ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఓటమి చెందడంపై కాంగ్రెస్ నేతల్లో అంతర్మథనం మొదలైంది
పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమితో అంతర్మథనం
ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ అధిష్ఠానం గుర్రు..
రాహుల్ గాంధీ వరకు వెళ్లిన ఫిర్యాదులు
ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నా ఓడిన కాంగ్రెస్
వంశీచంద్ రెడ్డిని నట్టేట ముంచారని ఆరోపణలు
దందాలపైనే ఎమ్మెల్యే లు దృష్టి పెట్టారంటున్న శ్రేణులు
నాలుగు సెగ్మెంట్లలో బీజేపీ అధిక్యం
సీఎం రేవంత్ రెడ్డి కలిసేందుకు ఎమ్మెల్యే భయం
విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి : ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఓటమి చెందడంపై కాంగ్రెస్ నేతల్లో అంతర్మథనం మొదలైంది. ఎమ్మెల్యేల ఓవర్ కాన్ఫిడెన్స్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొంపముంచిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఎమ్మెల్యేల వ్యవహార శైలిపై చర్చ జరుగుతోంది. ఈ పార్లమెంట్ పరిధిలోని ఏడుగురు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డికి మొహం చూపెట్టడానికి జంకుతున్నారు. ఫలితాలు వెలువడిన దగ్గరనుంచి నేటి వరకు ఏ ఒక్క ఎమ్మెల్యే సీఎంను కలవడానికి ధైర్యం చేయలేక పోతున్నారు.
కావాలనే ఓడించారని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి పార్టీ అధిష్ఠానం వద్ద ఆరోపణలు చేసినట్లు తెలిసింది. రాష్ట్ర అధిష్ఠానం ఈ ఎమ్మెల్యేలపై ఆగ్రహంతో ఉంది. ఇదే విషయం ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీకి రాష్ట్ర నేతలు తీసుకెళ్లారు. ఆయన కూడా ఏడుగురు ఎమ్మెల్యే పై గుర్రుగా ఉన్నట్లు రాష్ట్ర నాయకులు పేర్కొంటున్నారు. ఈ నియోజకవర్గంలో బలం లేని బీజేపీ విజయం సాధించడంపై రాహుల్ గాంధీ ఇటీవల ఆరా తీసినట్లు సమాచారం. ఇక్కడి ఎమ్మెల్యేలు వారి వారి నియోజకవర్గాల్లో సక్రమంగా ప్రచారం చేయలేదనే విషయం రాహుల్ గాంధీ వరకు వెళ్లడంతో ఆయన రాష్ట్ర పార్టీ పెద్దలను తీవ్రంగా మందలించినట్లు తెలిసింది.
కేంద్ర, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ న్యాయకత్వం చూపంతా ఈ ఏడుగురు ఎమ్మెల్యే పైనే ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి కూడా ఎమ్మెల్యేల తీరుపై రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ప్రచారం పూర్తి గా నిర్లక్ష్యం చేసినందుకే బీజేపీ గెలుపునకు దారితీసిందనే విషయాన్ని రాహుల్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఇక్కడి ఎమ్మెల్యేల వల్లే కాంగ్రెస్ ఓటమి చెందిందనే ఉద్దేశంలో అటు ఏఐసీసీ, ఇటు టీపీసీసీ నేతలు ఉన్నారని సమాచారం.
మూడు ప్లస్… నాలుగు మైనస్
మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. మహబూబ్ నగర్, దేవరకద్ర, మక్తల్, నారాయణ పేట, కొడంగల్, షాద్ నగర్, జడ్చర్ల నియోజకవర్గాలు ఉన్నా ఇందులో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి విజయం సులువుగా ఉంటుందనే అభిప్రాయం అందరిలో ఉంది. ఈ నియోజకవర్గంలో బీజేపీకి పట్టు లేదని, బీఆర్ఎస్ పని అయిపోందని, ఇక కాంగ్రెస్ గెలుపు తథ్యం అనే ధీమాలో ఎమ్మెల్యేలు ఉండడమే వారి పాలిట శాపంగా మారింది.
ఎన్నికల ముందుగానే కాంగ్రెస్ పార్టీ పై వ్యతిరేకత ఉందనే అభిప్రాయంతో పార్టీ అధిష్ఠానం ఉండడంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఎనిమిది పర్యాయాలు ఈ నియోజకవర్గంలో ప్రచారం చేశారు. ఈ నియోజకవర్గం పరిధిలో తాను గెలిచిన కొడంగల్ సెగ్మెంట్ కూడా ఉండడంతో ఆయన మరింత శ్రద్ధ చూపారు. ఇక్కడి ఏడుగురు ఎమ్మెల్యే లకు దిశానిర్దేశం చేసుకుంటూ వచ్చారు. కానీ ఎమ్మెల్యే లు సీఎం మాట పెడచెవిన పెట్టారు. ఈ విషయం కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి గుర్తించి సీఎం కు విషయం చేరావేశారు. కొంత మంది ఎమ్మెల్యే లను సీఎం మందలించి నట్లు తెలిసింది.
ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధిస్తే ముదిరాజ్ లకు మంత్రి వర్గంలో చోటు కల్పిస్తానని సీఎం రేవంత్ రెడ్డి ప్రచారంలో హామీ ఇచ్చారు. సీఎం హామీ మేరకు మక్తల్ ఎమ్మెల్యే శ్రీ హరికి మంత్రి పదవి వస్తుందనే నమ్మకంతో కాంగ్రెస్ శ్రేణులు ఉన్నాయి. కానీ ఇక్కడ బీజేపీకి తొమ్మిది వేల పైనే మెజారిటీ వచ్చింది. ఎమ్మెల్యే శ్రీహరి తన పార్టీ అభ్యర్థి కి ప్రచారం చేయలేదనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. నారాయణ పేట నియోజకవర్గం లో బీజేపీకి 19 వేల పైనే మెజారిటీ వచ్చింది. ఇక్కడ కూడా ఎమ్మెల్యే పర్ణిక కాంగ్రెస్ అభ్యర్థి కి ప్రచారం చేయలేదనే ఆరోపణలు ఉన్నాయి. పర్ణికకు బీజేపీ అభ్యర్థి డీకే అరుణ స్వయానా మేనత్త కావడంతో కాంగ్రెస్ అభ్యర్థి వంశీ చంద్ రెడ్డికి ప్రచారం చేయలేదనే విషయం రాహుల్ గాంధీ దృష్టికి వెళ్ళిందని సమాచారం.
ఈ నియోజకవర్గంలో బీజేపీకి భారీ మెజారిటీ రావడంతో పర్ణిక పై సీఎం రేవంత్ రెడ్డి గుర్రుగా ఉన్నట్లు సమాచారం. అలాగే దేవరకద్ర నియోజకవర్గంలో కూడా బీజేపీకి స్వల్ప మెజారిటీ వచ్చింది. ఇక్కడి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి మహబూబ్ నగర్ డీసీసీ అధ్యక్షులుగా కూడా ఉన్నారు. ఈ నియోజకవర్గంలో 18 వందల మెజారిటీతో బీజేపీ నిలబడింది. మహబూబ్ నగర్ నియోజకవర్గంలో కూడా బీజేపీ అధిక్యం కనబర్చింది. పట్టణ ప్రాంతం లో మైనారిటి ఓట్లు కాంగ్రెస్ వైపు మొగ్గుచూపడం తో వేయి లోపే మెజారిటీ బీజేపీ కి వచ్చింది. గ్రామీణ ప్రాంతంలో మాత్రం బీజేపీ కి భారీ మెజారిటీ వచ్చింది. 9 వేల మెజారిటీ తో బీజేపీ ఆధిక్యం కనబరచింది.కానీ జడ్చర్ల, షాద్ నగర్, కొడంగల్ లో కాంగ్రెస్ అధిక్యం వచ్చింది. రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గం లో కాంగ్రెస్ కు 50 వేల మెజారిటీ వస్తుందని అందరూ ఆశించారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా కొడంగల్ లో 50 వేల మెజారిటీ రావాలని ప్రచారం లో ఓటర్ల ను కోరారు.
కానీ ఫలితాల తరువాత చూస్తే 21 వేల మెజారిటీ కాంగ్రెస్కు రావడంతో అంతా కంగుతిన్నారు. ఎమ్మెల్యేలు ఎవ్వరూ పెద్దగా శ్రద్ధ చూపకపోవడం తోనే కాంగ్రెస్ పార్టీ ఓటమి గురైందనే భావన లో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని, అందుకే రేవంత్ను కలిసేందుకు వారంతా వెనుకంజ వేస్తున్నరని చర్చించుకుంటున్నారు. ఎమ్మెల్యేలగా గెలిచిన అనంతరం ఇసుక, కాంట్రాక్టు దందా పైనే దృష్టి పెట్టారనే ఆరోపణలు వస్తున్నాయి. దందాలపై పెట్టిన దృష్టి కాంగ్రెస్ అభ్యర్థిపై పెట్టి ఉంటే గెలుపు సులువుగా ఉండేదని, ఈ విషయం రాహుల్ వరకు ఫిర్యాదులు వెళ్లినట్లు తెలిసింది. ఈ ఏడుగురు ఎమ్మెల్యే ల్లో ఇద్దరు ముగ్గురి పట్ల సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.