TREIRB | పరీక్ష కోసం అభ్యర్థులు తిరగక తప్పదు విద్యా మంత్రి గారూ జర సూడుండ్రి! విధాత: సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తర్వాత పరీక్షలు సులువు కావాలి. కానీ సంక్ష్లిష్ట మౌతున్నాయి. టీఎస్ఫీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ తర్వాత నిర్వహించిన కొన్ని పరీక్షలు చూస్తే ఇదే అర్థమౌతుంది. తాజాగా టీఆర్ఈఐఆర్బీ ద్వారా గురుకుల టీచర్ల నియమకాల కోసం ఆగస్టు మొదటి వారం నుంచి ఆన్లైన్లో పరీక్షలు ప్రారంభం అవుతున్నాయి. ఒక్కో పరీక్ష కోసం మూడు పేపర్లు ఉన్నాయి. […]
TREIRB |
విధాత: సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తర్వాత పరీక్షలు సులువు కావాలి. కానీ సంక్ష్లిష్ట మౌతున్నాయి. టీఎస్ఫీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ తర్వాత నిర్వహించిన కొన్ని పరీక్షలు చూస్తే ఇదే అర్థమౌతుంది. తాజాగా టీఆర్ఈఐఆర్బీ ద్వారా గురుకుల టీచర్ల నియమకాల కోసం ఆగస్టు మొదటి వారం నుంచి ఆన్లైన్లో పరీక్షలు ప్రారంభం అవుతున్నాయి. ఒక్కో పరీక్ష కోసం మూడు పేపర్లు ఉన్నాయి. ఈ పరీక్షలపై నిరుద్యోగ అభ్యర్థుల్లో ఆందోళన వ్యక్తమౌతున్నది.
మూడు పేపర్లు మూడు జిల్లాల్లో వేశారు. పరీక్షలు రాయాలంటే చాలామంది అభ్యర్థులు మూడు జిల్లాలు తిరగాలి. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా వరద బాధితులు ఇప్పటికీ పునరావాస కేంద్రాల్లోనే ఉన్నారు. కొన్నిచోట్ల కాలనీల్లో ఇప్పుడిప్పుడే పరిస్థితులు అదుపులోకి వస్తున్నాయి. చాలా జిల్లాలో రహదారులు దెబ్బతిన్నాయి. కొన్ని గ్రామాలకు కనెక్టివిటీ తెగిపోయింది. ఈ సమయంలో గురుకుల నియామక బోర్డు పరీక్షల నిర్వహణలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిందని అభ్యర్థులు వాపోతున్నారు.
కానీ ఇందుకు విరుద్ధంగా పరీక్ష కేంద్రాలను ఇష్టం వచ్చినట్టు వేసిందని అభ్యర్థులు విమర్శిస్తున్నారు. జేఎల్, డీఎల్, టీజీటీ, పీజీటీ, లైబ్రేరియన్ ఇలా అనేక విభాగాల పరీక్షలు ఉన్నాయి. ఇలా సగటున ఒక్క అభ్యర్థి జేఎల్, డీఎల్, టీజీటీ, పీజీటీ పరీక్షలు రాయంటే 12 పరీక్షలు రాయాలి. ఇలా వివిధ జిల్లాల్లో సెంటర్లు వేస్తే ఎన్నిసార్లు తిరగాల్సి వస్తుందో ఆలోచించాలంటున్నారు.
ఉదాహరణకు కరీంనగర్లో సెంటర్ పెట్టుకున్న అభ్యర్థి ఒక పరీక్ష హైదరాబాద్లో మరోపరీక్ష కరీంనగర్లో, ఇంకో పరీక్ష వరంగల్లో వేశారు. ఇలా మూడుచోట్లకు తిరగాలి. పరీక్షలు రాసేవారిలో గర్భిణీలు, చిన్న పిల్లలు ఉన్న వారు ఉంటారు. వారు వాళ్లను తీసుకుని ఇలా జిల్లాలు తిరగగలుగుతారా? వర్షాలతో అతలాకుతలం అయిన వాళ్లు ప్రయాణం ఎలా చేయగలుగుతారు? పరీక్ష నిర్వాహకులు ఈ అంశాలను పరిగణనలోకి తీసుకున్నారా?అని ప్రశ్నిస్తున్నారు.
ఉదాహరణకు ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాతో పాటు మొరంచపల్లి, ములుగులో కొన్ని ప్రాంతాలు కనీస రవాణా సౌకర్యాలు లేవు. వర్షాల నేపథ్యంలో దాదాపు గత వారమంతా విద్యా సంస్థలకు ప్రభుత్వమే సెలవులు ప్రకటించింది. దీన్నిబట్టి పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. ఈ క్లిష్ట సమయంలో నిరుద్యోగ అభ్యర్థులు పరీక్షలు రాయడానికి రెండు మూడు జిల్లాలు తిరగడం ఇబ్బందిగా మారుతున్నది.
ముఖ్యమంత్రి కేసీఆర్, విద్యా శాఖ మంత్రి అభ్యర్థుల అవస్థలను పరిగణనలోకి తీసుకుని ఎవరి జిల్లాల్లో వారి సెంటర్లు కేటాయించాలని పరీక్షార్థులు కోరుతున్నారు. ఎన్నికలు ఉన్నాయనే కారణంతో పరీక్షలు తొందరగా పెడుతున్నామంటున్నారని, ఎన్నికలతో, ఓట్లతో సంబంధ లేకుండా అభ్యర్థుల సమస్యలను అర్థం చేసుకుని నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు.