విధాత: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్లను హతమారుస్తామని బెదిరింపు మెయిల్స్ రావడం కలకలం రేపింది. సీఎం, డిప్యూటీ సీఎంలను దారుణంగా హత్య చేస్తామని ఓ దుండగుడు ఈ మెయిల్లో బెదిరింపు సందేశం పంపాడు. కర్ణాటక విధానసౌధ పోలీసులు ఈ విషయాన్ని వెల్లడించారు. రాంపురకు చెందిన ప్రభాకర్ అనే వ్యక్తికి తాను కోటి రూపాయలు అప్పుగా ఇచ్చానని, దానిని ఇంకా తిరిగి చెల్లించనందునా అతడిని కూడా హత్య చేస్తానని మెయిల్లో ఆగంతకుడు పేర్కొన్నాడు.
దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. సింధార్ రాజపుత్ అనే వ్యక్తి పేరిట మెయిల్ వచ్చినట్లు గుర్తించామని, తదుపరి విచారణ కొనసాగుతోందని వెల్లడించారు. త్వరలోనే నిందితుడిని అదుపులోకి తీసుకుంటామని, బెదిరింపు మెయిల్ నేపథ్యంలో సీఎం, డిప్యూటీ సీఎం నివాసాల దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశామని తెలిపారు.