ప్రధాని నరేంద్రమోదీ వారణాసి స్థానం నుంచి తృటిలో ఓటమిని తప్పించుకున్నారని కాంగ్రెస్ ఎంపీ రాహుల్గాంధీ ఎద్దేవా చేశారు. గత రెండు ఎన్నికలతో పోల్చితే వారణాసిలో మోదీ మెజార్టీ దారుణంగా పడిపోయిన విషయం తెలిసిందే
మలప్పురం: ప్రధాని నరేంద్రమోదీ వారణాసి స్థానం నుంచి తృటిలో ఓటమిని తప్పించుకున్నారని కాంగ్రెస్ ఎంపీ రాహుల్గాంధీ ఎద్దేవా చేశారు. గత రెండు ఎన్నికలతో పోల్చితే వారణాసిలో మోదీ మెజార్టీ దారుణంగా పడిపోయిన విషయం తెలిసిందే. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ రాహుల్ ఈ వ్యాఖ్య చేశారు. బుధవారం కేరళలోని మలప్పురంలో నిర్వహించిన సభలో రాహుల్ మాట్లాడుతూ.. ‘మోదీ వారణాసిలో (ఓటమిని) తప్పించుకున్నారనేది వాస్తవం. వారణాసిలో ఆయన ఓడిపోయిఉండేవారు’ అని చెప్పారు. ఫైజాబాద్ (అయోధ్య)లో బీజేపీ అనూహ్య ఓటమిని ప్రస్తావించిన రాహుల్.. విద్వేషం, హింసకు వ్యతిరేకంగా ఇది అయోధ్య ప్రజలు ఇచ్చిన సందేశమని అన్నారు. వారణాసిలో ప్రియాంక గాంధీ పోటీ చేసి ఉంటే.. మోదీని కచ్చితంగా ఓడించే ఉండేవాళ్లమని మంగళవారం కూడా రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ప్రియాంక పోటీ చేసి ఉంటే.. రెండు మూడు లక్షల ఓట్ల తేడాతో మోదీ ఓడిపోయి ఉండేవారని అన్నారు.
మోదీ బరిలో నిలిచిన వారణాసిలో కాంగ్రెస్ అభ్యర్థి అజయ్రాయ్ నుంచి ఒక దశలో తీవ్ర పోటీ ఎదుర్కొన్నారు. ఒక సందర్భంలో కాంగ్రెస్ అభ్యర్థికంటే మోదీ వెనుకబడినా.. తర్వాత పుంజుకున్నారు. 2014లో 3.71 లక్షల ఓట్లతో గెలిచిన మోదీ.. తదుపరి 2019 ఎన్నికల్లో మెజార్టీ పెంచుకుని.. 4.79 లక్షల ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. ఈసారి అంతకంటే మెజార్టీ పెరుగుతుందని బీజేపీ నేతలు చెప్పినా.. అనూహ్యంగా 1.5 లక్షల తేడాతో గట్టెక్కాల్సి వచ్చింది. అంటే.. మోదీ యాక్సెప్టెన్సీ వారణాసిలో తగ్గుతూ వస్తున్నదని విశ్లేషకులు చెబుతున్నారు. దీనితోపాటు ఉత్తరప్రదేశ్లోని అనేక ప్రాంతాల్లో బీజేపీ గణనీయంగా ఎదురుదెబ్బలు తిన్నది. ఇది రాష్ట్రంలో యోగి సర్కారు పట్ల ఉన్న వ్యతిరేకతను చాటుతున్నదని అంటున్నారు.