PJR Flyover inauguration | 100 ఏళ్లకు సరిపోయేలా హైదరాబాద్‌ నగరాభివృద్ధికి ప్లాన్ : పీజేఆర్ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవ సభ‌లో సీఎం రేవంత్ రెడ్డి

‘తెలంగాణ రైజింగ్ 2047 ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం. కోర్ అర్బన్ రీజియన్,సేమీ అర్బన్ రీజియన్,రూరల్ తెలంగాణ గా విభజించి ముందుకు అడుగులు వేస్తున్నాం. ఢిల్లీ నగరం కాలుష్యం కారణంగా నివసించ లేని పరిస్థితిలో ఉంది. చెన్నై లో వరద కష్టాలు,బెంగుళూరు లో ట్రాఫిక్ కష్టాలు ఉన్నాయి..ముంబై, చెన్నై, బెంగళూరు నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలి" అని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.

  • By: TAAZ    news    Jun 28, 2025 8:22 PM IST
PJR Flyover inauguration | 100 ఏళ్లకు సరిపోయేలా హైదరాబాద్‌ నగరాభివృద్ధికి ప్లాన్ : పీజేఆర్ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవ సభ‌లో సీఎం రేవంత్ రెడ్డి

PJR Flyover inauguration | 100 ఏళ్లకు సరిపోయేలా హైదరాబాద్ నగరానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ఎన్ని అవంతరాలు, అడ్డంకులు ఎదురైనా మేం ఆగకుండా తెలంగాణ రైజింగ్ ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. కొండాపూర్‌ నుంచి ఓఆర్‌ఆర్‌ వరకు నిర్మించిన పీ.జనార్థన్‌రెడ్డి (పీజేఆర్‌) ఫ్లైఓవర్‌ను సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు పాన్నం ప్రభాకర్‌, శ్రీధర్‌బాబు, మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి, ఎమ్మెల్యే గాంధీ లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం ప్రసంగించారు. జంట నగరాల్లో 25 ఏళ్ల పాటు పీజేఆర్ శకం నడిచిందని, సీఎల్పీ నేత గా పీజేఆర్ పోరాటం అందరికీ తెలుసన్నారు. పీజేఆర్ పోరాటం వల్లనే నగరానికి కృష్ణా జలాలు వచ్చాయని.. ప్రజలు మంచి నీటి అవసరాలు తీరాయంటే అది పీజేఆర్ చలువనేని గుర్తు చేశారు. తెలంగాణ లో 65 శాతం ఆదాయం హైదరాబాద్ నగరం నుంచే వస్తుందని.. హైదరాబాద్ కు ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, ముంబై పోటీ కాదు.. న్యూయర్, టోక్యో, సింగపూర్ లతో మనం పోటీ పడాలని చెప్పారు. “నగరాభివృద్ధి కి కొందరు అవాంతరాలు,అడ్డంకులు సృష్టిస్తున్నారు. తెలంగాణ రైజింగ్ 2047 ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం. కోర్ అర్బన్ రీజియన్,సేమీ అర్బన్ రీజియన్,రూరల్ తెలంగాణ గా విభజించి ముందుకు అడుగులు వేస్తున్నాం. ఢిల్లీ నగరం కాలుష్యం కారణంగా నివసించ లేని పరిస్థితిలో ఉంది. చెన్నై లో వరద కష్టాలు,బెంగుళూరు లో ట్రాఫిక్ కష్టాలు ఉన్నాయి..ముంబై, చెన్నై, బెంగళూరు నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలి” అని తెలిపారు.

ఎన్ని అవాంతరాలు ఎదురైనా మేం ఆగం

“రాజకీయాల ముసుగులో ప్రభుత్వ కార్యక్రమాలను అడ్డుకునే వారిని క్షమించ వద్దని, గచ్చిబౌలిలో భూముల్లో ఐటీ కంపెనీలు తీసుకువచ్చి లక్షలాది మంది ఉపాధి కల్పించాలని ప్రయత్నిస్తే అడ్డుకున్నారు. గచ్చిబౌలి భూములపైన న్యాయపోరాటం చేసి సాధించుకుని లక్షల మందికి ఉపాధి కల్పిస్తామని ఎన్ని అవాంతరాలు ఎదురైనా మేం ఆగం అని స్పష్టం చేశారు.
డీజిల్ బస్సు ల వల్ల హైదరాబాద్ లో కాలుష్యం పెరుగుతుందని వాటిని జిల్లాలకు తరలించాం. నగరంలోకి 3 వేల ఎలక్ట్రిక్ బస్సు లసు తీసుకు వస్తున్నాం..ఆటో ల కొనుగోలు పైన నిషేధాన్ని తొలగించి ఎలక్ట్రికల్, సీఎన్ జీ ఆటోలకు అనుమతి ఇస్తున్నాం. హైడ్రా తో ఆక్రమణలు తొలగిస్తున్నాం.. ఎఫ్ టీఎల్ పరిధిలో ఉన్న ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను ప్రభుత్వం తొలగించింది..హీరో నాగార్జున స్వయంగా ఎన్ కన్వెన్షన్ కు చెందిన  రెండెకరాలు అప్పగించి నగరాభివృద్ధి కి సహకరించారని చెప్పారు. 40 ఏళ్లుగా బీఆర్ఎస్ నాయకుల ఆక్రమణలో ఉన్న బతుకమ్మ కుంట ను అభివృద్ధి చేస్తున్నాం. 2029లో నియోజకవర్గాల పునర్విభజన జరగబోతోందని దానికోసం నాయకులు సిద్ధంగా ఉండాలి” అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

30 వేల ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణం

డిసెంబర్ 9 లోపు విజన్ డాక్యుమెంట్ ను విడుదల చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి..30 వేల ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీ ని నిర్మిస్తున్నామని వెల్లడించారు. ప్రపంచం అంతా భారత్ ఫ్యూచర్ సిటీ వైపు చూస్తోందన్నారు. 2029 లో శేరిలింగంపల్లి నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు విడిపోయే అవకాశం ఉందని తెలిపారు. మన్మోహన్ సింగ్,  జైపాల్ రెడ్డి వల్ల హైదరాబాద్ కు మెట్రో వచ్చింది..పీవీ నరసింహారావు వల్ల ఐటీ వచ్చింది..ప్రధాని మోదీ వల్ల హైదరాబాద్ నగరానికి ఇప్పటివరకు ఏం వచ్చిందో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పాలని ప్రశ్నించారు. బెంగళూరు, చెన్నై, ఏపీ కి మెట్రో రైల్ ఇచ్చారు.. గుజరాత్ కు బుల్లెట్ ట్రైన్ ఇచ్చారు..గుజరాత్ కు సబర్మతి, ఢిల్లీ కి యమునా, ఉత్తర ప్రదేశ్ కు గంగా ఇచ్చారు.. మరీ మన మూసీ రివర్ ఫ్రంట్ కు ఎందుకు కేంద్రం నిధులు ఇవ్వడం లేదు? తెలంగాణ పైన ఎందుకు ఈ వివక్ష? అని నిలదీశారు. మెట్రోలో తెలంగాణ తొమ్మిదో స్థానానికి దిగజారింది.. ఇది కిషన్ రెడ్డి కి కనిపించడం లేదా? ఎవరు కుట్ర లు చేస్తున్నారో, ఎవరు అభివృద్ధి చేస్తున్నారో ప్రజలు గమనించాలని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.