• Telugu News
  • /News

India-Russia Oil Deal : ఎక్కడ బెస్ట్ డీల్ ఉంటే అక్కడి నుంచే చమురు కొనుగోలు: రష్యా లో భారత రాయభారి వినయ్ కుమార్

భారత్ అత్యుత్తమ డీల్ ఇచ్చే దేశం నుంచే చమురు కొనుగోలు చేస్తుందని రష్యా రాయబారి వినయ్ కుమార్, అమెరికా 50% టారిఫ్ విధించడంతో వ్యాఖ్య.

Reported by: Tejaswini Nanna | వార్త‌లు | Aug 25, 2025, 3:20 pm IST
Read Time: 3 mins
India-Russia Oil Deal : ఎక్కడ బెస్ట్ డీల్ ఉంటే అక్కడి నుంచే చమురు కొనుగోలు: రష్యా లో భారత రాయభారి వినయ్ కుమార్

India-Russia Oil Deal  | ఎక్కడ బెస్ట్ డీల్ ఉంటే అక్కడి నుంచే చమురు కొనుగోలు చేస్తామని రష్యాలో భారత రాయబారి వినయ్ కుమార్ చెప్పారు. రష్యా నుంచి భారత్ ఆయిల్ కొనుగోలు చేస్తోందనే కారణంతో అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ 50 శాతం టారిఫ్ విధించారు. ఈ టారిఫ్ ఈ నెల 27 నుంచి అమల్లోకి రానుంది. ఈ తరుణంలో వినయ్ కుమార్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. రష్యా అధికారిక మీడియా టాస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని తెలిపారు. ఇండియాలోని 140 కోట్ల జనాభాకు ఆయిల్ విషయంలో ఇబ్బందులు లేకుండా చూడడమే తమ లక్ష్యమని ఆయన అన్నారు. రష్యా నుంచి ఇండియా ఆయిల్ ను కొనుగోలు చేయడంపై అమెరికా విమర్శలు చేస్తోంది. ఈ విషయమై అమెరికాకు ఇండియా కౌంటరిస్తోంది. ఇండియా ప్రయోజనాలను కాపాడడం కోసం కేంద్రం నిర్ణయానికి అనుగుణంగా భారత ఆయిల్ కంపెనీలు బెస్ట్ డీల్ ఇచ్చే దేశాల నుంచి ఆయిల్ ను కొనుగోలు చేస్తాయని ఆయన అన్నారు. ఇండియా వస్తువులపై తొలుత ట్రంప్ 25 శాతం టారిఫ్ విధించారు. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్నారనే నెపంతో మరో 25 శాతం టారిఫ్ పెంచారు. రష్యా నుంచి చైనా, యూరప్ లోని కొన్ని దేశాలు కూడా ఆయిల్ ను కొనుగోలు చేస్తున్నాయి. ఈ విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అమెరికా ఇండియాపై 50 శాతం టారిఫ్ విధించడాన్ని భారత్ అన్యాయమని తెలిపింది. ఉక్రెయిన్ పై రష్యా దాడులకు పరోక్షంగా భారత్ సహకరిస్తోందని ట్రంప్ ఆరోపించారు. రష్యా నుంచి భారత్ ఆయిల్ కొనుగోలు చేయడం వల్ల రష్యాకు అవసరమైన నిధులు సమకూరుతున్నాయనే ట్రంప్ వాదనను అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా సమర్ధించారు. ఆదివారం నాడు ఆయన ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే వాన్స్ తో పాటు ట్రంప్ చేసిన ఈ ఆరోపణలను భారత్ తోసిపుచ్చింది.