Site icon vidhaatha

మక్తల్‌లో మూడు ముక్కలాట


విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: మక్తల్ నియోజకవర్గంలో త్రిముఖ పోరు రాజకీయ రక్తి కట్టిస్తోంది. హ్యాట్రిక్ గెలుపు కోసం బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి… మొదటిసారి టికెట్ దక్కించుకున్న నారాయణ పేట డీసీసీ అధ్యక్షులు, కాంగ్రెస్ అభ్యర్థి వాకిటి శ్రీహరి విజయం కోసం విశ్వప్రయత్నం.. బీజేపీ నుంచి ఎన్నికల బరిలో ఉన్న జలంధర్ రెడ్డి తనబలం నిరూపించుకునేందుకు మక్తల్ ఓటర్ల ముందు నిలబడ్డారు. ఈనియోజకవర్గంలో ముగ్గురి మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు వ్యూహాత్మకంగా ప్రచారం చేస్తూ, జనాన్ని ఆకట్టుకునే పనిలో పడ్డారు. గెలుపు గ్యారంటీ అంటూ ముగ్గురు అభ్యర్థులు ధీమాలో ఉన్నారు.


ముచ్చటగా మూడోసారి కోసం రామ్మోహన్ రెడ్డి


రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రామ్మోహన్ రెడ్డి ముచ్చటగా మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలనే ఉదేశంలో ఉన్నారు. దివంగత చిట్టెం నర్సిరెడ్డి వారసునిగా రాజకీయంలో ప్రవేశించిన రామ్మోహన్ రెడ్డి 2014లో మొదటి సారిగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి విజయం పొందారు. అనంతరం నియోజకవర్గ అభివృద్ధి కోసం తెరాసలో చేరారు.


కాంగ్రెస్ నుంచి గెలిచి తెరాసలో చేరడంపై పలు విమర్శలు ఎదుర్కొన్నారు. ఇవన్నీ పట్టించుకోకుండా అభివృద్ధిపైనే దృష్టి పెట్టారు. ఈయన హయాంలో మక్తల్ లో పెద్ద చెరువు అభివృద్ధి చేసి మంచి పేరు పొందారు. మండలకేంద్రాల్లో రహదారుల అభివృద్ధిలో సక్సెస్ అయ్యారు. ఇవన్నీ ఆయనకు కలిసి రావడంతో 2018 ఎన్నికల్లో తెరాస నుంచి పోటీ చేసి గెలుపొంది రెండోసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు. ప్రస్తుత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి బరిలో ఉన్నారు.


రామ్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి ఒకవైపు.. మరోవైపు ఆయన వ్యవహార శైలి విమర్శలపాలైంది. సమస్యలు చెప్పుకునేందుకు వెళ్లిన ప్రజలకు అందుబాటులో ఉండరనే అభిప్రాయం ఉంది. కోపం కూడా రామ్మోహన్ రెడ్డికి ఈ నియోజకవర్గంలో కొంత మైనస్ గా మారింది. ప్రస్తుతం అభివృద్ధి మాట అంటుంచితే తన కోపమే ఆయనకు శత్రువు గా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మూడోసారి విజయం సాధించిన హ్యాట్రిక్ పొందాలనే కూతుహలంతో ఉన్నారు.


ముదిరాజ్ లను నమ్ముకున్నవాకిటి శ్రీహరి


నారాయణ పేట జిల్లా డీసీసీ అధ్యక్షులుగా ఉన్న వాకిటి శ్రీహరి మక్తల్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో ఉన్నారు. గతం నుంచి కాంగ్రెస్ పార్టీ కి సేవలు అందించిన శ్రీహరికి పార్టీ టికెట్ ఇచ్చి న్యాయం చేసిందని ఆపార్టీ శ్రేణులు అంటున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి రామ్మోహన్ రెడ్డికి ఉన్న మైనస్ లను శ్రీహరి తనకు అనుకూలంగా మార్చుకునే పనిలో పడ్డారు.


శ్రీహరికి ముదిరాజ్ వర్గం, కాంగ్రెస్ శ్రేణులు మద్దతుగా నిలబడడంతో విజయం వరిస్తుందనే ధీమాలో ఉన్నారు. ఇప్పటికే నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. మొదటిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా పావులు కదుపుతున్నారు. ఈఎన్నికల్లో ప్రజాదరణ పొంది అసెంబ్లీలో అడుగు పెట్టాలనే ఉదేశంలో శ్రీహరి ఉన్నారు.


రెండోసారి పోటీలో జలంధర్ రెడ్డి


బీజేపీ అభ్యర్థిగా జలంధర్ రెడ్డి రెండోసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉన్నారు. 2018 ఎన్నికల్లో ఇదే పార్టీ నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. ఇంతకాలం పార్టీని నమ్ముకుని, పార్టీ సిద్ధాంతం కోసం పనిచేస్తున్నారనే భావనలో అధిష్టానం గుర్తించి బరిలో నిలిపింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పోటీ తీవ్రంగా ఉన్నా, బీజేపీ క్యాడర్ మాత్రం పార్టీ కోసం పనిచేస్తుండడం జలంధర్ రెడ్డికి కలిసివస్తుందని చెబుతున్నారు. జలంధర్ రెడ్డి మాత్రం విజయం సాధిస్తాననే ధోరణిలో ఉన్నారు.

Exit mobile version