న్యూఢిల్లీ: ఆర్థిక నేరగాడు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ను రూ.వేల కోట్ల మేర మోసగించి లండన్ పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని భారత్ కు అప్పగించే మార్గం సుగమమైనట్లుగా తెలుస్తోంది. నవంబరు 23న నీరవ్ను భారత అధికారులకు అప్పగించే అవకాశాలున్నట్లు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి. అప్పగింత ప్రక్రియకు సంబంధించి భారత ప్రభుత్వం బ్రిటిష్ అధికారులకు తాజాగా హామీపత్రం అందజేసింది. నీరవ్ను భారత్కు తీసుకొచ్చాక కేవలం మోసం, మనీలాండరింగ్ కేసుల్లో మాత్రమే విచారిస్తామని, ఇతర ఏజెన్సీల కస్టడీకి ఇవ్వబోమని అందులో పేర్కొన్నట్లు సమాచారం. సీబీఐ, ఈడీ, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్, కస్టమ్స్, ఆదాయపు పన్ను విభాగం సంయుక్తంగా ఈ హామీ పత్రాన్ని అందజేసినట్లు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి. అంతేగాక, భారత్కు అప్పగించిన తర్వాత నీరవ్ మోదీని ముంబయిలోని ఆర్థర్ రోడ్ జైల్లో ఉంచి.. అతడికి హై ప్రొఫైల్ ఖైదీలకు అందించే సౌకర్యాలు కల్పిస్తామని వెల్లడించినట్లు సమాచారం.
లండన్ కోర్టు షరతులతోనే అప్పగింత
2018లో పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసగించిన నీరవ్ మోడీ లండన్ పారిపోయాడు. ఈ కుంభకోణంపై ఈడీ, సీబీఐ దర్యాప్తు ప్రారంభించగా.. ఈడీ అతడిని పరారైన ఆర్థిక నేరగాడిగా ప్రకటించింది. 2019 మార్చిలో లండన్ పోలీసులు నీరవ్ ను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అతడిని భారత్కు అప్పగించడానికి 2021లో అప్పటి బ్రిటన్ హోం మంత్రి ప్రీతి పటేల్ ఉత్తర్వులు జారీ చేశారు. వీటిని సవాల్ చేస్తూ నీరవ్ లండన్ హైకోర్టులో అప్పీల్ చేసుకున్నప్పటికీ కోర్టు తిరస్కరించింది. బెయిల్ కోసం అతను చేసిన ప్రయత్నాలన్ని విఫలమయ్యాయి. తన అప్పగింత ప్రక్రియను సవాల్ చేస్తూ ఇటీవల నీరవ్ మోదీ మరోసారి కోర్టును ఆశ్రయించారు. తనను భారత్కు అప్పగిస్తే దేశంలోని బహుళ విచారణ సంస్థలు దర్యాప్తు పేరుతో చిత్రహింసలకు గురిచేస్తాయని అతడు తన పిటిషన్లో పేర్కొన్నాడు. ఈ కేసు మొత్తాన్ని తిరిగి ప్రారంభించాలని అభ్యర్థించాడు. ఈ పిటిషన్ను లండన్ కోర్టు అంగీకరించింది. ఈ క్రమంలోనే భారత దర్యాప్తు సంస్థలు హామీ పత్రాన్ని సమర్పించాయి. దీన్ని పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం..తదుపరి విచారణ సమయంలో నవంబరు 23న నీరవ్ మోదీని భారత్కు అప్పగించవచ్చని సమాచారం.