IPL:
విధాత: ఇండియన్ ప్రీమియర్ లీగ్ IPL 2025 మెగా వేలం ముగిసిన సంగతి తెలిసిందే. ఈ వేలంలో ఊహించని వారికి ఎక్కువ ధర రాగా డేవిడ్ వార్నర్ వంటి మహమహులు అసలు సోల్డ్లోకి రాకపోవడం చాలామందిని అశ్చర్యానికి గురి చేసింది. అయితే ఈ సారి నలుగురు తెలుగు కుర్రాళ్లను ప్రముఖ ఫ్రాంచైజీలు కొనుగోలు చేయడం శుభపరిణామంగా భావించొచ్చు.
ఈసారి వేలంలో ఆంధ్రప్రదేశ్ నుంచి 12 మంది, తెలంగాణ నుంచి ఏడుగురు క్రికెటర్లు పాల్గొన్నారు. వీరిలో విశాఖపట్నానికి చెందిన అవినాష్ను పంజాబ్ కింగ్స్, కాకినాడకు చెందిన వెంకట సత్యనారాయణ రాజును ముంబై ఇండియన్స్, 2022 అండర్-19 వరల్డ్కప్ నెగ్గిన టీమిండియా వైస్ కెప్టెన్, గుంటూరుకు చెందిన షేక్ రషీద్ను చెన్నై సూపర్ కింగ్స్, టెక్కలికి చెందిన త్రిపురన విజయ్ను ఢిల్లీ జట్లు కనీస ధర రూ.30 లక్షలకు కొనుగోలు చేశాయి.
ఈ నలుగురికి తోడు ఇప్పటికే సిరాజ్, తిలక్ వర్మ, నితీశ్ రెడ్డితో కలిపి ఈ సారి ఐపీఎల్లో ఆడబోతున్న తెలుగు క్రికెటర్ల సంఖ్య ఏడుకి చేరడం విశేషం.