మూడో విడుత లోక్సభ ఎన్నికల్లో భాగంగా మహారాష్ట్రలోని సోలాపూర్ ఎంపీ స్థానానికి మంగళవారం పోలింగ్ ప్రక్రియ జరిగింది. అయితే సంగోలా తాలుకాలోని బగల్వాడి పోలింగ్ కేంద్రంలో మధ్యాహ్నం సమయంలో ఓ ఓటరు లోపలికి ప్రవేశించి, ఈవీఎంపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు
ముంబై : మూడో విడుత లోక్సభ ఎన్నికల్లో భాగంగా మహారాష్ట్రలోని సోలాపూర్ ఎంపీ స్థానానికి మంగళవారం పోలింగ్ ప్రక్రియ జరిగింది. అయితే సంగోలా తాలుకాలోని బగల్వాడి పోలింగ్ కేంద్రంలో మధ్యాహ్నం సమయంలో ఓ ఓటరు లోపలికి ప్రవేశించి, ఈవీఎంపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
అప్రమత్తమైన పోలింగ్ సిబ్బంది అక్కడున్న నీటితో మంటలను ఆర్పేసింది. అయినప్పటికీ మంటలు చల్లారలేదు. దీంతో ఓ బట్టతో మంటలను ఆర్పేశారు. అనంతరం పోలింగ్ ప్రక్రియను నిలిపివేశారు. ఈవీఎంకు నిప్పంటించిన ఘటనతో పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోలింగ్ కేంద్రం వద్ద పోలీసులు భారీగా మోహరించారు.
సోలాపూర్ నియోజకవర్గం నుంచి మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్ కుమార్ షిండే కూతురు ప్రణితి షిండే బరిలో ఉన్నారు. ఈమె కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్నారు. బీజేపీ తరపున రామ్ సత్పుతే పోటీలో ఉన్నారు. వీరిద్దరి మధ్యే ప్రధాన పోటీ ఉంది.