బడికి వెళ్లాలంటే సాహసంచేయాల్సిందే..!

మధ్యప్రదేశ్‌లో విద్యార్థులు బెట్వా నది చెక్‌డ్యామ్‌పై ప్రాణాలను పణంగా పెట్టి స్కూల్‌కు వెళ్తున్న వీడియో వైరల్ అయింది. సురక్షిత మార్గం కల్పిస్తామని అధికారులు తెలిపారు.

మధ్యప్రదేశ్‌ విదిశా జిల్లాలో పిల్లలు ప్రమాదకరంగా ప్రవహిస్తున్న బెట్వా నది చెక్ డ్యామ్ పై నుంచి ప్రాణాలకు తెగించి దాటి స్కూల్‌కు వెళ్తున్న వీడియో వైరల్ గా మారింది. ఏమాత్రం బ్యాలెన్స్ తప్పినా, కాలు జారినా నేరుగా నదిలో పడి ప్రాణాలు పోవడం ఖాయం. అంతటి ప్రమాదకర పరిస్థితులలో పిల్లలు నిత్యం ప్రాణాంతక ప్రయాణం చేస్తున్నారు. 10 కిలోమీటర్లు చుట్టు తిరిగి వెళ్లలేక బెట్వా నది డ్యామ్ పిల్లర్ల మీద ఒక్కో అడుగు వేసుకుంటూ దూకుతూ ప్రమాదకరంగా దాటుతున్నారు. బడికి వేళ్లేందుకు 13 కిలోమీటర్ల రోడ్డు ప్రయాణం బెట్వా నది మీదుగా వెళితే సుమారు 1.5 కిలోమీటర్లకు తగ్గిపోతుందన్న ఆలోచనతో ఐదేళ్లుగా విద్యార్థులు రోజూ ఇలాగే రిస్క్ చేస్తున్నారు.

కాక్రౌవా గ్రామానికి చెందిన 9, 10 తరగతులకు చెందిన ఐదుగురు బాలికలతో సహా తొమ్మిది మంది విద్యార్థులు కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రమాదకరమైన షార్ట్‌కట్‌ను ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే వారి స్థానిక పాఠశాలలో 8వ తరగతి వరకు మాత్రమే ఉండటంతో పై చదువుల కోసం వారు ప్రాణాలను ఫణంగా పెట్టి నిత్యం బెట్వా నది డ్యామ్ దాటుతున్నారు. ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో ప్రభుత్వంపై ప్రజలు మండిపడుతున్నారు. దీనిపై స్పందించిన అధికారులు.. పిల్లల కోసం త్వరలోనే సేఫ్ రూట్ రెడీ చేస్తామని చెప్పారు.

Latest News