తెలంగాణ నీటి పారుదల శాఖ సలహాదారు పదవి నుంచి ఆదిత్యానాథ్ దాస్ను తొలగించాలని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదిత్యానాథ్ దాస్ నియామకం తెలంగాణ ప్రయోజనాలకు గొడ్డలిపెట్టు అని విమర్శించారు.
విధాత, హైదరాబాద్ : తెలంగాణ నీటి పారుదల శాఖ సలహాదారు పదవి నుంచి ఆదిత్యానాథ్ దాస్ను తొలగించాలని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదిత్యానాథ్ దాస్ నియామకం తెలంగాణ ప్రయోజనాలకు గొడ్డలిపెట్టు అని విమర్శించారు. నాడు జలయజ్ఞం ప్రాజెక్టుల నుంచి నిన్న పాలమూరు రంగారెడ్డిపై కేసులు వేసి పనులు ఆపిన వ్యవహారంలో ఆదిత్యాదాస్ది కీలకపాత్ర అని, ఏపీ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా, ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన వ్యక్తికి తెలంగాణ నీటి పారుదల శాఖ సలహాదారు పదవి ఎందుకు కట్టబెట్టారో ప్రభుత్వం ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రాజెక్టుల వ్యతిరేకిగా ముద్రపడ్డ వ్యక్తిని ఏ ప్రయోజనాల కోసం ఈ పదవిలో కూర్చోబెట్టారు? అని నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు.
వ్యక్తిగతంగా ఒక ప్రభుత్వ అధికారిగా ఆయన పట్ల మాకు ఎలాంటి వ్యతిరేకత లేదని, కానీ ఆంధ్రకు కృష్ణా ప్రాజెక్టుల నుండి నీటిని తరలించడంలో ఆయనది కీలకపాత్ర అని గుర్తు చేశారు.తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి గత పదేళ్లుగా ఏపీ తరపున కొట్లాడిన వ్యక్తి తెలంగాణకు న్యాయం చేస్తాడని ఎలా నమ్మాలని నిలదీశారు. కేఆర్ఎంబీలో తెలంగాణ వాదనను తొక్కిపెట్టి ప్రాజెక్టుల మీద హక్కులు కోల్పోయేలా చేసిన వ్యక్తి ఆదిత్యనాథ్ దాస్ అని, పోతిరెడ్డిపాడు, దుమ్ముగూడెం, రాయలసీమ ఎత్తిపోతల పథకాలతో తెలంగాణ నీటిని తరలించడంలోనూ ఆయనదే కీలకపాత్ర అని నిరంజన్రెడ్డి ఆరోపించారు. అటువంటి వ్యక్తిని తెలంగాణ నీటి పారుదల సహాలదారుగా నియమించడం వెనక కాంగ్రెస్ ఆలోచన ఏంటటని.?.. అలాంటి వ్యక్తి తెలంగాణ ప్రయోజనాల కోసం కృషిచేస్తాడా? అని నిరంజన్రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ ప్రాజెక్టులు, జల వనరుల మీద అపారమైన అనుభవం, అవగాహన ఉన్న ఎందరో జల నిపుణులు ఉన్నారని, వారిని పక్కనపెట్టి తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తిని ఎంచుకోవడం వెనక కారణాలేంటని, కాంగ్రెస్ పాలనలో పాలమూరు మరోసారి ఎడారి అయ్యేలా ఉందని నిరంజన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు ఆదేశిస్తున్నాడు.. శిష్యుడు రేవంత్ పాటిస్తున్నాడని, ప్రమాణ స్వీకారానికి ముందే తెలంగాణపై చంద్రబాబు పెత్తనం మొదలైందనడానికి ఆదిత్యనాథ్ దాస్ నియామకమే నిదర్శనం అని నిరంజన్ రెడ్డి విమర్శించారు.