బీఆరెస్ ప్రభుత్వ హయాంలో చేసిన ఫోన్ట్యాపింగ్ అంశంపై దృష్టి మళ్లించేందుకే కేసీఆర్ పొలం బాట పట్టి ప్రభుత్వంపై అర్థరహిత ఆరోపణలు చేస్తున్నార
కేసీఆర్ కు కాంగ్రెస్ను విమర్శించే అర్హత లేదు
మంత్రి శ్రీధర్ బాబు
విధాత ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్: బీఆరెస్ ప్రభుత్వ హయాంలో చేసిన ఫోన్ట్యాపింగ్ అంశంపై దృష్టి మళ్లించేందుకే కేసీఆర్ పొలం బాట పట్టి ప్రభుత్వంపై అర్థరహిత ఆరోపణలు చేస్తున్నారని ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జీ మంత్రి సీతక్క వెల్లడించారు. ఆదివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పెద్దపల్లి పార్లమెంట్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి మంత్రులు సీతక్క, శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలు ప్రేమసాగర్ రావు, వివేక్, వినోద్ పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్అభ్యర్థి వంశీకృష్ణ హాజరయ్యారు. మంత్రి సీతక్కమాట్లాడుతూ.. పొలం బాట పేరుతో రైతులపై కేసీఆర్ ముసలి కన్నీరు కారుస్తున్నారని, ఆయన మాటలు ప్రజలు నమ్మడంలేదని పేర్కొన్నారు. గడ్డం వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్ కార్యకర్తలకు ఆమె పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థులు గెలిస్తేనే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని, రాహుల్ గాంధీ ప్రధానమంత్రిని చేయడానికి ప్రతి ఒక్క కార్యకర్త శక్తివంచన లేకుండా కృషి చేయాలన్నారు.
మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 2 వందల యూనిట్లలోపు జీరో కరెంట్ బిల్ లాంటి పథకాలు అమలు చేస్తున్నామన్నారు. గత బీఆరెస్ ప్రభుత్వం మాదిరిగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు బీఆరెస్ కార్యకర్తలకే ఇచ్చిన మాదిరిగా మేము చేయడం లేదని, ప్రజలందరినీ సంక్షేమ పథకాలలో భాగస్వాములను చేస్తున్నామన్నారు. మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో కుల సంఘాల నాయకులు కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతూ తీర్మాన కాపీలు అందజేశారు.
ఎమ్మెల్యే ప్రేమ సాగర్ రావు మాట్లాడుతూ… బీఆరెస్ నాయకులు రైతుల గురించి మాట్లాడడం సిగ్గుచేటన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ తో మంచిర్యాల పట్టణం మూడు సార్లు ముంపుకు గురైనప్పటికీ బీఆరెస్ నాయకులు పట్టించుకున్న పాపాన పోలేదని, ఒక్క రూపాయి నష్టపరిహారం ఇవ్వలేదని అలాంటి వారు ప్రజల సానుభూతి కొరకు మాట్లాడడం అర్ధరహితమన్నారు.
ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ మాట్లాడుతూ.. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. తమ తాత కాక వెంకటస్వామి సింగరేణి కార్మికుల కోసం అనేక పోరాటాలు చేశాడని తెలిపారు . సింగరేణి సంస్థ బీఐఎఫ్ఆర్ వెళ్తున్న నేపథ్యంలో సింగరేణి సంస్థను కాపాడి వేలాది మంది కార్మికులకు ఉపాధి కల్పించాడన్నారు . తాత వెంకటస్వామి ఆశయాలకు అనుగుణంగా ప్రజల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు .