూఢిల్లీ: విద్వేష ప్రచారాలు మాని, ఈ పదేళ్లలో దేశానికి ఏం చేశారో చెప్పి ఓట్లడగాలని ప్రధాని నరేంద్రమోదీకి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే సూచించారు. ఈ మేరకు మే 2, 2024న ప్రధానికి మూడు పేజీల లేఖ రాశారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టో గురించి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆ లేఖలో ఖర్గే ఆరోపించారు. తమ పార్టీ మ్యానిఫెస్టోపై చర్చకు రావాలని సవాలు విసిరారు. ఓటర్లకు ఏం చెప్పాలో సూచిస్తూ మీరు మీ ఎన్డీయే అభ్యర్థులకు రాసిన లేఖను చూశాను. ఆ లేఖను గమనిస్తే మీరు ఎంత నిరాశ, ఆందోళనతో ఉన్నారో అర్థమవుతున్నది. అదే మీ ప్రసంగాల్లో మీరు వాడే భాషలోనూ వ్యక్తమవుతున్నది. ఆ భాష ప్రధాని కార్యాలయానికి తగనిది. మీరు ప్రసంగంలో చెబుతున్న అసత్యాలే ఆ లేఖలోనూ ఉన్నట్టు కనిపిస్తున్నది. వటి ప్రభావం పనిచేయకపోవడంతో ఆ అబద్ధాలను మరింత పెంచాలని మీరు కోరుతున్నట్టు ఉన్నది’ అని ఖర్గే పేర్కొన్నారు. ఒక అసత్యాన్ని వెయ్యిసార్లు చెప్పినా అది సత్యం కాబోదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టోను ప్రస్తావించిన ఖర్గే.. ఓటర్లు కాంగ్రెస్ ఏం చెప్పిందో, ఏం గ్యారెంటీలు ఇచ్చిందో చదివి అర్థం చేసుకోగల తెలివిని కలిగి ఉన్నారని అన్నారు. తమ గ్యారెంటీలు చాలా స్పష్టంగా, సులభంగా అర్థం చేసుకునేలా ఉన్నాయని, వాటిని తాము ప్రజలకు వివరించి చెప్పాల్సిన అవసరం లేదని ఖర్గే పేర్కొన్నారు.
మీ లేఖలో మీరు రిజర్వేషన్లను ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల నుంచి తీసుకుని, మా ఓటు బ్యాంకుకు ఇస్తారని తెలిపారు. మా ఓటు బ్యాంకు దేశంలోని పేదలు, బడుగువర్గాలు, మహిళలు, అనేక ఆకాంక్షలు కలిగి ఉన్న యువత, కార్మికులు, దళితులు, ఆదివాసీలు. 1947 నుంచి ప్రతి దశలోనూ రిజర్వేషన్లను వ్యతిరేకించింది ఆరెస్సెస్, బీజేపీయేనని అందరికీ తెలుసు. రాజ్యాంగాన్ని మార్చాలని, రిజర్వేషన్లు ఎత్తివేయాలని ఆరెస్సెస్, బీజేపీ కోరుకుంటున్నాయని అందరికీ తెలుసు’ అని పేర్కొన్నారు. మీ నాయకులే అనేక సందర్భాల్లో ఈ మాటలు చెప్పారని గుర్తు చేశారు. దేశ జనాభా ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లను ఎందుకు వ్యతిరేకిస్తున్నారో చెప్పాలని ప్రధానిని ఖర్గే డిమాండ్ చేశారు.
తమవి బుజ్జగింపు రాజకీయాలని మీరు, అమిత్షా చెబుతున్నారన్న ఖర్గే.. వాస్తవానికి ఈ పదేళ్లలో మీరు మీ మంత్రులు చైనాను బుజ్జగించే పని విధానాన్ని అనుసరిస్తున్నారని విమర్శించారు. వారసత్వ ఆస్తి పన్ను తేవాలని కాంగ్రెస్ చెబుతోందని లేఖలో అవాస్తవాలు చెప్పారని ఆరోపించారు. వారసత్వ ఆస్తి పన్ను ఉండాలని మీ ఆర్థిక మంత్రి, మీ పార్టీ నాయకులే కోరుతున్నారని గుర్తు చేశారు.
ప్రజలు కష్టపడి సంపాదించుకున్న డబ్బును కాంగ్రెస్ గుంజుకుంటుందని ఆరోపిస్తున్న ప్రధాని.. గుజరాత్లోని పేద దళితులను మోసం చేసి ఎలక్టోరల్ బాండ్ల కింద బీజేపీకి ఇచ్చిన పది కోట్లను వాపస్ చేయాలని మీ పార్టీని కోరాలని సూచించారు. వివిధ కంపెనీల నుంచి చట్టవ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేక ఎలక్టోరల్ బాండ్ల ద్వారా బీజేపీ 8,250 కోట్ల రూపాయలను సంపాదించుకుందని ఆరోపించారు. తమ మ్యానిఫెస్టో న్యాయం గురించి మాట్లాడుతుందని, సమాజంలోని అన్ని వర్గాలను పైకి తేవడం గురించి మాట్లాడుతుందని తెలిపారు. విద్వేష ప్రచారాలను మాని, ఈ పదేళ్లలో ప్రజలకు ఏం చేశారో చెప్పి ఓట్లడిగితే మంచిదని అన్నారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలు మిమ్మల్ని ఓటమిని తప్పించుకునేందుకు అసత్యాలతో నిండిన విచ్ఛిన్నకర, విద్వేష ప్రసంగాలు చేసిన ప్రధానిగా గుర్తుంచుకుంటారని చెప్పారు.