సార్వత్రిక ఎన్నికల్లో 400 సీట్లు గెలువడం ఖాయమని బీజేపీ చేస్తున్న ప్రచారంపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అమృత్సర్లో మీడియాతో మాట్లాడుతూ.. ‘తమిళనాడు, కేరళ, తెలంగాణలో బీజేపీ ఉనికిలోనే లేదు
(విధాత ప్రత్యేకం)
సార్వత్రిక ఎన్నికల్లో 400 సీట్లు గెలువడం ఖాయమని బీజేపీ చేస్తున్న ప్రచారంపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అమృత్సర్లో మీడియాతో మాట్లాడుతూ.. ‘తమిళనాడు, కేరళ, తెలంగాణలో బీజేపీ ఉనికిలోనే లేదు. కర్ణాటకలో బలంగా లేదు. మహారాష్ట్రలో బలహీనంగా ఉండగా.. పశ్చిమబెంగాల్, ఒడిషాలలో పోటీ ఉన్నది. అలాంటప్పుడు బీజేపీ 400 సీట్లు ఎలా గెలువగలదు?’ అని ప్రశ్నించారు. బీజేపీ కొన్ని రాష్ట్రాల్లో గతంలో గెలుచుకున్న సీట్లను ఈసారి కోల్పోతుందని, తమిళనాడు, కేరళ, తెలంగాణ రాష్ట్రాల్లో ఆ పార్టీకి 5 సీట్లు పెంచుకుంటుందని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు యోగేంద్ర యాదవ్ కూడా ప్రస్తుత ఎన్నికలపై తన అంచనాను వెల్లడించిన సంగతి తెలిసిందే.
2019లో ఫలితాలు ఇలా..
ఖర్గే వ్యాఖ్యల సారాంశాన్ని అర్థం చేసుకుంటే వాస్తవమే అనిపిస్తుంది. ఈసారి పోలింగ్ సరళిని అంచనా వేస్తున్న రాజకీయ విశ్లేషకులలో కొంతమంది ఇదే విషయాన్ని చెబుతున్నారు. 2019 లోక్సభ ఎన్నికల్లో ఈ రాష్ట్రాల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయో చూస్తే.. తమిళనాడులోని 39 స్థానాల్లో (డీఎంకే 24, కాంగ్రెస్ 8, సీపీఐ 2, సీపీఎం 2, వీసీకే (విడుతలై చిరుతైగల్ కట్చి) 1, ఐయూఎంఎల్ (ఇండియన్ యూనియన్ ముస్లిమ్ లీగ్) 1, అన్నాడీఎంకే 1) కేరళలో 20 స్థానాలకు గాను (కాంగ్రెస్ 15, సీపీఎం 1, ఇతరులు 4, బీజేపీ 0), తెలంగాణలో 17 స్థానాల్లో (బీఆర్ఎస్ 9, బీజేపీ 4, కాంగ్రెస్ 3, ఎంఐఎం 1), కర్ణాటకలో గత ఎన్నికల్లో 28 స్థానాలకు గాను (బీజేపీ 25, కాంగ్రెస్ 1, జేడీఎస్ 1, ఇతరులు 1) మహారాష్ట్రలోని 48 స్థానాల్లో (బీజేపీ 23, శివసేన 18, ఎన్సీపీ 4, కాంగ్రెస్ 1, ఇతరులు 2 ) ఒడిశాలోని 21 స్థానాల్లో (బీజూ జనతా దళ్ 12, బీజేపీ 8, కాంగ్రెస్ 1), పశ్చిమ బెంగాల్ లో 42 స్థానాలకు గాను (తృణమూల్ కాంగ్రెస్ 22, బీజేపీ 18, కాంగ్రెస్ 2) గెలిచాయి.
ఆ ఏడు రాష్ట్రాల్లో బీజేపీకి ఎన్ని రావొచ్చు?
తమిళనాడు, కేరళ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా, పశ్చిమబెంగాల్.. ఈ ఏడు రాష్ట్రాలలో 39+ 20+ 17+ 28+ 48+ 21+ 42= 215 సీట్లున్నాయి. వీటిలో గత ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 78 స్థానాలను గెలుచుకున్నది. తమిళనాడు, కేరళలో ఆ పార్టీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. ఈసారి ఆ రాష్ట్రాల్లో గత ఎన్నికల ఫలితాలే పునరావృతమౌతాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కర్ణాటకలో ఈసారి బీజేపీ డబుల్ డిజిట్ దక్కించుకుంటే గొప్పే అంటున్నారు. మహారాష్ట్రలో గత ఎన్నికల్లో శివసేనతో కలిసి పోటీ చేయడం వల్ల అటు బీజేపీ ఇటు శివసేన రెండూ కలిసి మొత్తం సీట్లలో మెజారిటీ దక్కించుకున్నాయి.
ఇప్పుడు అక్కడ శివసేన, ఎన్సీపీ రెండు పార్టీల్లో చీలికకు కారణం కాషాయపార్టీ అనే విమర్శలున్నాయి. ఆ ప్రభావం ఈ ఎన్నికల్లో ఉండబోతున్నదని అనేది అక్కడి పోలింగ్ సరళిని బట్టి చెబుతున్నారు. ఇక బెంగాల్, ఒడిశాలలో 18+8=26 స్థానాలను గెలుచుకున్న బీజేపీ ఈసారి వాటిని నిలబెట్టుకోవడంతో పాటు అదనంగా ఇంకా కొన్నిసీట్లను దక్కించుకోవడానికి తీవ్రంగానే శ్రమించింది. ఆ ప్రయత్నం ఫలిస్తే కాషాయపార్టీకి కొంత కలిసి వచ్చే అంశమే. కానీ అదంతా ఈజీ కాదు అనే వాదన ఉన్నది. బెంగాల్లో 9, ఒడిశాలో 6 స్థానాలకు జూన్ 1న తుది దశలో పోలింగ్ జరగనున్నది. దాని తర్వాత బీజేపీ ఆశించిన సీట్లు ఈ రెండు రాష్ట్రాల్లో సాధ్యమౌతాయా? లేదా అన్నది క్లారిటీ వస్తుంది.
ఖర్గే తో పాటు ఇతర రాజకీయ విశ్లేషకులు చెబుతున్నట్టు బీజేపీ ఈ రాష్ట్రాల్లో ఉన్న సీట్లను నిలబెట్టుకోవడమే కాదు గత ఎన్నికల్లో ఆ పార్టీ స్వీప్ చేసిన (అరుణాచల్ ప్రదేశ్ 2/2, హర్యానా 10/10, ఢిల్లీ 7/7, గుజరాత్ 26/26, హిమాచల్ప్రదేశ్ 4/4, రాజస్థాన్ 25/24, త్రిపుర 2/2, ఉత్తరాఖండ్ 5/5) లతో పాటు బీహార్, యూపీలలోనూ గత ఫలితాలను పునరావృతం చేస్తేనే 400పైగా సీట్ల లక్ష్యం సాధ్యమౌతుంది. కానీ ఎట్లా చూసినా బీజేపీకి ఈసారి తగ్గడమే తప్పా పెరగడం లేదన్నది అందరూ అంటున్న మాట. అందుకే కనీసం 200 సీట్లు రావడమూ కష్టమే అన్న అభిప్రాయాన్ని విపక్ష నేతలు చెబుతున్నారు.