అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ను జూలై నెలాఖరులోగా పూర్తిగా ప్లాస్టిక్ రహిత జోన్గా మార్చేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు
కార్యాచరణ ప్రణాళికకు సీఎస్ శాంతికుమారి ఆదేశాలు
విధాత, హైదరాబాద్ : అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ను జూలై నెలాఖరులోగా పూర్తిగా ప్లాస్టిక్ రహిత జోన్గా మార్చేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ను ప్లాస్టిక్ ఫ్రీ జోన్గా మార్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై బుదవారం డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో అటవీ, పంచాయతీరాజ్, కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో సీఎస్ సమావేశమై చర్చించారు.
అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ప్రాంతంలో ప్లాస్టిక్ వస్తువుల వినియోగంపై నిషేధం అమలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారులను ఆదేశించారు. కాగితపు సంచులు, గుడ్డ/జనపనార సంచులు, విస్తరాకులు మొదలైన పర్యావరణ అనుకూల ఉత్పత్తుల వినియోగం పై ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారా ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని నివారించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని నివారించి ప్రత్యామ్నాయాలను ప్రోత్సహించడానికి అమ్రాబాద్ అటవీ ప్రాంతంలో అదనపు చెక్ పోస్టులను ఏర్పాటు చేయాలని తెలిపారు.
ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలలో ప్రచారంతో పాటు పంచాయతీలలో, జిల్లా, రాష్ట్ర స్థాయిలలో సైన్ బోర్డులు ఏర్పాటు చేయడం ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు తెలియజేశారు. టైగర్ రిజర్వ్ ఏరియాలో ప్లాస్టిక్ వాడకంపై నిషేధం గురించి హైవే వెంట ఉన్న స్థానిక వ్యాపారులకు అవగాహన కల్పించాలన్నారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలోని నాలుగు ఆవాసాల్లో నివాసముంటున్న ప్రజలను తరలించే ప్రక్రియను వేగవంతం చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు.
హరిత నిధి కింద ఉన్న నిధులను సంబందిత వార్షిక సంవత్సరంలోనే వినియోగించుకోవాలని స్పష్టం చేశారు. మహబూబ్నగర్ జిల్లాలోని మైసమ్మ దేవాలయంలో ప్లాస్టిక్ వాడకాన్ని నిర్మూలించేందుకు చర్యలు తీసుకోవాలని ఎండోమెంట్ శాఖ అధికారులను సీఎస్ కోరారు. అటవీ శాఖ ముఖ్యకార్యదర్శి వాణీ ప్రసాద్, పంచాతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, పీసీసీఎఫ్ ఆర్.యం. డోబ్రియాల్, టీఎస్పీఎస్బీ సభ్య కార్యదర్శి బుద్ధ ప్రకాష్ జ్యోతి, కమిషనర్ ఎండోమెంట్స్ హనుమంత రావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ప్లాస్టిక్ ఫ్రీ జోన్గా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్టు
అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ప్రాంతలో జూలై 1వ తేదీ నుంచి ప్లాస్టిక్ వస్తువులను పూర్తిగా నిషేదిస్తున్నట్లు అటవీశాఖా చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ అధికారి ఈలుసింగ్ మీరూ తెలిపారు. ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ను అనుమతించబోమని, సందర్శకులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. వచ్చే పర్యాటకుల కోసం నీటి సమస్యలు తలెత్తకుండా వారు సందర్శించే మార్గ మధ్యలో అనుకూలమైన ప్రదేశాలలో తగిన నీటి సదుపాయాలు ఏర్పాటు చేస్తామన్నారు. సందర్శకులు తమవెంట తీసుకువచ్చే ఆహార పదార్థాల వ్యర్థాలను నిర్దేశించిన స్థలలో ఏర్పాటు చేసిన చెత్త కుండీలలోనే వేయాలని సూచించారు.