పత్తి కొనుగోళ్లలో తేమ పేరిట కోత విధిస్తే సహించం: మంత్రి పొంగులేటి
భారీ వర్షాల కారణంగా తీవ్రంగా నష్టపోయిన పత్తి రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట కార్యాచరణను అమలు చేస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు

హైదరాబాద్, అక్టోబర్ 21(విధాత): భారీ వర్షాల కారణంగా తీవ్రంగా నష్టపోయిన పత్తి రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట కార్యాచరణను అమలు చేస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. తేమ శాతం పేరుతోగానీ, తరుగు పేరిట గానీ రైతులను అనవసరంగా ఇబ్బందులు పెట్టి మద్దతు ధరలో కోత విధిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని ఆయన కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) అధికారులను, మిల్లు యజమానులను హెచ్చరించారు. తిరుమలాయపాలెం మండలం గోల్ తండా గ్రామంలోని శ్రీ భాగ్యలక్ష్మి కాటన్ ఇండస్ట్రీస్లో ఏర్పాటు చేసిన సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర మార్కెటింగ్ శాఖ సంచాలకులు జి. లక్ష్మీ బాయి తో కలిసి మంగళవారం మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రారంభించారు. ప్రస్తుత వానాకాలం సీజన్ 2025లో పాలేరు నియోజకవర్గంలో ప్రారంభమైన మొట్టమొదటి సీసీఐ కేంద్రం ఇదేనని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు.
మద్దతు ధర పెంపుపై పార్లమెంటులో పోరాటం
ప్రస్తుత సీజన్లో అతి భారీ వర్షాల కారణంగా దిగుబడి తగ్గిపోయి రైతులు నష్టపోయారని మంత్రి పొంగులేటి ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం ప్రకటించిన ప్రస్తుత మద్దతు ధర రైతులకు ఏ మాత్రం గిట్టుబాటు కావడం లేదని ఉద్ఘాటించారు. అందుకే, పత్తి ధరను పెంచాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు. ఈ విషయంపై రాబోయే పార్లమెంటు సెషన్లో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీతో సమన్వయం చేసుకుంటూ, పత్తికి మద్దతు ధర పెంపుపై తప్పకుండా చర్చను లేవదీసి, రైతులకు న్యాయం జరిగే వరకు కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
అన్యాయం జరిగితే కఠిన చర్యలే
రైతులు తమ పత్తిని ఎలాంటి ఆందోళన లేకుండా అమ్ముకునేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు చేశామని మంత్రి వివరించారు. ప్రతి సీసీఐ కేంద్రం వద్ద వచ్చే అభ్యంతరాలను, ముఖ్యంగా తేమ శాతం విషయంలో రైతుల ఇబ్బందులను పరిష్కరించేందుకు స్థానిక వ్యవసాయ, రెవెన్యూ, పోలీస్ అధికారులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. రైతులకు అన్యాయం చేయాలని చూసే వారిపై ఈ కమిటీ తక్షణమే కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు.
ప్రతి వ్యవసాయ అధికారి వద్ద తేమ యంత్రాలు ఏర్పాటు చేశామని, రైతుల పొలాల వద్దకే వెళ్లి తేమ శాతాన్ని పరిశీలించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఇంటి వద్దే ఆన్ లైన్లో స్లాట్ బుకింగ్ ఎలా చేసుకోవాలి అనే దానిపై రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. పత్తి రైతులకు నష్టం చేయాలని ఏ అధికారి ప్రయత్నించినా కఠిన చర్యలు తప్పవని మంత్రి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ హరినాథ బాబు, జిల్లా మార్కెటింగ్ అధికారి అలీమ్, ఖమ్మం ఆర్డీవో నర్సింహారావు, ఆత్మ కమిటీ చైర్మన్ శివరామకృష్ణ, డిసిసిబి డైరెక్టర్ బి. రాజశేఖర్, ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.