ప్రజ్వల్‌ రేవణ్ణపై ప్రధాని మోదీ మాట్లాడరేం?

భారీ సెక్స్‌వీడియోల కేసులో ఉన్న ఎన్డీయే లోక్‌సభ సభ్యుడు, జేడీఎస్‌ నాయకుడు ప్రజ్వల్‌ రేవణ్ణ భారతదేశం నుంచి విదేశాలకు పరారవుతుంటే ప్రధాని మోదీ ఆయనను ఆపలేదని కాంగ్రెస్‌

  • Publish Date - May 1, 2024 / 08:18 PM IST

అహంభావిగా మారిన ప్రధాని

ధుబ్రి: భారీ సెక్స్‌వీడియోల కేసులో ఉన్న ఎన్డీయే లోక్‌సభ సభ్యుడు, జేడీఎస్‌ నాయకుడు ప్రజ్వల్‌ రేవణ్ణ భారతదేశం నుంచి విదేశాలకు పరారవుతుంటే ప్రధాని మోదీ ఆయనను ఆపలేదని కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ బుధవారం నిప్పులు చెరిగారు. అసోంలోని ధుబ్రిలో నిర్వహించిన ఎన్నికల సభలో ఆమె మాట్లాడారు. ప్రధాని మోదీ అహంభావి అని అభివర్ణించారు. ప్రజల బాధల పట్ల ఆయనకు అవగాహన లేదని అన్నారు. ‘సాధారణ ప్రజల వాస్తవ పరిస్థితులకు మోదీ చాలా దూరంగా ఉన్నరు. వారి బాధలు ఆయనకు పట్టవు. ఎందుకంటే ఆయన అహంభావిగా తయారయ్యారు’ అని ప్రియాంక విమర్శించారు. ప్రజ్వల్‌ రేవణ్ణ సెక్స్‌ వీడియోల కేసు వెలుగులోకి వచ్చిన దగ్గర నుంచీ ప్రధాని మోదీపై ప్రియాంక గాంధీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.

ఇటీవల రేవణ్ణ కోసం ఓట్లు అభ్యర్థించారన్న ప్రియాంక సెక్స్‌ వీడియోల విషయంలో ఆయన మౌనాన్ని ప్రశ్నించారు. ఆ వ్యక్తి మోదీ పక్కన నిలబడ్డారు. వేలమందిని లైంగిక వేధింపులకు గురిచేసిన ఆయన కోసం మోదీ ఓట్లు అభ్యర్థించారు. ఆ సంఖ్యలు విభ్రాంతి కలిగిస్తున్నాయి. దీనిపై మోదీ స్పందనేంటో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. కేంద్ర హోంమంత్రి దీనిపై ఏం చెప్పాలనుకుంటున్నారో వినాలనుకుంటున్నాను’ అని ప్రియాంక గాంధీ చెప్పారు. అయితే.. తెలంగాణలో ఈ అంశాన్ని పరోక్షంగా ప్రస్తావించిన ప్రధాని నరేంద్రమోదీ.. ‘మహిళల గౌరవంతో ఆటలాడుకునేవారు ఎవరైనా ఎంత పెద్ద అయినా సరే వదిలిపెట్టేది లేదు’ అని సరిపెట్టారు. కనీసం ఆయన పేరును ప్రస్తావించలేదు.

Latest News