విధాత: బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసు తదుపరి విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది. పార్టీ ఫిరాయింపుల కేసుపై సుప్రీం కోర్టులో బుధవారం విచారణ కొనసాగింది. బీఆర్ఎస్ నేతలు పాడి కౌశిక్ రెడ్డి, కేటీఆర్, బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరుగుతోంది. గత విచారణ సందర్భంగా పిటిషనర్ల తరఫున న్యాయవాదులు ఆర్యమా సుందరం వాదనలు వినిపించారు. ఈరోజు ప్రతివాదులుగా ఉన్న తెలంగాణ అసెంబ్లీ స్పీకర్, ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేల తరఫున సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గి, అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు.స్పీకర్ తరపున ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. స్పీకర్ విశేషాధికారాల్లో కోర్టులు జోక్యం చేసుకోరాదని.. స్పీకర్ నిర్ణయం తీసుకున్న తరువాతే న్యాయ సమీక్షకు అవకాశం ఉందన్నారు. ఫిరాయింపులపై హైకోర్టు ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని.. అక్కడ కేసు పెండింగ్లోనే ఉందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ముకుల్ రోహత్గి వాదనలు గతంలో సుప్రీం రాజ్యాంగ ధర్మాసనాలు ఇచ్చిన తీర్పులకు భిన్నంగా ఉందని జస్టిస్ బీఆర్ గవాయ్ అన్నారు. స్పీకర్కు రాజ్యాంగం కల్పించిన విశేషాధికారాలను కోర్టులు హరించలేవని ముకుల్ రోహత్గి వాదించారు.
దీనిపై జస్టిస్ బీఆర్ గవాయ్ మాట్లాడుతూ.. స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే కోర్టులు జోక్యం చేసుకోకూడదా అని ప్రశ్నించారు. స్పీకర్ ఐదేళ్ల వరకూ నిర్ణయం తీసుకోకపోతే అంతవరకూ కోర్టులు నిర్ణయం తీసుకోకూడదా అని అడిగారు. ఒక రాజ్యాంగ వ్యవస్థపై మరో రాజ్యంగ వ్యవస్థ పెత్తనం చేయలేదని ముకుల్ రోహత్గి వాదించారు. అయితే స్పీకర్కు సరైన సమయంలో నిర్ణయం తీసుకోమని విజ్ణప్తి చేయడమో, ఆదేశించడమో కోర్టులు చేయకూడదా అని ముకుల్ను జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రశ్నించారు. ఫిరాయింపులపై పిటీషనర్ల ఇష్టానుసారం స్పీకర్ వ్యవహరించలేరని.. 18.03.2024న పిటీషనర్లు స్పీకర్కు విజ్ణప్తి చేశారని రోహత్గి తెలిపారు.
16.01.2025న 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారని.. స్పీకర్ తన విధులను నిర్వర్తిస్తున్నారని వాదించారు. స్పీకర్పై నమ్మకం లేక రిట్ల పైన రిట్లు దాఖలు చేయడం ఎందుకు?…స్పీకర్ నిర్ణయం తీసుకునేంత వరకూ ఎందుకు పిటీషనర్లు ఆగరని సీనియర్ న్యాయవాది ప్రశ్నించారు. ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్కు ఫిర్యాదు చేసిన వారంలోనే కోర్టులో పిటిషన్ వేశారని కోర్టుకు తెలిపారు. ఒకదాని తర్వాత మరొక రిట్ పిటిషన్లు దాఖలు చేస్తూ వచ్చారన్నారు. కనీసం ఆలోచించే అవకాశం కూడా లేకుండా కోర్టులో రిట్ పిటిషన్లు దాఖలు చేస్తూ వచ్చారన్నారు. సింగిల్ జడ్జి బెంచ్ నాలుగు వారాల్లో షెడ్యూల్ చేయాలని చెప్పిందని.. ఆ ఆదేశాలను డివిజన్ బెంచ్ కొట్టేసిందని తెలిపారు. రాణా కేసుతో ఈ కేసును ముడి పెడుతున్నారని.. అది ఏమాత్రం సమంజసం కాదని.. రాణా కేసు పూర్తిగా భిన్నమైన వ్యవహారమని ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు.
రోహత్గి వాదనల్లో జస్టిస్ బీఆర్ గవాయ్ జోక్యం చేసుకున్నారు. కోర్టులు రాజ్యాంగ పరిరక్షకులుగా వ్యవహరిస్తాయని న్యాయమూర్తి స్పష్టం చేశారు. నాలుగుర సంవత్సరాలు స్పీకర్ ఏ చర్యలు తీసుకోకపోతే..ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతుంటే కోర్టులు చూస్తూ ఉండాల్సిందేనా అని జస్టిస్ గవాయ్ ప్రశ్నించారు. ఆర్టికల్ 142 ప్రకారం కోర్టులు శక్తిలేనివి కావన్నారు. సుప్రీం కోర్టు నోటీసు తర్వాతే ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు ఇచ్చారన్న బీఆర్ గవాయ్ గుర్తు చేశారు. కోర్టు ధిక్కరణ కేసులో అసెంబ్లీ స్పీకర్ ను కూడా కోర్టులో నిలబెట్టామన్న విషయం మర్చిపోవద్ధన్నారు. అయితే ముగ్గురు ఎమ్మెల్యేలపై మూడు వేర్వేరు సమయాల్లో పిటిషన్లు దాఖలైనందునా నోటీసుల జారీలో ఆలస్యమైందని రోహత్గి వాదించారు. ఇక అసెంబ్లీ కార్యదర్శి తరుపునా రేపు గురువారం వాదనలు వినిపిస్తానని సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ కోరగా ధర్మాసనం విచారణ రేపటికి వాయిదా వేసింది.
సీఎం రేవంత్ రెడ్డిపై సుప్రీం కోర్టు ఆగ్రహం
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత పడదని, ఉప ఎన్నికలు రావని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీలో మాట్లాడిన మాటలను పిటిషనర్ల న్యాయవాది ఆర్యమా సుందరం సుప్రీంకోర్టు జడ్జి గవాయ్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన గవాయ్ కోర్టులో నడుస్తున్న కేసుపై రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఎలా మాట్లాడుతాడు? ఉప ఎన్నికలు రావని రేవంత్ రెడ్డి ఎలా అంటాడు? అని అసహనం వ్యక్తం చేశారు. ఇంతకూ ముందే ఇలా న్యాయస్థానానికి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి మాట్లాడాడారని..మళ్లీ మళ్లీ అలానే రిపీట్ చేస్తున్నాడు అంటూ రేవంత్ రెడ్డిపై జస్టిస్ బీఆర్ గవాయ్ మండిపడినట్లుగా తెలుస్తుంది.