IPL 2024 | నేటి ఎలిమనేటర్ ఏకపక్షమే.. అలా జరగకపోతే ఆశ్చర్యమే : సునీల్ గవాస్కర్‌

IPL 2024 | ఐపీఎల్ 17వ సీజన్‌లో భాగంగా ఇవాళ రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు (RCB), రాజస్థాన్‌ రాయల్స్ (RR) మధ్య జరిగే మ్యాచ్‌ ఏకపక్షమేనని భారత క్రికెట్‌ దిగ్గజం సునీల్ గవాస్కర్‌ (Sunil Gavaskar) అన్నారు. ఈ ఐపీఎల్‌ లీగ్‌ స్టేజ్‌ ఆరంభంలో పేలవ ప్రదర్శన కనబర్చిన బెంగళూరు సెకండ్‌ హాఫ్‌లో వరుస విజయాలతో ప్లేఆఫ్స్‌లోకి దూసుకెళ్లింది. మరోవైపు ఆరంభమంతా విజయాలతో దూసుకుపోయిన రాజస్థాన్‌ చివరికి వచ్చేసరికి ఓటములతో డీలాపడింది.

  • Publish Date - May 22, 2024 / 04:57 PM IST

IPL 2024 : ఐపీఎల్ 17వ సీజన్‌లో భాగంగా ఇవాళ రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు (RCB), రాజస్థాన్‌ రాయల్స్ (RR) మధ్య జరిగే మ్యాచ్‌ ఏకపక్షమేనని భారత క్రికెట్‌ దిగ్గజం సునీల్ గవాస్కర్‌ (Sunil Gavaskar) అన్నారు. ఈ ఐపీఎల్‌ లీగ్‌ స్టేజ్‌ ఆరంభంలో పేలవ ప్రదర్శన కనబర్చిన బెంగళూరు సెకండ్‌ హాఫ్‌లో వరుస విజయాలతో ప్లేఆఫ్స్‌లోకి దూసుకెళ్లింది. మరోవైపు ఆరంభమంతా విజయాలతో దూసుకుపోయిన రాజస్థాన్‌ చివరికి వచ్చేసరికి ఓటములతో డీలాపడింది.

ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య ఇవాళ అహ్మదాబాద్ వేదికగా ఎలిమినేటర్‌ మ్యాచ్‌ జరగనుంది. ఇందులో గెలిచిన జట్టు రెండో క్వాలిఫయర్‌లో హైదరాబాద్‌తో తలపడాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్‌ ఫలితంపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆసక్తికర విశ్లేషణ చేశాడు. ఫలితం ఏకపక్షమేనని వ్యాఖ్యానించారు. ఆర్సీబీకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని, ఏదైనా మ్యాజిక్‌ చేస్తే తప్ప ఆర్‌ఆర్‌కు గెలిచే అవకాశాలు లేవని అభిప్రాయపడ్డారు.

‘ఈ సీజన్‌లో ఆర్సీబీ అద్భుతం చేసిందనే చెప్పాలి. మొదట్లో ఆ జట్టును చూసిన వారెవరూ ఇలా ఆడతారని ఊహించలేదు. అందుకే ఆ జట్టుకు ఫ్యాన్స్‌ నుంచి క్రేజ్‌ మామూలుగా దక్కలేదు. ఫాఫ్‌ డుప్లెసిస్, విరాట్ కోహ్లీ సహా ఇతర సీనియర్లు బాధ్యతతో ఆడుతూనే కుర్రాళ్లను ముందుండి నడిపిస్తున్నారు. ఓపెనింగ్‌ జోడీ అదరగొడుతూ ప్రత్యర్థిపై ఒత్తిడి తెస్తోంది. రాజస్థాన్‌ పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. గత ఐదింట నాలుగు మ్యాచులలో ఓడింది. ఒక మ్యాచ్‌ రద్దయ్యింది. వారికి సరైన సాధన లేదనిపిస్తోంది. కోల్‌కతా తొలి క్వాలిఫయర్‌లో చేసిన మ్యాజిక్‌నే ఆర్‌ఆర్‌ చేస్తే విజయం సాధించే అవకాశం ఉంటుంది. లేదంటే మరోసారి ఏకపక్ష మ్యాచ్‌ను చూస్తామనిపిస్తోంది. దూకుడు మీదున్న ఆర్సీబీనే ఆధిపత్యం చూపే అవకాశం ఉంది. ఒకవేళ అలా జరగలేదంటే మాత్రం ఆశ్చర్యమే’ అని గవాస్కర్ వ్యాఖ్యానించారు.

రాజస్థాన్ – బెంగళూరు జట్లు గతంలో రెండుసార్లు ప్లేఆఫ్స్‌లో తలపడ్డాయి. 2015లో ఆర్సీబీ విజయం సాధించగా 2022 సీజన్‌లో ఆర్‌ఆర్‌ గెలిచింది. ముచ్చటగా మూడోసారి తలపడుతుండటంతో ఎవరిని విజయం వరిస్తుందో చూడాలి. ఐపీఎల్ చరిత్రలో ఈ రెండు జట్లు 31 మ్యాచ్‌లలో తలపడగా.. బెంగళూరు 15, రాజస్థాన్‌ 13 మ్యాచ్‌లలో విజయం సాధించాయి. ప్రస్తుత సీజన్‌ లీగ్‌ స్టేజ్‌లో ఆర్సీబీపై ఆర్‌ఆర్‌ గెలిచింది. ఇవాళ ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకొనేందుకు బెంగళూరు ఉవ్విళ్లూరుతున్నది.

Latest News