బాణాసంచా తయారీ పరిశ్రమల కేంద్రంగా ఉన్న తమిళనాడు రాష్ట్రంలోని శివకాశిలో గురువారం సంభవించిన భారీ పేలుడు ఏడుగురు ప్రాణాలను బలిగొంది.
10మందికి గాయాలు
విధాత: బాణాసంచా తయారీ పరిశ్రమల కేంద్రంగా ఉన్న తమిళనాడు రాష్ట్రంలోని శివకాశిలో గురువారం సంభవించిన భారీ పేలుడు ఏడుగురు ప్రాణాలను బలిగొంది. బాణాసంచా తయారీ కేంద్రంలో ముడి సరుకును లోడ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు భారీ పేలుడు జరిగింది. పేలుడు ధాటికి ఏడుగురు కార్మికులు సంఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఐదుగురు మహిళలు ఉన్నట్లుగా సమాచారం. మరో పదిమందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. పేలుడు సంభవించడంతో ఏడు గదులు ధ్వంసమయ్యాయి.
పేలుడు ఘటనపై స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించగా, రంగంలోకి దిగిన అగ్నిమాపక దళాలు మంటలను ఆర్పేందుకు, లోపల వారిని రక్షించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. కర్మాగారంలో మందుగుండు సామాగ్రి ఎక్కువ ఉండటంతో మంటలు ఎగసిపడుతుండటంతో వాటిని అర్పడం ఆలస్యమవుతుంది. మంటలు ఆర్పివేశాక సంఘటన స్థలాన్ని పరిశీలిస్తేగాని పూర్తి వివరాలు తెలియనున్నాయి. ప్రమాదం ఘటనపై శివకాశి ఈస్ట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.శివకాశిలో బాణాసంచా పేలుడు ప్రమాదాలలో తరుచు ప్రాణం నష్టం జరుగుతుండటంతో బాణాసంచా పరిశ్రమల నిర్వాహణలో భద్రతా ప్రమాణాలు చర్చనీయాంశంగా మారాయి.