దేశ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 7 గంటల నుంచే భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. సాయంత్రం 6 గంటల వరకు కూడా వేడి గాలులు వీస్తూనే ఉన్నాయి
దేశ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 7 గంటల నుంచే భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. సాయంత్రం 6 గంటల వరకు కూడా వేడి గాలులు వీస్తూనే ఉన్నాయి. దీంతో జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసర పనుల మీద బయటకు వస్తున్న వారు ఎండ వేడిమికి విలవిలలాడిపోతున్నారు. ఇక వాహనదారులు అయితే నానా తంటాలు పడుతున్నారు. సిగ్నల్స్ వద్ద ఆగినప్పుడు నరకం కనిపిస్తోంది. వాహనాల వేడితో పాటు, భూమి పొరల్లో నుంచి వస్తున్న వేడికి శరీరం కాలిపోతుందా..? అన్న ఫీలింగ్ కలుగుతోంది.
వాహనదారులను దృష్టిలో ఉంచుకుని పుదుచ్చేరి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద గ్రీన్ నెట్స్తో చలువ పందిళ్లను ఏర్పాటు చేసింది. ప్రతి సిగ్నల్ వద్ద దాదాపు 200 మీటర్ల వరకు గ్రీన్ నెట్స్ను ఏర్పాటు చేయడంతో వాహనదారులు ఎండ, వడగాలుల నుంచి కాస్త ఉపశమనం పొందుతున్నారు. ఈ ఏర్పాట్లు పుదుచ్చేరి పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ చేసింది. అన్ని రాష్ట్రాల్లో ఇలా సిగ్నల్స్ వద్ద గ్రీన్ నెట్స్ ఏర్పాటు చేస్తే ఎంత బాగుంటుందో అని నెటిజన్లు పేర్కొంటున్నారు. ఈ గ్రీన్ నెట్స్ కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.