గద్వాల నియోజకవర్గ బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ లో చేరుతున్న విషయం బయటకు రావడం తో మరో కాంగ్రెస్ నాయకురాలు సరిత వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
– కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధం అవుతున్న కృష్ణ మోహన్ రెడ్డి
– ఎమ్మెల్యే ను చేర్చుకోవద్దని సరిత వర్గం అధిష్టానానికి ఫిర్యాదు
– ఎమ్మెల్యే కు వ్యతిరేకంగా గద్వాల లో ధర్నా లు, రాస్తారోకో లు
– కృష్ణ మోహన్ రెడ్డి చేరిక పై సరిత వర్గం అగ్రహావేశాలు
– గాంధీ భవన్ కు చేరిన గద్వాల పంచాయితీ
– ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరితే సరిత రాజకీయ భవిష్యత్ కు ప్రమాదం
విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి :గద్వాల నియోజకవర్గ బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ లో చేరుతున్న విషయం బయటకు రావడం తో మరో కాంగ్రెస్ నాయకురాలు సరిత వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ప్రస్తుతం ఈ విషయం పై గద్వాల లో రాజకీయ రగడ మొదలైంది. ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరితే ఆత్మహత్య చేసుకుంటామని సరిత వర్గం కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు. రాజకీయం లో కృష్ణ మోహన్ రెడ్డి, సరిత మధ్య పచ్చ గడ్డి వేసినా భగ్గుమనే పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీ కి పెద్ద దిక్కుగా ఉండి నడిపించిన సరిత నియోజకవర్గం పై పట్టు సాధించింది. కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చిన తరువాత గద్వాల నియోజకవర్గం లో ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడంతో ఎమ్మెల్యే కు ప్రాధాన్యత లేకుండా పోతోంది. ఇది దృష్టిలో పెట్టుకున్న ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి బీ ఆర్ ఎస్ లో ఉంటే పరువు తో పాటు రాజకీయ భవిష్యత్ ఉండదని గ్రహించి అధికార కాంగ్రెస్ పార్టీ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటి కే జిల్లా కు చెందిన మంత్రి తో తన అభిప్రాయం చెప్పినట్లు తెలుస్తోంది. మంత్రి ద్వారా సీఎం రేవంత్ రెడ్డి ని కలిసి పార్టీ మారే విషయం ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఇదే జరిగితే ఇంత కాలం పార్టీ ని నమ్ముకున్న తన కు రాజకీయంగా భవిష్యత్ ఉండదని భావించిన ఆమె బీఆరెస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.గద్వాల లో కాంగ్రెస్ పార్టీ ని ముందుండి నడిపించిన సరిత కు మద్దతుగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కదం తొక్కుతున్నారు. ఎట్టి పరిస్థితి లో ఎమ్మెల్యేను కాంగ్రెస్ పార్టీ లో చేర్చుకుంటే సహించేది లేదని మండిపడుతున్నారు. ఇప్పటికే గద్వాల లో నిరసన కార్యక్రమాలు చేపట్టి ఆత్మహత్య లకు సైతం వెనుకాడబోమని కాంగ్రెస్ అధిష్టానం నేతలను హెచ్చరిస్తున్నారు. ఎమ్మెల్యే ను కాంగ్రెస్ లో చేర్చుకుంటే ఆత్మహత్య చేసుకుంటానని సరిత మద్దతుదారుడు సెల్ టవర్ ఎక్కి దూకుతానని హెచ్చరించారు. ఎమ్మెల్యేను కాంగ్రెస్ పార్టీ లో చేర్చుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని, గద్వాల నియోజకవర్గం అట్టడుగుతుందని కాంగ్రెస్ శ్రేణులు అంటున్నారు.ఎమ్మెల్యే మాత్రం ఇవేమి పట్టించుకోకుండా తన ప్రయత్నం తాను చేస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం కూడా ఆయనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇది తెలుసుకున్న గద్వాల నియోజకవర్గం కాంగ్రెస్ శ్రేణులు తమ నిరసన ను గాంధీ భవన్ వద్ద చేపట్టెందుకు సిద్ధంగా ఉన్నారు.కాంగ్రెస్ పెద్దల వద్దే పంచాయితీ తేల్చుకుంటామని సరిత వర్గం నేతలు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం గద్వాల నియోజకవర్గం లో ఎమ్మెల్యే చేరిక విషయం హాట్ టాపిక్ గా మారింది. ఎమ్మెల్యే పార్టీ మారే ప్రస్తావన పై గద్వాల లో పొలిటికల్ వార్ మొదలైంది.
