Asia Cup 2025 | ఆసియాకప్​ మళ్లీ మనదే – ఫైనల్లో పాకిస్తాన్​ను మట్టికరిపించిన భారత్​

భారత్​ 9వ సారి అసియా కప్​ గెల్చుకుంది. మొదటిసారి పాకిస్తాన్​ ప్రత్యర్థిగా ఫైనల్​ మ్యాచ్​ ఆడిన ఇండియా ఈ లోస్కోరింగ్​ థ్రిల్లింగ్​ మ్యాచ్​లో తడబడ్డా నిలబడి గెలిచి కప్​ను ముద్దాడింది.

Asia Cup 2025 | ఆసియాకప్​ మళ్లీ మనదే – ఫైనల్లో పాకిస్తాన్​ను మట్టికరిపించిన భారత్​

కప్పు గెల్చుకుంటాం అని బీరాలు పలికిన పాకిస్తాన్​ ఫైనల్​ మ్యాచ్​లో బొక్కబోర్లాపడింది. భారత బౌలర్ల ధాటికి పాక్​ బ్యాటర్లందరూ పెవిలియన్​కు క్యూ కట్టడంతో 146 పరుగులకే కథ సమాప్తమైంది. అ స్పల్ప లక్ష్యాన్ని ఛేదించడానికి భారత్​ కూడా అష్టకష్టాలు పడింది. ఆఖరి థ్రిల్లర్ ఓవర్​లో 6 బంతులకు 10 పరుగులు కావాల్సిన దశలో  సిక్స్​కొట్టిన తిలక్​ వర్మ, విన్నింగ్​ షాట్​గా ఫోర్​ కొట్టిన రింకూ భారత్​కు  9వ సారి ఆసియాకప్​ను సగర్వంగా సమర్పించారు.

ఆసియా కప్​ భారత్​కు ఎలా దక్కిందంటే…

టాస్​ గెల్చిన భారత్​ మరో ఆలోచన లేకుండా పాక్​కు బ్యాటింగ్​ అప్పగించింది. అయితే వారి ఆశలను అడియాసలు చేస్తూ ఓపెనర్లు పర్హాన్​(57), ఫఖర్​ జమాన్​(46)లు ధాటిగా ఆడటం ప్రారంభించారు. తొలి వికెట్​కు మంచి(84 పరుగులు) ఆరంభాన్నిచ్చిన వీరిద్దరిని వరుణ్​ చక్రవర్తి పెవిలియన్​కు పంపాడు. అంతే… అక్కడినుండీ ఇక పాక్​ కోలుకోలేకపోయింది. బౌలర్ల దెబ్బ మీద దెబ్బకు ఒకరి వెనుక మరొకరు వస్తూ పోతూ ఉన్నారు. రెండో వికెట్​గా సయీమ్​ అయూబ్​ జట్టు పరుగులు 113 వద్ద ఉన్నప్పుడు ఔటయ్యాడు. మిగిలిన 8 వికెట్లు 33 పరుగుల వ్యవధిలో కూలిపోయి, పాక్​ జట్టు 146 పరుగులకు ఆలౌట్​ అయింది. భారత బౌలర్లలో కుల్​దీప్​ 4 వికెట్లు తీసుకుని పాక్​ వెన్ను విరవగా, బుమ్రా, వరుణ్​, అక్షర్​ తలా రెండు వికెట్లు తీసి పాక్​ పతనాన్ని శాసించారు.

Asia Cup 2025: Kuldeep Yadav, Tilak Varma & Shivam Dube stood as heroes of the final match between India & Pakistan

చిన్న లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలో దిగిన భారత్​కు ఆదిలోనే భారీ దెబ్బ తగిలింది. ఈ టోర్నమెంటంతా అర్థశతకాలతో మెరుపులు మెరిపించిన అభిషేక్​ శర్మ స్వల్పస్కోరు(5)కే వెనుదిరిగాడు. కెప్టెన్​ సూర్య తన పేలవ ఫామ్​ను కొనసాగిస్తూ ఒక్క పరుగుకే వెనుదిరగగా, కాసేపటికే శుభమన్​ గిల్​(12) అష్రఫ్​ బౌలింగ్​లో రౌఫ్​కు క్యాచ్​ ఇచ్చి భారత శిబిరంలో ఆందోళనకు తెర లేపాడు. 20 పరుగులకే ఇండియా మూడు కీలక వికెట్లు కోల్పోయి పీకలలోతు కష్టాల్లో కూరుకుపోయింది.  తర్వాత వచ్చిన సంజూతో తిలక్​ వర్మ ఇన్నింగ్స్​ను గాడిలో పెట్టాడు. 77 పరుగుల వద్ద సంజూ(24) అవుట్ కాగా, శివమ్​ దూబే రంగంలోకి దిగాడు. ఈ ఇద్దరూ కలిసి భారత్​ను గెలుపు బాట పట్టించారు. ఆట చివర్లో దూబే 33 పరుగులు(22 బంతులు, 2 సిక్స్​లు, 2 ఫోర్లు) పెవిలియన్​ చేరగా, రింకూతో కలిసి తిలక్ 69 నాటౌట్​​(53 బంతులు, 4 సిక్స్​లు, 3 ఫోర్లు) భారత్​కు చిరస్మరణీయమైన విజయాన్ని అందించాడు.  147 పరుగుల లక్ష్యానికి గానూ, భారత్​ 19.4 ఓవర్లకు 5 వికెట్ల నష్టానికి 150 పరుగులు సాధించింది. నిజానికి ఈ మ్యాచ్​లో తిలక్​వర్మ పోరాటం అనన్యసామాన్యం. ఓ వైపు వికెట్లు పడుతున్నా, పట్టుదల చెదరకుండా నాలుగు కీలక భాగస్వామ్యాలు నెలకొల్పి భారత్​ను విజయతీరాలకు చేర్చాడు. తన ఏకాగ్రత ఏమాత్రం చెదిరినా కప్​ పాకిస్తాన్​ ఖాతాలోకి వెళ్లిపోయేది.

టోర్నమెంట్​ మొత్తంలో ఇదే మ్యాచ్​లో దిగిన రింకూసింగ్​ ఒకే బాల్​ ఆడి విన్నింగ్​ షాట్​గా ఫోర్​ సాధించి, అరుదైన జీవితకాలపు మధుర స్మృతిని అందుకున్నాడు.