లోయపై ఆగిపోయిన జిప్ లైన్..ప్రాణభయంతో పర్యాటకుడు విలవిల!

మహారాష్ట్ర టోరణ్‌మాల్ హిల్ స్టేషన్‌లో జిప్‌లైన్ ప్రయాణం మధ్యలో ఆగిపోవడంతో ఓ పర్యాటకుడు లోయపై గాల్లోనే చిక్కుకున్నాడు. సిబ్బంది సకాలంలో రక్షించడంతో పెను ప్రమాదం తప్పింది.

Reported by: Tejaswini Nanna | జాతీయం | Jul 30, 2026, 1:18 pm IST
Read Time: 4 mins
లోయపై ఆగిపోయిన జిప్ లైన్..ప్రాణభయంతో పర్యాటకుడు విలవిల!

హిల్ స్టేషన్ లో ఓ భారీ లోయపైన జిప్ లైన్ సరదాగా ప్రయాణించాలనుకున్న పర్యాటకుడు గాలిలోనే జిప్ లైన్ ఆగిపోవడంతో ప్రాణాలు గాలిలో పెట్టుకుని భయంతో విలవిలలాడిన ఘటన వీడియో వైరల్ గా మారింది. మహారాష్ట్రలోని నందుర్‌బార్ జిల్లా టోరణ్‌మాల్ హిల్ స్టేషన్‌లోని సీతాఖాయ్ పాయింట్ వద్ద 3,500 అడుగుల భారీ లోతైన లోయపై ఏర్పాటు చేసిన జిప్‌లైన్‌లో ఓ పర్యాటకుడు మధ్యలోనే చిక్కుకుపోయాడు.

ఇటీవల ప్రారంభమైన ఈ జిప్‌లైన్‌పై పర్యాటకుడు ప్రయాణిస్తున్న సమయంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో అది అకస్మాత్తుగా ఆగిపోయింది. దీంతో పర్యాటకుడు జిప్ లైన్ పైనే గాల్లోనే నిలిచిపోయాడు. కిందకు చూస్తే భారీ లోయ..తను గాలిలో వేలాడుతున్న పరిస్థితిని తలుచుకుని ఆ పర్యాటకుడు ప్రాణ భయంతో గిజగిజలాడిపోయాడు. ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠత బాధితుడితో పాటు అక్కడున్న పర్యాటకులకు, సిబ్బందిని సైతం వణికించింది.

ఈ సమాచారం అందుకున్న జిప్‌లైన్ సిబ్బంది వెంటనే సహాయక చర్యలు చేపట్టి ఎట్టకేలకు పర్యాటకుడిని సురక్షితంగా కిందికి దించారు. ఈ ఘటనతో జిప్ లైన్ ప్రయాణం అంటేనే పర్యాటకులు భయపడిపోయే పరిస్థితి నెలకొంది. ఇటీవల కాలంలో పలు ప్రాంతాల్లో సాహస క్రీడలు, బంగీ జంపింగ్, సర్ఫింగ్, జిప్ లైన్ వంటి ఆటలతో పలువురు ప్రాణాలు పొగొట్టుకుంటున్న ఘటనలు పెరిగిపోతుండటంతో వాటి పట్ల పర్యాటకులలో ఆందోళన రేకెత్తిస్తుంది.