మొదట్లో మిత్రులు -ఇప్పుడు బద్ద శత్రువులు
ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, సరిత తిరుపతయ్య బీ ఆర్ ఎస్ పార్టీ లో ఉండి మంచి రాజకీయ మిత్రులు గా ఉన్నారు. వీరిద్దరూ రాజకీయంగా బలం పెంచుకుంటూ గద్వాల రాజకీయం లో చక్రం తిప్పిన డీకే అరుణ కు వ్యతిరేకం గా పనిచేశారు. 2018 ఎన్నికల్లో కృష్ణ మోహన్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో బీ ఆర్ ఎస్ నుంచి పోటీలో ఉన్నారు. ఆయనకు పోటీగా కాంగ్రెస్ అభ్యర్థి గా డీకే అరుణ ఉన్నారు. ఈ సమయం లో సరిత వర్గం కృష్ణ మోహన్ రెడ్డి కి మద్దతుగా నిలిచి అరుణ ను ఓడించారు. అనంతరం జరిగిన జడ్పీటీసీ ఎన్నికల్లో బీ ఆర్ ఎస్ ఘన విజయం సాధించింది.మానోపాడు మండలం నుంచి సరిత జడ్పీటీసీ గా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి సహకారం తో ఆమె గద్వాల జడ్పీ చైర్ పర్సన్ గా ఎన్నికయ్యారు. కొద్దిరోజుల తరువాత గద్వాల లో రాజకీయ పరిణామల్లో మార్పులు జరిగాయి. డీకే అరుణ కాంగ్రెస్ పార్టీ ని వీడి బీజేపీ లో చేరడంతో ఒక్క సారిగా ఇక్కడి రాజకీయ ముఖచిత్రం మారిపోయింది. డీకే అరుణ బీజేపీ లోకి వెళ్లడం తో గద్వాల లో కాంగ్రెస్ లో బలమైన నేత లేకపోవడం తో ఆ పార్టీ కి దిక్కులేకుండా పోయింది. కొద్దిరోజుల తరువాత ఎమ్మెల్యేకు సరిత మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. ఓకే పార్టీ లో ఉన్నా ఇద్దరి మధ్య రాజకీయ వైరం ప్రారంభమైంది. మిత్రులుగా ఉన్న వీరద్దరూ బద్ద శత్రువులు గా మారారు. ఈ సమయం లో సరిత కాంగ్రెస్ వైపు దృష్టి సారించింది. కాంగ్రెస్ లో ఉంటే రాజకీయంగా ఎదగవచ్చని ఊహించింది.ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ గా ఉన్న సరిత మధ్య మాటలు కరువై ఘాటైన విమర్శలు చేసుకుంటూ వచ్చారు. ఎమ్మెల్యే వైఖరి నచ్చని సరిత 2023 లో బీ ఆర్ ఎస్ ని వీడి కాంగ్రెస్ పార్టీ లో చేరారు.అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ కి పెద్ద దిక్కుగా మారరు. 2023 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గద్వాల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గా బరిలో నిలిచారు. బీ ఆర్ ఎస్ అభ్యర్థి గా కృష్ణ మోహన్ రెడ్డి పోటీ పడ్డారు.మిత్రులు గా ఉన్న వీరిద్దరూ ప్రత్యర్థులు గా పోటీలో నిలిచారు.ఈ ఎన్నికల్లో కృష్ణ మోహన్ రెడ్డి విజయం సాధించారు. ఆయనకు 94097 ఓట్లు రాగా సరిత కు 87061 ఓట్లు వచ్చాయి. 7036 ఓట్ల అధిక్యం లో కృష్ణ మోహన్ రెడ్డి గెలుపొందారు. స్వల్ప మెజారిటీ తో ఓటమి చెందిన సరిత కృంగి పోకుండా నియోజకవర్గం లో కాంగ్రెస్ కార్యకర్తలకు అండగా ఉండి అభివృద్ధి పనులకు శ్రీకారం చూడుతున్నారు. ఈ సమయం లో కృష్ణ మోహన్ రెడ్డి కాంగ్రెస్ లో వస్తున్నారనే విషయం తెలియడం తో సరిత తో పాటు ఆమె వర్గం నేతలు భగ్గుమంటున్నారు.