ఆపరేషన్ కగార్ తక్షణం నిలిపివేయాలి: మంత్రి సీతక్క

విధాత ప్రత్యేక ప్రతినిధి: ఆదివాసీల ప్రయోజనాల దృష్ట్యా ఆపరేషన్ కగార్ ను తక్షణం నిలిపివేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క కోరారు. ఏ ప్రాంతంలోనైనా శాంతియుత వాతావరణం నెలకొల్పడమే ప్రభుత్వాల లక్ష్యం గా ఉండాలని సూచించారు. ప్రస్తుతం తెలంగాణ చత్తీస్గడ్ సరిహద్దుల్లో శాంతియుత వాతావరణం నెలకొనాలనే బలమైన ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఆదివాసి బిడ్డగా వారికి అండగా నిలుస్తానని భరోసా ఇచ్చారు. మావోయిస్టుల శాంతి చర్చల ప్రతిపాదనకు కేంద్రం సానుకూలంగా స్పందించాలని కోరారు.
హైదరాబాద్ లోని ప్రజాభవన్లో మంగళవారం మంత్రి సీతక్కతో భారత్ బచావో సంస్థ ప్రతినిధులు గాదె ఇన్నయ్య, డాక్టర్ ఎమ్ ఎఫ్ గోపీనాథ్, జంజర్ల రమేష్ బాబు తదితరులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మావోయిస్టుల నిర్మూలనే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ ను నిలిపివేసేలా తన వంతు ప్రయత్నం చేయాలని మంత్రి సీతక్కను కలిసిన ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ, చత్తీస్గడ్ సరిహద్దులోని కర్రెగుటల్లో నెలకొన్న ఉద్రిక్త వాతావరణాన్ని నిలువరించేలా చొరవ చూపాలని మంత్రి సీతక్కను కోరారు.
వేల సంఖ్యలో కేంద్ర బలగాలు కర్రెగుట్ట ప్రాంతాల్లో సంచరిస్తున్నటంతో ఆదివాసీలు భయాందోళనకు గురవుతున్నారని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఆపరేషన్ కగారును తక్షణం నిలిపివేయకపోతే పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆపరేషన్ కగారు నిలిపి వేసేందుకు కృషి చేయాలని మంత్రిని భరత్ బచావో ప్రతినిధులు ప్రత్యేకంగా విన్నవించారు. ఈ విషయాలపై మంత్రి సీతక్క సానుకూలంగా స్పందించారు.
ఆపరేషన్ కగార్ ను తక్షణం నిలిపివేయాలి: మంత్రి సీతక్క
ఆదివాసీల ప్రయోజనాల దృష్ట్యా ఆపరేషన్ కగార్ ను తక్షణం నిలిపివేయాలని అంతర్ సీతక్క కోరారు భారత్ బచావో ప్రతినిధులు కలిసిన అనంతరం ఆమె స్పందించారు. మధ్యభారతంలోని ఆదివాసి ప్రాంతాలు రాజ్యాంగం లోని షెడ్యూల్ 5 పరిధిలోకి వస్తాయన్నారు. అక్కడ ఆదివాసీలకు ప్రత్యేక హక్కులుంటాయని గుర్తు చేశారు.
ఆదివాసి ప్రాంతాల్లో ప్రత్యేక పరిపాలన విధానాలు ఉంటాయన్నారు. అందుకే ప్రభుత్వాలు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించి వారి శాంతియుత జీవన విధానానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలన్నారు. బల ప్రయోగంతో కాకుండా, చర్చల ద్వారా సమస్య పరిష్కారం జరిగేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించాలనీ ఆదివాసి బిడ్డగా కోరుకుంటున్నానని స్పష్టం చేశారు.
ఆదివాసీల హక్కులను ఎవరూ కాలరాయవద్దని కోరారు. ఆ జాతి బిడ్డగా ఆది వాసులకు అండగా నిలుస్తాను ఆపరేషన్ కగార్ తో ఆదివాసీలు తీవ్ర భయాందోళనతో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మావోయిస్టుల శాంతి చర్చల ప్రతిపాదనకు కేంద్రం సానుకూలంగా స్పందించాలని కోరారు. రెండు వైపుల ప్రాణ నష్ట నివారణకు శాంతి చర్చలు మార్గం చూపుతాయన్నారు.