• Telugu News
  • /National

Droupadi Murmu : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్రపతి ముర్ము

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని దర్శించుకున్నారు. రేపు తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు.

Reported by: Tejaswini Nanna | జాతీయం | Nov 20, 2025, 5:49 pm IST
Read Time: 3 mins
Droupadi Murmu : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్రపతి ముర్ము

అమరావతి : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు హాజరైన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అమ్మవారిని దర్శించుకున్నారు. రాష్ట్రపతి ఆలయ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు అధికారిక లాంఛనాలతో స్వాగతం పలికి దర్శన, సత్కారాలు జరిపించారు. అనంతరం ద్రౌపది ముర్ము తిరుమలకు చేరుకున్నారు. సాయంత్రం తిరుమల శ్రీ పద్మావతి అతిథి గృహానికి చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు. రేపు శుక్రవారం ముర్ము తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. రాష్ట్రపతి పర్యటన దృష్ట్యా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

21న హైదరాబాద్‌ కు రాష్ట్రపతి

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం మధ్యాహ్నం 1:10 గంటల సమయంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అక్కడి నుంచే 1:30కి నేరుగా రాజ్‌భవన్‌కు వెలుతారు. రాజ్‌భవన్‌లోనే ఆమె మధ్యాహ్న భోజనం చేసి, సాయంత్రం 3:25 వరకు విశ్రాంతి తీసుకోనున్నారు. తర్వాత సుమారు 3:50 గంటల సమయంలో బొల్లారం ప్రాంతంలోని రాష్ట్రపతి నిలయానికి రాష్ట్రపతి చేరుకుంటారు. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్య జరిగే భారతీయ కళా మహోత్సవంలో ఆమె పాల్గొంటారు. అనంతరం 6:15కి మళ్లీ రాజ్‌భవన్‌కి తిరిగి వెళ్తారు. అక్కడే ఆమె రాత్రి బస చేయనున్నారు.

22న పుట్టపర్తికి..

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 22వ తేదీ ఉదయం 9:30 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్ట్‌ నుంచి పుట్టపర్తికి బయలుదేరనున్నారు. ప్రశాంతి నిలయంలో జరగనున్న సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలకు ఆమె హాజరవుతారు.